Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భారీ ఆధిక్యం దిశగా టీమిండియా
- భారత్ 493/6
టీమిండియా యువ ఓపెనర్ మయాంక్ అగర్వాల్ టెస్ట్ క్రికెట్లో అదరగొడుతున్నాడు. బంగ్లాదేశ్పై డబుల్ సెంచరీని బాది డ్యాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ను గుర్తుకు తెచ్చాడు. నెలరోజుల వ్యవధిలోనే మయాంక్ రెండో ద్విశతకం పూర్తిచేయడం విశేషం. ఇండోర్ వేదికగా బంగ్లాదేశ్తో జరుగుతున్న తొలిటెస్ట్ రెండోరోజు ఆటలో మయాంక్ 196 పరుగుల వద్ద మెహదీ హసన్ వేసిన బంతిని భారీ సిక్సర్గా మలిచి డబుల్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మొత్తమ్మీద 330 బంతులు ఆడి 28 ఫోర్లు, 8 భారీ సిక్సర్ల సాయంతో 243 పరుగులు చేసి మెహదీ హసన్ బౌలింగ్లో అబు జాయేద్ క్యాచ్ పట్టడంతో పెవిలియన్కు చేరాడు.
ఇండోర్: బంగ్లాదేశ్తో జరుగుతున్న తొలి టెస్టు రెండోరోజు ఆటలో టీమిండియా భారీ ఆధిక్యత దిశగా దూసుకెళ్తోంది. ఓపెనర్ మయాంక్ అగర్వాల్(243) డబుల్ సెంచరీకి తోడు అజింక్యా రహానే(86)తో కలిసి 4వ వికెట్కు 190 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. వీరిద్దరి నిష్క్రమణ అనంతరం జడేజా(60నాటౌట్) అర్ధసెంచరీతో కదం తొక్కడంతో టీమిండియా రెండోరోజు ఆట ముగిసే సమయానికి 493/6తో పటిష్ట స్థితిలో నిలిచింది. దీంతో టీమిండియా ఆట ముగిసే సమయానికి 343 పరుగుల ఆదిక్యం సాధించింది.
ఓవర్నైట్ స్కోర్ వికెట్ నష్టానికి 86 పరుగులతో శుక్రవారం ఆటను కొనసాగించిన మయాంక్ అగర్వాల్-చతేశ్వర్ పుజారా 91 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. ఈ క్రమంలోనే చతేశ్వర పుజారా(54) అర్ధ సెంచరీ పూర్తయిన తర్వాత రెండో వికెట్గా పెవిలియన్ చేరగా, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ(0) విఫలమయ్యాడు. తాను ఆడిన రెండో బంతికి కోహ్లీ డకౌట్గా పెవిలియన్ చేరాడు. అనంతరం క్రీజులోకొచ్చిన రహానే మయాంక్ అగర్వాల్తో కలిసి భారీ భాగస్వామాన్ని నమోదు చేశాడు. ఈ క్రమంలో మయాంక్ సెంచరీ సాధించగా.. రహానే (172 బంతుల్లో 86; 9 ఫోర్లు) తృటిలో సెంచరీని చేజార్చుకున్నాడు. అనంతరం ఆదే ఊపుతో చెలరేగి ఆడిన మయాంక్ డబుల్ సెంచరీ పూర్తయిన తర్వాత.. జట్టు స్కోరు 432 వద్ద భారీ షాట్కు యత్నించి క్యాచ్ ఔట్గా పెవీలియన్కు చేరాడు. ఆ తర్వాత వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా 11 బంతులు ఆడి 12 పరుగులు చేసి ఆరో వికెట్గా పెవిలియన్ చేరాడు. రెండోరోజు ఆట నిలిచిపోయే సమయానికి జడేజా(60), యాదవ్(25) పరుగులతో క్రీజ్లో ఉన్నారు. దీంతో భారత్కు బంగ్లాదేశ్పై ఇప్పటికే 343 పరుగుల భారీ ఆధిక్యత లభించినట్లైంది. అబు జాయేద్కు నాలుగు, ఇబాదత్ హొసైన్, మెహిదీ హసన్లకు తలా ఒక వికెట్ దక్కాయి.
సెంచరీ చేజార్చుకున్న రహానే
టీమిండియా మిడిలార్డర్ బ్యాట్స్మన్ అజింక్యా రహానే తృటిలో సెంచరీ చేసే అవకాశాన్ని చేజార్చుకున్నాడు. ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (271)తో కలిసి నాలో వికెట్కు 190 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పిన రహానే తైజుల్ ఇస్లామ్ బౌలింగ్లో జాయేద్కు క్యాచ్ ఇచ్చి పెవీలియన్కు చేరాడు. అజింక్యా 172 బంతులను ఎదుర్కొని 9 ఫోర్ల సాయంతో 86 పరుగులు చేశాడు. జట్టు స్కోర్ 315 పరుగుల వద్ద అజింక్యా రహానే ఔటవ్వడంతో ఆల్రౌండర్ జడేజా క్రీజ్లోకి వచ్చి అర్ధసెంచరీతో మెరిసి అజేయంగా నిలిచాడు.
స్కోర్బోర్డు...
బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్ - 150 ఆలౌట్
భారత్ తొలి ఇన్నింగ్స్: మయాంక్ అగర్వాల్ (సి) అబు జాయేద్ (బి) మెహదీ హసన్ 243, రోహిత్ శర్మ (సి) లింటన్ దాస్ (బి) అబు జాయేద్ 6, ఛటేశ్వర పుజరా (సి) సైఫ్ హసన్ (బి) అబు జయేద్ 54, విరాట్ కోహ్లీ (ఎల్బి) అబు జాయేద్ 0, రహానే (సి) తైజుల్ (బి)అబు జాయేద్ 86, జడేజా (బ్యాటింగ్) 60, వృద్ధిమాన్ సాహా (బి) ఇబాదత్ హొసైన్ 12, ఉమేష్ యాదవ్ (బ్యాటింగ్) 25, అదనం 7. (114 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి) 493 పరుగులు.
వికెట్ల పతనం: 1/14, 2/105, 3/119, 4/309, 5/432, 6/454
బౌలింగ్: ఇబాదత్ హొసైన్ 31-5-115-1, అబు జాయేద్ 25-3-108-4, తైజుల్ ఇస్లామ్ 28-4-120-0, మెహిదీ హసన్ 27-0-125-1, మహ్మదుల్లా 3-0-24-0