Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వరల్డ్ పారాఅథ్లెటిక్స్ చాంపియన్షిప్లో 9 పతకాలు
దుబాయ్: దుబాయిలో నిర్వహించిన 'ప్రపంచ పారా అథ్లెటిక్స్ చాంపియన్షిప్-2019'లో భారత అథ్లెట్లు సత్తాచాటారు. తొమ్మిది పతకాలతో మెగాటోర్నీ చరిత్రలో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చారు. ఈ టోర్నీలో మన అథ్లెట్స్ మొత్తం 9 పతకాల (2 స్వర్ణాలు, 2 రజతాలు, 5 కాంస్యాలు)తో పాయింట్ల పట్టికలో 24వ స్థానంతో ముగించారు. అలాగే 2020లో టోక్యోలో జరగనున్న పారాలింపిక్స్లో 13 బెర్త్లను దక్కించుకున్నారు. ఇంతకు ముందు లండన్ (2017)లో జరిగిన పోటీల్లో స్వర్ణం సహా ఐదు పతకాలు చేజిక్కించుకొని 34వ స్థానంలో నిలిచిన భారత్.. ఈసారి పది స్థానాలు మెరుగుపర్చుకోవడం విశేషం. పతకాల పట్టికలో చైనా (59) అగ్రస్థానంలో నిలువగా.. బ్రెజిల్ (39), గ్రేట్ బ్రిటన్ (28)లు తర్వాతి స్థానాల్లో నిలిచాయి. జావెలిన్ త్రోలో భారత అథ్లెట్ సందీప్ చౌదరి (ఎఫ్ 44 కేటగిరీ) 65.80 మీటర్ల దూరం విసిరి స్వర్ణం చేజిక్కించుకోవడంతో పాటు సరికొత్త వరల్డ్ రికార్డ్ నెలకొల్పాడు. మరో భారత అథ్లెట్ సుమిత్ (62.88 మీ.) రజతం దక్కించుకున్నారు. జావెలిన్ ఎఫ్ 46 విభాగంలో సుందర్ సింగ్ గుర్జార్ 61.22 మీటర్లతో బంగారు పతకం కైవసం చేసుకుంటే.. హైజంప్లో శరత్ కుమార్ 1.83 మీటర్ల ఎత్తు దూకి రజతం గెలుచుకున్నారు.