Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఫ్లడ్లైట్ల వెలుగులో తొలి డే అండ్ నైట్ టెస్టుకు సన్నద్ధం
భోపాల్: సమిష్టి ప్రదర్శనతో తొలి టెస్టులో బంగ్లాపై ఇన్నింగ్స్ 130 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన భారత్.. మరో చారిత్రాత్మక సమరానికి సన్నద్ధమవుతున్నది. ప్రతిష్టాత్మక డే అండ్ నైట్ టెస్టు సన్నద్ధత కోసం ఆదివారం నుంచి ఫ్లడ్లైట్ల వెలుతురులో ఆటగాళ్లు నెట్స్లో ప్రాక్టీస్ చేస్తున్నారు. అలాగే ఈ టెస్టులో పింక్బాల్ను ఉపయోగించనున్న నేపథ్యంలో ఇరు జట్లు దీనిపై దృష్టిని సారించాయి. బంతిని సమర్థవంతంగా ఎదుర్కోవడంపై ప్రత్యేకంగా సన్నద్ధమవుతున్నాయి. కోల్కతాలోని ఈడెన్ గార్డెన్ వేదికగా రెండో టెస్టు నవంబర్ 22న ప్రారంభం కానున్నది. తొలి టెస్టు మూడు రోజుల్లోనే ముగియడంతో.. డే అండ్ నైట్ టెస్టుకు ముందు రెండు రోజుల అదనపు సమయం లభించింది. దీంతో అటు బంగ్లా, ఇటు టీమిండియా ఆటగాళ్లు పింక్బాల్తో ప్రాక్టీస్ కొనసాగించారు. రోహిత్ శర్మ, ఛటేశ్వర్ పుజారా, రవిచంద్రన్ అశ్విన్ తొలిసారి ఫ్లడ్లైట్ల వెలుతురులో గులాబి బంతితో ప్రాక్టీస్ చేశారు. శనివారం బంగ్లాతో మ్యాచ్ ముగిశాక హౌల్కర్ స్టేడియంలో కోచ్ రవిశాస్త్రి పర్యవేక్షణలో శిక్షణ కొనసాగింది. కోల్కతా డే అండ్ నైట్ టెస్టు మ్యాచ్ కోసం గులాబి బంతికి అలవాటు పడేందుకు హౌల్కర్ మైదానంలో సాధన చేశారు. కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా ఈ బంతితో సాధన చేశాడు. రిజర్వు బ్యాట్స్మెన్ హనుమ విహారి, శుభ్మన్ గిల్ సైతం సాధన చేయడం గమనార్హం.
స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్ బౌలింగ్ను రాత్రిసమయంలో రోహిత్ శర్మ ఎదుర్కొన్నాడు. కోచ్ రవిశాస్త్రి బంతి ప్రవర్తనను దగ్గరుండి పరిశీలించారు. కూకాబుర్ర గులాబి బంతులతో దులీప్ ట్రోఫీలో ఆడిన అనుభవం కుల్దీప్కు ఉంది. అతడు బంతిని ఫ్లైట్ చేసినప్పుడు సీమ్ను అందుకోవడంలో బ్యాట్స్మన్ ఇబ్బంది పడ్డారు.
బంగ్లా సైతం..
తొలి డే అండ్ నైట్ టెస్టుకు ముందు రెండు రోజుల అదనపు సమయంను భారత్తో పాటు బంగ్లాదేశ్ కూడా సద్వినియోగం చేసుకునేందుకు ఇండోర్లోనే ఉన్నది. ఆదివారం ఇరు జట్లు ఇక్కడ గులాబీ బంతితో ప్రాక్టీస్ కోనసాగించాయి. ఇరు జట్లలో చాలా మంది సభ్యులకు పింక్ బంతి కదలికలపై పెద్దగా అవగాహన లేదు. అందుకే ఈ రెండు రోజులు ఇక్కడే ఉండి ప్రాక్టీస్ కొనసాగిస్తున్నాయని అధికారిక సమాచారం. తర్వాతి టెస్టు మ్యాచ్కోసం భారత్, బంగ్లాదేశ్ జట్లు మంగళవారం కోల్కతాకు చేరుకుంటాయి.
రానున్న అమిత్ షా, బంగ్లా ప్రధాని షేక్ హసీనా
కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా భారత్-బంగ్లాదేశ్ జట్ల మధ్య జరగనున్న తొలి డే అండ్ నైట్ టెస్టుకు కేంద్ర హౌంమంత్రి అమిత్ షా హాజరు కానున్నారు. భారత్లో తొలిసారి డే అండ్ నైట్ టెస్ట్ ఆడనుండంతో.. ఈ చారిత్రక ఘట్టాన్ని మరింత అపురూపంగా మలచడానికి క్రికెట్ ఆసోసియేషన్ ఆఫ్ బెంగాల్ (క్యాబ్) కృషి చేస్తున్నది. ఈ మ్యాచ్కు బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీలు ముఖ్య అతిథులుగా హాజరు కానున్నారు.