Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- క్రీడా సమాఖ్యల్లో పురుషులదే ఆధిపత్యం
- పాలనలో మహిళలకు దక్కని ప్రాధాన్యం
నవతెలంగాణ క్రీడా విభాగం
భారత క్రీడా రంగం ముఖచిత్రంగా అమ్మాయిలు ఎదిగారు. రియో ఒలింపిక్స్ నుంచి ఇటీవల జరిగిన ప్రపంచ చాంపియన్షిప్స్ వరకూ అన్నింటా అమ్మాయిలు అదరగొట్టారు. అంతర్జాతీయ వేదికల్లో తడాఖా చూపించారు. అంతర్జాతీయ వేదికపై పురుషులు పతకాల వేటలో తడబడుతున్న వేళ అమ్మాయిలు అలవోకగా మెడల్స్ సాధిస్తున్నారు. క్రికెట్ సహా ఇతర క్రీడల్లో ఇప్పుడు మహిళలు స్టార్స్గా ఎదిగారు. భారత క్రీడా రంగం కొత్తగా చూస్తున్న శుభ పరిణామం ఇది. భారత్లోనే కాదు అంతర్జాతీయ స్థాయిలోనూ క్రీడా రంగంలో మహిళల హవా పెరిగింది. అన్ని క్రీడల్లోనూ పురుషులతో సమానంగా, కొన్నిసార్లు పురుషుల కంటే ఎక్కువగానే మెరుస్తున్నారు. ఫిఫా పురుషుల ప్రపంచకప్తో పోల్చితే మహిళల ఫిఫా ప్రపంచకప్కు క్రేజ్ తక్కువ. కానీ గత రెండు ప్రపంచకప్లలో అమ్మాయిలు తమ విన్యాసాలతో ఆ వ్యత్యాసం గణనీయంగా తగ్గించేందుకు కృషి చేశారు. జట్టు క్రీడలకు కాకుండా వ్యక్తిగత క్రీడాంశాల్లో తొలి నుంచీ అమ్మాయిలది స్పష్టమైన ఆధిపత్యం. ఇది నిర్వివాదాంశం!. అంతర్జాతీయ క్రీడా రంగంలో ఇది నాణెనికి ఒక వైపు మాత్రమే. క్రీడా రంగంలోని క్రీడా సంఘాల పాలనలో మాత్రం పురుషుల తిరుగులేని ఆధిపత్యం కొనసాగుతోంది. అథ్లెట్లుగా పురుషుల కంటే మెరుగైన ఫలితాలు సాధించిన మహిళలు.. పరిపాలకులుగా మాత్రం వివక్ష ఎదుర్కొంటున్నారు. భారత్లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఈ వివక్ష కొనసాగుతోంది. ఇటీవల ఓ ప్రముఖ పత్రిక క్రీడా సమాఖ్యల్లో మహిళల ప్రాతినిథ్యంపై సర్వే నిర్వహించగా ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి.
అన్ని సంఘాల్లో అదే దుస్థితి : ప్రపంచ క్రీడా సమాఖ్యల్లో పాలక మండలిలో మహిళల ప్రాతినిథ్యం ప్రధానంగా నిర్వహించిన ' లింగ వైవిధ్యం' సర్వేలో ప్రాతినిథ్య అంతరాలు చాలా ఎక్కువగా కనిపించాయి. ప్రపంచంలోని పది అతి పెద్ద క్రీడా సమాఖ్యల్లో మహిళల ప్రాతినిథ్యం విస్తుగొలిపే స్థాయిలో ఉంది. ఎగ్జిక్యూటివ్ స్థాయిలో మహిళలు అతి తక్కువగా కనిపిస్తున్నారు. ఇంటర్నేషల్ ఒలింపిక్ కమిటీ, అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్, ఇంటర్నేషనల్ బాస్కెట్బాల్ ఫెడరేషన్, వరల్డ్ రగ్బీ, వరల్డ్ అథ్లెటిక్స్, ఇంటర్నేషనల్ గోల్ఫ్ ఫెడరేషన్, ఇంటర్నేషనల్ టెన్నిస్ ఫెడరేషన్, ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్, ఇంటర్నేషనల్ సైక్లింగ్ యూనియన్లలో ఎగ్జిక్యూటివ్, పాలక మండలి స్థాయిలో మహిళల ప్రాతినిథ్యం చాలా తక్కువగా ఉంది. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్లో అత్యధికంగా లింగ అసమానతలు కొనసాగుతున్నాయి. ఐసీసీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో 18 మంది సభ్యులు ఉన్నారు. అందులో కేవలం ఒకే ఒక్క మహిళా ప్రతినిధి ఉండటం గమనార్హం. మిగిలిన తొమ్మిది క్రీడా సమాఖ్యల్లో మహిళా ప్రతినిధుల ప్రాతినిథ్యం 40 శాతం, 30 శాతం కంటే తక్కువగా ఉంది. మూడు క్రీడా సమాఖ్యలు కనీస స్థాయిలో 25 శాతం మహిళా ప్రతినిధులకు చోటు ఇవ్వగా.. పదింటిలో ఏ ఒక్క క్రీడా సమాఖ్యకు మహిళా ప్రతినిధి సారథ్యం వహించకపోవటం శోచనీయం. గత ఏడాది అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ కొన్ని కీలక సంస్కరణలు చేసింది. ఐసీసీ లింగ సమానత్వ సమీక్షా ప్రాజెక్ట్ సిఫారసుల్లో భాగంగా లింగ వైవిధ్యం కోసం తగు చర్యలు తీసుకుంది. ఐఓసీ ఎగ్జిక్యూటివ్ బోర్డులో ప్రస్తుతం 15 మంది మహిళలు ఉన్నారు. ఐఓసీ కమిషన్లో 40 మంది మహిళా ప్రతినిధులు ఉన్నారు. 2013 గణాంకాలతో పోల్చితే 2019లో ఐఓసీలో మహిళా ప్రాతినిథ్యం రెట్టింపు అయ్యింది. అయినా, ఇప్పటికీ లింగ సమానత్వం సాధించలేదని చెప్పవచ్చు.
భారత్లోనూ ఈ పరిస్థితి కొనసాగుతోంది. బీసీసీఐ ఆఫీస్ బేరర్లలో జస్టిస్ లోధా కమిటీ సిఫారసుల తర్వాతే మహిళా ప్రతినిథికి అవకాశం లభించింది. రాష్ట్ర క్రికెట్ సంఘాలలో తమిళనాడు క్రికెట్ సంఘానికి మాత్రమే మహిళ అధ్యక్షురాలిగా కొనసాగుతున్నారు. క్రికెట్ సహా ఇతర ప్రధాన క్రీడా సమాఖ్యల్లోనూ ఇదే పరిస్థితి కొనసాగుతోంది. మాజీ అథ్లెట్లను సలహాదారులుగా తీసుకునేందుకు మాత్రమే సమాఖ్యలు మొగ్గు చూపుతున్నాయి. పరిపాలనలో మాత్రం మహిళలకు స్థానం దక్కనీయటం లేదు. సమాన అవకాశాలు, సమాన హక్కుల కోసం పోరాడుతున్న ఈ సమయంలో అన్ని క్రీడా సమాఖ్యలు పరిపాలన కమిటీల్లో సమాన ప్రాతినిథ్యంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ప్రపంచవ్యాప్తంగా అన్ని క్రీడా సమాఖ్యలు ఇప్పుడు వ్యాపార కోణంలో ఆలోచిస్తున్నాయి. భారత క్రీడా సమాఖ్యలు అందుకు మినహాయింపు కాదు. క్రీడలు ఎల్లప్పుడు ఎవరు ఆడుతున్నారు? ఎవరు చూస్తున్నారు? అనే పరిధికే పరిమితం కాకూడదు. పరిపాలనలో ఎవరు ఉన్నారనే అంశం సైతం ఇప్పుడు కీలకం. క్రీడల్లో మహిళా అథ్లెట్ల ప్రాతినిథ్యం రోజు రోజుకూ గణనీయంగా పెరుగుతుంది. ఈ పరిస్థితుల్లో పరిపాలనలో మహిళా ప్రతినిధులకు స్థానం లభించినప్పుడే మహిళా అథ్లెట్ల సమస్యలకు సత్వర పరిష్కారం లభించేందుకు అవకాశం ఉంటుంది.