Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చర్చనీయాంశంగా ట్రైనర్ వ్యవహారం
ముంబయి : పాలకుల కమిటీ (సీఓఏ) నియామకంపై మరోసారి దుమారం రేగుతోంది. భారత జట్టు కండిషనింగ్, ఫిట్నెస్ ట్రైనర్గా శంకర్ బసు విప్లవాత్మక ముద్ర వేశాడు. టీమ్ ఇండియాను ఫిట్నెస్ జట్టుగా తీర్చిదిద్దటంలో శంకర్ బసు కృషి అసమానం. 2019 ప్రపంచకప్ తర్వాత శంకర్ బసు తప్పుకున్నారు. కొత్త ట్రైనర్ కోసం పాలకుల కమిటీ దరఖాస్తులు ఆహ్వానించింది. ప్రాక్టికల్ పరీక్షలకు ఢిల్లీ క్యాపిటల్స్ ట్రైనర్ ఎస్. రజినీకాంత్ సైతం హాజరయ్యారు. సీఓఏ నియమించిన ప్యానల్ రజినీకాంత్ను కాదని న్యూజిలాండ్కు చెందిన నిక్ వెబ్ను ఎంచుకుంది. ఇక్కడి వరకూ అంతా బాగానే ఉంది. ఇక్కడ నిక్ వెబ్పై పనితీరు బాగా లేదనే వాదనకు తావు లేదు. ఎందుకంటే ఇప్పుడే అతడి పనితీరుపై ఓ అంచనాకు రావటం కష్టం. కానీ భారత ఆటగాళ్లు రజినీకాంత్ పర్యవేక్షణలో శిక్షణ పొందుతున్నారు. ఇది చర్చనీయాంశంగా మారింది. జశ్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్య భారత జట్టు ప్రణాళికల్లో అత్యంత కీలక ఆటగాళ్లు. వీరు గాయపడగానే బీసీసీఐ ఇంగ్లాండ్లో శస్త్రచికిత్సకు ఏర్పాట్లు చేసింది. సహజంగా ఫిట్నెస్ సాధించేందుకు ఆటగాళ్లను బెంగళూర్లోని నేషనల్ క్రికెట్ అకాడమీకి పంపుతారు. కానీ జశ్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్య ఇప్పుడు ఎన్సీఏలో లేరు. ఢిల్లీ క్యాపిటల్స్ ట్రైనర్ రజినీకాంత్ పర్యవేక్షణలో బుమ్రా ముంబయి క్రికెట్ సంఘంలో కసరత్తులు చేస్తున్నాడు. పాండ్య సైతం ఎన్సీఏలో ఫిట్నెస్ సాధించేందుకు మొగ్గు చూపటం లేదు. ఈ ఇద్దరు ఆటగాళ్లు 2020 న్యూజిలాండ్ సిరీస్ సమయానికి అందుబాటులోకి రావాలని జట్టు మేనేజ్మెంట్ కోరుకుంటోంది. ఫిట్నెస్ ట్రైనర్ కేంద్రంగా ఇప్పుడు భారత జట్టులో కొత్త చర్చకు తెరలేచింది. సౌరభ్ గంగూలీ ఈ అంశాన్ని ఏ విధంగా పరిగణనలోకి తీసుకుంటారనేది ఆసక్తికరం.