Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ
కోల్కత : సౌరభ్ గంగూలీ బీసీసీఐ అధ్యక్షుడిగా బాధ్యతలు అందుకోగానే చేపట్టిన తొలి కార్యక్రమం గులాబీ టెస్టు మ్యాచ్. వచ్చీ రాగానే బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ)కి గులాబీ ఆహ్వానం పంపిన గంగూలీ.. సానుకూల స్పందన రాబట్టాడు. జట్టు మేనేజ్మెంట్ నుంచీ వెంటనే గ్రీన్ సిగల్ సాధించాడు. చారిత్రక పింక్ బాల్ టెస్టు నిర్వహణకు గంగూలీ ప్రచారకర్తగా వ్యవహరించాడు. నవంబర్ 22 నుంచి కోల్కతలోని ఈడెన్ గార్డెన్స్లో జరిగిన ఈ టెస్టు కోసం నగరం పూర్తిగా గులాబీ మయం అయిపోయింది. దేశమంతా గులాబీ టెస్టు గురించి మాట్లాడుకునే విధంగా ఏర్పాట్లు చేశారు. భారత్, బంగ్లాదేశ్ తొలి డే నైట్ గులాబీ బంతి మ్యాచ్ విజయవంతమైంది. సంప్రదాయ క్రికెట్ చూసేందుకు ఈడెన్ గార్డెన్స్ అభిమానులతో నిండిపోయింది. మూడు రోజుల ఆటలోనూ ఇదే దృశ్యం కనిపించింది. దీంతో టెస్టు క్రికెట్లో గులాబీ బంతి మ్యాచ్లపై ఆసక్తి ఎక్కువైంది. ఈ నేపథ్యంలో సౌరభ్ గంగూలీ వ్యాఖ్యలు మరింత ప్రాధాన్యత సంతరించుకున్నాయి. పండుగ తరహాలో ఏడాదికి ఓ మ్యాచ్ కాకుండా.. ప్రతి సిరీస్లో ఓ డే నైట్ టెస్టు ఉండేలా చూస్తామని దాదా వ్యాఖ్యానించాడు. ఓ మేగజైన్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో గంగూలీ ఈ వ్యాఖ్యలు చేశారు. ' గులాబీ బంతి టెస్టుపై నేను ఎంతో నమ్మకంగా ఉన్నాను. టెస్టు క్రికెట్ను ముందుకు తీసుకెళ్లేందుకు ఇది సరైన మార్గం అని భావిస్తున్నాను. ప్రతి టెస్టు గులాబీ బంతితో కాకపోయినా.. కనీసం సిరీస్లో ఓ మ్యాచ్ గులాబీ బంతితో ఆడేలా చూస్తాం. కోల్కత గులాబీ టెస్టు నిర్వహణలో నా అనుభవం బీసీసీఐ సభ్యులతో పంచుకుంటాను. ఇతర వేదికల్లోనూ గులాబీ టెస్టు నిర్వహణకు ప్రయత్నిస్తాం. ఈడెన్ గార్డెన్ టెస్టు తర్వాత గులాబీ బంతిపై అందరూ సిద్ధంగా ఉన్నారు. 5000 అభిమానుల నడుమ టెస్టు క్రికెట్ ఆడటాన్ని ఎవరూ కోరుకోవటం లేదు' అని సౌరభ్ గంగూలీ అన్నాడు. గంగూలీ వ్యాఖ్యలతో 2020 న్యూజిలాండ్ పర్యటనలో భారత్, న్యూజిలాండ్ గులాబీ బంతి పోరులో తలపడే అవకాశాలు ఉన్నాయనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
సెలక్టర్లకు మూడేండ్లే! : సెలక్షన్ కమిటీ పదవీ కాలంపై సౌరభ్ గంగూలీ కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో ప్రపంచకప్ ప్రణాళికను దృష్టిలో ఉంచుకుని సెలక్షన్ కమిటీ పదవీ కాలం నాలుగేండ్లుగా నిర్దారించారని, ఇప్పుడు ఆ అవసరం లేదని గంగూలీ అభిప్రాయపడ్డాడు. ' నాలుగేండ్ల పదవీ కాలం చాలా ఎక్కువ. నాలుగేండ్ల కాలాన్ని ప్రపంచకప్ను గమనంలో ఉంచుకుని నిర్ణయించారు. ఇప్పుడు అదంతా గతం. కొత్తగా మూడేండ్ల పదవీ కాలంతో సెలక్షన్ కమిటీని ప్రయత్నిద్దాం' అని గంగూలీ పేర్కొన్నాడు. చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్, గగన్ ఖోడాలు నాలుగేండ్ల కాలం పూర్తి చేసుకున్నారు. దీంతో సెలక్షన్ కమిటీలో వీరి చివరి సమావేశం ముగిసిపోయింది. బీసీసీఐ నిబంధనల ప్రకారం సెలక్షన్ కమిటీలో ఐదుగురు సభ్యులు ఉండాలి. ఐదు జోన్ల నుంచి ఒక్కో సెలక్టర్ ప్రాతినిథ్యం వహించాలి. సౌత్ జోన్ నుంచి ఎమ్మెస్కే ప్రసాద్ స్థానంలో భారత మాజీ లెగ్ స్పిన్నర్ లక్ష్మణ్ శివనారాయణన్ను సెలక్షన్ కమిటీ సారథ్యానికి ఎంచుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. గగన్ ఖోడా స్థానంలో సెంట్రల్ జోన్ నుంచి జ్ఞానేంద్ర పాండే పేరు వినిపిస్తోంది. దిలీప్ వెంగ్సర్కార్ను చీఫ్ సెలక్టర్గా తీసుకోవాలనే వాదన వినిపిస్తున్నా వాస్తవంగా అవకాశాలు తక్కువే అని చెప్పాలి. జతిన్ పరంజిపె (వెస్ట్ జోన్), సరణ్దీప్ సింగ్ (నార్త్ జోన్), దేవాంగ్ గాంధి (ఈస్ట్ జోన్) మరో ఏడాది పాటు సెలక్షన్ కమిటీలో కొనసాగనున్నారు.