Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీ20 వరల్డ్కప్ జట్టులో చోటు కోసం పోటీ
- ప్రతి మ్యాచ్ ప్రదర్శన కీలకమే
నవతెలంగాణ-హైదరాబాద్
2019 ప్రపంచకప్ నిష్క్రమణ నుంచి తేరుకున్న టీమ్ ఇండియా.. మరో వరల్డ్కప్ వేటకు సిద్ధమవుతోంది. ఆస్ట్రేలియాలో జరుగనున్న 2020 టీ20 ప్రపంచకప్కు భారత్ సన్నాహకం అప్పుడే మొదలైంది. బ్యాటింగ్ లైనప్లో టాప్ ఆర్డర్ ఎలా ఉండాలి, మిడిల్ ఆర్డర్ పాత్ర ఎలా ఉండాలి అనే అంశాలపై జట్టు మేనేజ్మెంట్ ఓ స్పష్టతతో ఉంది. ధనాధన్ వరల్డ్కప్ వేట కావటంతో బౌలింగ్ లైనప్ సైతం బ్యాట్తో సత్తా చాటాల్సిన అవసరం ఉంటుందని కెప్టెన్ విరాట్ కోహ్లి ఇప్పటికే తన ప్రాధమ్యాన్ని వెల్లడించాడు. భారత్ 2016 టీ20 ప్రపంచకప్లో సెమీఫైనల్లో నిష్క్రమించింది. 2016 టీ20 వరల్డ్కప్ తర్వాత 20 ఓవర్ల ఫార్మాట్లో టీమ్ ఇండియా ఏకంగా 45 మంది ఆటగాళ్లను బరిలోకి దింపింది. టీ20 ప్రపంచకప్కు ఏడాది కంటే తక్కువ సమయం ఉన్న తరుణంలో ప్రపంచకప్ జట్టు కూర్పు ఎలా ఉండాలనే విషయంపై ఇప్పుడు విపరీతమైన చర్చ నడుస్తోంది. స్వదేశంలో వెస్టిండీస్తో భారత్ మూడు మ్యాచుల టీ20 సవాల్కు రంగం సిద్ధం చేసుకుంది. 2020 టీ20 ప్రపంచకప్ జట్టులో చోటు ఖాయం చేసుకుని కొందరు ఆటగాళ్లు విండీస్పై దీమాగా బరిలోకి దిగుతున్నారు. మరికొందరు తామూ వరల్డ్కప్ జట్టులో ఉండేందుకు అర్హులమే అని చాటేందుకు కసితో కదం తొక్కనున్నారు. పొట్టి ఫార్మాట్లో ఎప్పటికీ వెస్టిండీస్ బలమైన జట్టుగానే నిలుస్తుంది. 20 ఓవర్ల ఆటలో విండీస్కు లోతైన బ్యాటింగ్ లైనప్ ఉంది. బౌలింగ్లోనూ కరీబియన్లది మెరుగైన బృందం. వెస్టిండీస్తో టీ20 సవాల్లో సిరీస్ ఫలితంపై ఎవరికీ అనుమానం లేదు. కానీ వ్యక్తిగత ప్రదర్శనలతో ఎవరు వరల్డ్కప్ జట్టులో నిలిచేందుకు సెలక్టర్ల దృష్టిని ఆకట్టుకుంటారనేది కీలకంగా మారింది.
2020 ప్రపంచకప్ జట్టులో సుమారు 8 మంది ఆటగాళ్లు తమ స్థానాలను ఖాయం చేసుకున్నారని చెప్పవచ్చు. 15 మందితో కూడిన వరల్డ్కప్ జట్టులో ఇంకో ఏడు స్థానాలపైనే పీట ముడి కొనసాగుతోంది. కెప్టెన్ విరాట్ కోహ్లి, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ సహా కెఎల్ రాహుల్, శ్రేయాష్ అయ్యర్లు బ్యాటింగ్ లైనప్లో స్థానాలు ఖాయం చేసుకున్నారు. ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యకు అసలు పోటీ లేదు. బౌలింగ్ విభాగంలో జశ్ప్రీత్ బుమ్రా, దీపక్ చాహర్ సహా స్పిన్నర్ యుజ్వెంద్ర చాహల్లు ఆస్ట్రేలియా విమానం ఎక్కటం లాంఛనమే. జట్టు కీలక ఆటగాళ్లను మినహాయిస్తే శ్రేయాష్ అయ్యర్ ఒక్కడే ఇటీవల నిలకడగా రాణిస్తూ ప్రపంచకప్ జట్టులో చోటు ఖాయం చేసుకున్నాడు!. ఏడు టీ20ల్లోనే ఆడిన శ్రేయాష్ అయ్యర్ తన నైపుణ్యంతో పొట్టి జట్టులో కీలకంగా ఎదిగాడు. గాయంతో కొంత కాలంగా ఆటకు దూరమైన హార్దిక్ పాండ్య పూర్తి ఫిట్నెస్ సాధించగానే నేరుగా జట్టులోకి రానున్నాడు. హార్దిక్ పాండ్యకు పోటీనిచ్చే ఆల్రౌండర్ను భారత్ ఇంకా దొరకబుచ్చుకోలేదు.
ఏడు స్థానాల కోసం పోటీపడుతున్న జాబితా కొంత పెద్దగానే కనిపిస్తోంది. బ్యాటింగ్ లైనప్లో శిఖర్ ధావన్, మనీశ్ పాండే, రిషబ్ పంత్, సంజూ శాంసన్ సహా ఎం.ఎస్ ధోని రేసులో ఉన్నారు. ఆల్రౌండర్ల కోటాలో శివం దూబె, కృనాల్ పాండ్య, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్లు ఆశల పల్లకిలో కొనసాగుతున్నారు. స్పిన్ విభాగంలో కుల్దీప్ యాదవ్ ముందు వరుసలో నిల్చుకున్నాడు. రాహుల్ చాహర్ సైతం పోటీ పడుతున్నాడు. భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమి, నవదీప్ సైని పేస్ బాధ్యతలు పంచుకునేందుకు ఎదురుచూస్తున్నారు. కుల్దీప్ యాదవ్, భువనేశ్వర్ కుమార్, శిఖర్ ధావన్, రవీంద్ర జడేజాలు ప్రపంచకప్ జట్టుకు ఓ మంచి ప్రదర్శన దూరంలో ఉన్నారు. రిషబ్ పంత్కు సంజూ శాంసన్ నుంచి గట్టి పోటీ ఎదురు కానుంది. అయితే, ముందుగా తనను తాను నిరూపించుకునేందుకు సంజూ శాంసన్కు ఓ అవకాశం దక్కాలి. రెగ్యులర్ ఓపెనర్ శిఖర్ ధావన్ స్థానంలో జట్టులోకి వచ్చిన సంజూ శాంసన్ను జట్టు మేనేజ్మెంట్ ఓపెనర్గా పరిగణనలోకి తీసుకుంటేనే అతడు వెస్టిండీస్తో తుది జట్టులో నిలిచే అవకాశం ఉంది. మనీశ్ పాండే ఇటీవలే సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 ఫైనల్లో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మన్గా మెరుగైన మనీశ్ పాండే సైతం ప్రపంచకప్ జట్టుకు ఓ మంచి ప్రదర్శన దూరంలోనే ఉన్నాడని చెప్పవచ్చు.
వెస్టిండీస్తో తాజా సిరీస్లో రిషబ్ పంత్, సంజూ శాంసన్, మనీశ్ పాండేలు ప్రపంచకప్ జట్టు ఎంపికను దృష్టిలో ఉంచుకుని ఆడాల్సి ఉంటుంది. వెస్టిండీస్ సిరీస్తో పాటు రానున్న న్యూజిలాండ్ పర్యటనలో ఐదు టీ20ల్లోనూ నిలకడ సాధిస్తే ఈ ముగ్గురికీ వరల్డ్కప్ బెర్త్ లభించే అవకాశం ఉంది. పేసర్లు భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమి సైతం టీ20ల్లోనూ ప్రభావశీల బౌలర్లుగా నిరూపించుకునేందుకు వెస్టిండీస్తో సిరీస్ ఓ వేదిక. బంగ్లాదేశ్తో సిరీస్లో నిరాశపరిచిన శివం దూబెకు సైతం విండీస్పై మంచి అవకాశం లభించనుంది. ధనాధన్ హిట్టర్గా శివం తనేంటో క్రికెట్ ప్రపంచానికి చూపించేందుకు సిద్ధమవుతున్నాడు.
ప్రాక్టీస్ ప్రాక్టీస్.. :
భారత్, వెస్టిండీస్ ఉప్పల్ స్టేడియంలో శుక్రవారం తొలి టీ20 పోరులో తలపడనున్నాయి. మంగళవారం హైదరాబాద్కు చేరుకున్న టీమ్ ఇండియా బుధవారం ప్రాక్టీస్ మొదలు పెట్టింది. వెస్టిండీస్ ఓ రోజు ముందుగానే సాధన ఆరంభించిన సంగతి తెలిసిందే. టీమ్ ఇండియా నెట్స్లో కఠోరంగా శ్రమించింది. యువ ఆటగాళ్లు రిషబ్ పంత్, సంజూ శాంసన్, శివం దూబెలు ఎక్కువగా బ్యాటింగ్పై దృష్టి సారించారు. ఈ ముగ్గురు బ్యాట్స్మెన్ నెట్స్లో భారీ షాట్లను ఎక్కువగా సాధన చేశారు. కెప్టెన్ విరాట్ కోహ్లి, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మలు సైతం నెట్స్లో బ్యాటింగ్ సాధన చేశారు. అంతకముందు జట్టు రోటిన్ కసరత్తులు ముగించుకుంది. ప్రధాన పిచ్కు సమీపంలో రిషబ్ పంత్ వికెట్ కీపింగ్ ప్రాక్టీస్ చేశాడు. కోచ్ పంత్కు క్యాచింగ్ ప్రాక్టీస్లో సహాయం చేశారు. ఉదయం సెషన్లో వెస్టిండీస్ జట్టు సైతం నెట్స్లో చెమటోడ్చింది. కెప్టెన్ కీరన్ పొలార్డ్ బ్యాట్తో భారీ షాట్లు సాధన చేశాడు. మ్యాచ్కు ముందు రోజు నేడు సైతం ఇరు జట్లు ఉప్పల్ మైదానంలో ప్రాక్టీస్ సెషన్లో పాల్గొననున్నాయి.