Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మెరిసిన షార్దుల్, కుల్దీప్, సైని
- శ్రీలంక 142/9
నవతెలంగాణ-ఇండోర్ : పరుగుల వరద పారే ఇండోర్ హౌల్కర్ పిచ్పై శ్రీలంక బ్యాట్స్మెన్ తేలిపోయారు. జశ్ప్రీత్ బుమ్రాను మినహాయిస్తే ద్వితీయ శ్రేణి పేసర్లతో బరిలోకి దిగిన టీమ్ ఇండియా.. ఇండోర్లో శ్రీలంకను స్వల్ప స్కోరుకే పరిమితం చేసింది. భారీ స్కోర్లకు ప్రసిద్ధి చెందిన హౌల్కర్ మైదానంలో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 142/9 పరుగులే చేసింది. బ్యాటింగ్కు స్వర్గధామ పిచ్పై శ్రీలంక నుంచి ఎవ్వరూ అర్ధ సెంచరీ నమోదు చేయలేదు. గాయం నుంచి కోలుకుని తొలి మ్యాచ్ ఆడుతున్న జశ్ప్రీత్ బుమ్రా (1/32) రాణించాడు. సీమర్లు షార్దుల్ ఠాకూర్ (3/23), నవదీప్ సైని (2/18), కుల్దీప్ యాదవ్ (2/38) శ్రీలంకను కట్టడి చేశారు. శ్రీలంక బ్యాట్స్మెన్ కుశాల్ పెరీరా (34, 28 బంతుల్లో 3 సిక్స్లు), అవిష్క ఫెర్నాండో (22, 16 బంతుల్లో 5 ఫోర్లు), గుణతిలక (20, 21 బంతుల్లో 3 ఫోర్లు) ఆ జట్టుకు గౌరవప్రద స్కోరు అందించారు.
తేలిపోయిన లంకేయులు : టాస్ నెగ్గిన టీమ్ ఇండియా తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ స్వర్గధామం ఇండోర్లో తొలుత బ్యాటింగ్కు వచ్చిన శ్రీలంక ఏ దశలోనూ అందుకు తగినట్టు ఆడలేదు. పవర్ ప్లేలో 48 పరుగులు చేసిన శ్రీలంక మెరుగైన స్కోరు చేసేలా కనిపించింది. ఓపెనర్లు గుణతిలక (20), అవిష్క ఫెర్నాండో (22) చూడచక్కని స్ట్రోక్తో ఎనిమిది ఫోర్లు కొట్టారు. పవర్ ప్లే స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ ఓవర్లో అవిష్క ఫెర్నాండో వికెట్ కోల్పోయాడు. మూడో స్థానంలో వచ్చిన కుశాల్ పెరీరా (34) వస్తూనే విరుచుకుపడ్డాడు. మూడు సిక్సర్లు బాదిన పెరీరా శ్రీలంక ఇన్నింగ్స్కు ఊపు తీసుకొచ్చాడు. పెరీరా క్రీజులో ఉన్నంతసేపు శ్రీలంక భారీ స్కోరు చేసేలా కనిపించింది. కుల్దీప్ యాదవ్ మాయలో పడిన పెరీరా వికెట్ కోల్పోయాడు. ఆ తర్వాత వచ్చిన బ్యాట్స్మెన్ ఎవ్వరూ రాణించలేదు. ఒషాడె ఫెర్నాండో (10), భానుక రాజపక్సె (9), దసున్ శనక (7)లు పూర్తిగా నిరాశపరిచారు. పీఎస్ఎల్, బీపీఎల్లో రాణించిన రాజపక్సె భారత్పై మెరుస్తాడనే అంచనాలు ఎక్కువగా కనిపించాయి. కానీ 12 బంతులు ఆడిన రాజపక్సె ఓ ఫోర్ 9 పరుగులే చేశాడు. సైని బౌలింగ్లో వికెట్ కీపర్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. లోయర్ ఆర్డర్లో యువ ఆల్రౌండర్ వానిందు హసరంగ డిసిల్వ (16 నాటౌట్, 10 బంతుల్లో 3 ఫోర్లు) ఆఖరు ఓవర్ హీరోయిక్స్ శ్రీలంకకు 140 ప్లస్ స్కోరు అందించాయి. బుమ్రా వేసిన ఆఖరి ఓవర్ చివరి మూడు బంతుల్లో హ్యాట్రిక్ ఫోర్లు బాదిన హసరంగ ఔరా అనిపించాడు. ధనంజయ డిసిల్వ (17, 13 బంతుల్లో 2 ఫోర్లు) సైతం మెరిశాడు. ఇసురు ఉదాన (1), లసిత్ మలింగ (0) నిరాశపరిచారు. నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయిన శ్రీలంక 142 పరుగులు చేసింది.
ఛేదనలో దూకుడు : 143 పరుగుల ఛేదనలో టీమ్ ఇండియా దూసుకుపోతుంది!. ఓపెనర్లు లోకేశ్ రాహుల్, శిఖర్ ధావన్ ధాటిగా మొదలెట్టారు. ప్రత్యేకించి రాహుల్ వరుస బౌండరీలతో విరుచుకుపడగా, ధావన్ స్ట్రయిక్రొటేట్ చేస్తూ చక్కటి సహకారం అందించాడు. 8 ఓవర్లలో భారత్ 63/0తో కొనసాగుతోంది. కెఎల్ రాహుల్ (44), శిఖర్ ధావన్ (17) అజేయంగా ఆడుతున్నారు.
స్కోరు వివరాలు :
శ్రీలంక ఇన్నింగ్స్ : ధనుష్క గుణతిలక (బి) నవదీప్ సైని 20, అవిష్క ఫెర్నాండో (సి) నవదీప్ సైని (బి) వాషింగ్టన్ సుందర్ 22, కుశల్ పెరీరా (సి) శిఖర్ ధావన్ (బి) కుల్దీప్ యాదవ్ 34, ఒషాడె ఫెర్నాండో (స్టంప్డ్) రిషబ్ పంత్ (బి) కుల్దీప్ యాదవ్ 10, భానుక రాజపక్సె (సి) రిషబ్ పంత్ (బి) నవదీప్ సైని 9, దసున్ శనక (బి) జశ్ప్రీత్ బుమ్రా 7, ధనంజయ డిసిల్వ (సి) శివం దూబె (బి) షార్దుల్ ఠాకూర్ 17, వానిందు హసరంగ నాటౌట్ 16, ఇసురు ఉదాన (సి) నవదీప్ సైని (బి) షార్దుల్ ఠాకూర్ 1, లసిత్ మలింగ (సి) కుల్దీప్ యాదవ్ (బి) షార్దుల్ ఠాకూర్ 0, ఎక్స్ట్రాలు : 06, మొత్తం : (20 ఓవర్లలో 9 వికెట్లకు) 142.
వికెట్ల పతనం : 1-38, 2-54, 3-82, 4-97, 5-104, 6-117, 7-128, 8-130, 9-130.
బౌలింగ్ : జశ్ప్రీత్ బుమ్రా 4-0-32-1, షార్దుల్ ఠాకూర్ 4-0-23-3, నవదీప్ సైని 4-0-18-2, వాషింగ్టన్ సుందర్ 4-0-29-1, కుల్దీప్ యాదవ్ 4-0-38-1.