Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాణించిన రాహుల్, అయ్యర్, సైని
- శ్రీలంకపై 7 వికెట్ల తేడాతో గెలుపు
- 1-0తో సిరీస్లో ముందంజ
నవతెలంగాణ-ఇండోర్ : 2020ని కోహ్లిసేన అద్భుతంగా ఆరంభించి. టీమ్ ఇండియా కంచుకోట ఇండోర్లో ఇరగదీసే ప్రదర్శన చేసిన కోహ్లిగ్యాంగ్ 7 వికెట్ల తేడాతో శ్రీలంకపై ఘన విజయం సాధించింది. 143 పరుగుల లక్ష్యాన్ని 17.3 ఓవర్లలోనే ఊదేసింది. టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ కెఎల్ రాహుల్ (45, 32 బంతుల్లో 6 ఫోర్లు), శిఖర్ ధావన్ (32, 29 బంతుల్లో 2 ఫోర్లు), శ్రేయాష్ అయ్యర్ (34, 26 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్), విరాట్ కోహ్లి (30 నాటౌట్, 17 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్స్లు) సమష్టిగా రాణించారు. టాప్-4 మెరుపులతో టీమ్ ఇండియా రెండో టీ20లో సులువుగా నెగ్గింది. మూడు మ్యాచుల టీ20 సిరీస్లో 1-0 ఆధిక్య సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 142/9 పరుగులే చేసింది. బ్యాటింగ్కు స్వర్గధామ పిచ్పై శ్రీలంక నుంచి ఎవ్వరూ అర్ధ సెంచరీ నమోదు చేయలేదు. గాయం నుంచి కోలుకుని తొలి మ్యాచ్ ఆడుతున్న జశ్ప్రీత్ బుమ్రా (1/32) రాణించాడు. సీమర్లు షార్దుల్ ఠాకూర్ (3/23), నవదీప్ సైని (2/18), కుల్దీప్ యాదవ్ (2/38) శ్రీలంకను కట్టడి చేశారు. శ్రీలంక బ్యాట్స్మెన్ కుశాల్ పెరీరా (34, 28 బంతుల్లో 3 సిక్స్లు), అవిష్క ఫెర్నాండో (22, 16 బంతుల్లో 5 ఫోర్లు), గుణతిలక (20, 21 బంతుల్లో 3 ఫోర్లు) ఆ జట్టుకు గౌరవప్రద స్కోరు అందించారు. మూడో టీ20 శుక్రవారం పుణెలో జరుగనుంది.
టాప్-4 చెడుగుడు : 143 పరుగుల ఛేదనలో భారత టాప్ ఆర్డర్ సమష్టిగా మెరిసింది. పవర్ ప్లేలో ఓపెనర్లు కెఎల్ రాహుల్, శిఖర్ ధావన్ రెచ్చిపోగా.. మిడిల్ ఓవర్లలో శ్రేయాష్ అయ్యర్, విరాట్ కోహ్లి ధనాధన్ ఆడేశారు. రాహుల్ ఆరంభంలో దూకుడుగా బ్యాటింగ్ చేశాడు. అతడి ధాటికి తొలి వికెట్కు భారత్ 71 పరుగులు జోడించి విజయం లాంఛనం చేసుకుంది. తొలుత నెమ్మదిగా ఆడిన శిఖర్ ధావన్ వేగం పెంచే క్రమంలోనే వికెట్ కోల్పోయాడు. బ్యాటింగ్ ఆర్డర్లో ముందుకొచ్చిన అయ్యర్, కోహ్లితో కలిసి కీలక భాగస్వామ్యం నమోదు చేశాడు. కోహ్లి రెండు సిక్సర్లు కొట్టగా.. అయ్యర్ కొట్టిన ఓ సిక్సర్ స్టేడియం పైకప్పుకు తగిలింది. గెలుపు ముంగిట అయ్యర్ అవుటైనా రిషబ్ పంత్ (1) తోడుగా కెప్టెన్ కోహ్లి కొత్త ఏడాదిని విజయంతో ముగించాడు. శ్రీలంక యువ స్పిన్నర్ వానిందు హసరంగ డిసిల్వ (2/30) ఆకట్టుకున్నాడు.
తేలిపోయిన లంకేయులు : టాస్ నెగ్గిన టీమ్ ఇండియా తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ స్వర్గధామం ఇండోర్లో తొలుత బ్యాటింగ్కు వచ్చిన శ్రీలంక ఏ దశలోనూ అందుకు తగినట్టు ఆడలేదు. పవర్ ప్లేలో 48 పరుగులు చేసిన శ్రీలంక మెరుగైన స్కోరు చేసేలా కనిపించింది. ఓపెనర్లు గుణతిలక (20), అవిష్క ఫెర్నాండో (22) చూడచక్కని స్ట్రోక్తో ఎనిమిది ఫోర్లు కొట్టారు. పవర్ ప్లే స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ ఓవర్లో అవిష్క ఫెర్నాండో వికెట్ కోల్పోయాడు. మూడో స్థానంలో వచ్చిన కుశాల్ పెరీరా (34) వస్తూనే విరుచుకుపడ్డాడు. మూడు సిక్సర్లు బాదిన పెరీరా శ్రీలంక ఇన్నింగ్స్కు ఊపు తీసుకొచ్చాడు. పెరీరా క్రీజులో ఉన్నంతసేపు శ్రీలంక భారీ స్కోరు చేసేలా కనిపించింది. కుల్దీప్ యాదవ్ మాయలో పడిన పెరీరా వికెట్ కోల్పోయాడు. ఆ తర్వాత వచ్చిన బ్యాట్స్మెన్ ఎవ్వరూ రాణించలేదు. ఒషాడె ఫెర్నాండో (10), భానుక రాజపక్సె (9), దసున్ శనక (7)లు పూర్తిగా నిరాశపరిచారు. పీఎస్ఎల్, బీపీఎల్లో రాణించిన రాజపక్సె భారత్పై మెరుస్తాడనే అంచనాలు ఎక్కువగా కనిపించాయి. కానీ 12 బంతులు ఆడిన రాజపక్సె ఓ ఫోర్ 9 పరుగులే చేశాడు. సైని బౌలింగ్లో వికెట్ కీపర్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. లోయర్ ఆర్డర్లో యువ ఆల్రౌండర్ వానిందు హసరంగ డిసిల్వ (16 నాటౌట్, 10 బంతుల్లో 3 ఫోర్లు) ఆఖరు ఓవర్ హీరోయిక్స్ శ్రీలంకకు 140 ప్లస్ స్కోరు అందించాయి. బుమ్రా వేసిన ఆఖరి ఓవర్ చివరి మూడు బంతుల్లో హ్యాట్రిక్ ఫోర్లు బాదిన హసరంగ ఔరా అనిపించాడు. ధనంజయ డిసిల్వ (17, 13 బంతుల్లో 2 ఫోర్లు) సైతం మెరిశాడు. ఇసురు ఉదాన (1), లసిత్ మలింగ (0) నిరాశపరిచారు. నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయిన శ్రీలంక 142 పరుగులు చేసింది.
శ్రీలంక ఇన్నింగ్స్ : ధనుష్క గుణతిలక (బి) నవదీప్ సైని 20, అవిష్క ఫెర్నాండో (సి) నవదీప్ సైని (బి) వాషింగ్టన్ సుందర్ 22, కుశల్ పెరీరా (సి) శిఖర్ ధావన్ (బి) కుల్దీప్ యాదవ్ 34, ఒషాడె ఫెర్నాండో (స్టంప్డ్) రిషబ్ పంత్ (బి) కుల్దీప్ యాదవ్ 10, భానుక రాజపక్సె (సి) రిషబ్ పంత్ (బి) నవదీప్ సైని 9, దసున్ శనక (బి) జశ్ప్రీత్ బుమ్రా 7, ధనంజయ డిసిల్వ (సి) శివం దూబె (బి) షార్దుల్ ఠాకూర్ 17, వానిందు హసరంగ నాటౌట్ 16, ఇసురు ఉదాన (సి) నవదీప్ సైని (బి) షార్దుల్ ఠాకూర్ 1, లసిత్ మలింగ (సి) కుల్దీప్ యాదవ్ (బి) షార్దుల్ ఠాకూర్ 0, ఎక్స్ట్రాలు : 06, మొత్తం : (20 ఓవర్లలో 9 వికెట్లకు) 142.
వికెట్ల పతనం : 1-38, 2-54, 3-82, 4-97, 5-104, 6-117, 7-128, 8-130, 9-130.
బౌలింగ్ : జశ్ప్రీత్ బుమ్రా 4-0-32-1, షార్దుల్ ఠాకూర్ 4-0-23-3, నవదీప్ సైని 4-0-18-2, వాషింగ్టన్ సుందర్ 4-0-29-1, కుల్దీప్ యాదవ్ 4-0-38-1.
భారత్ ఇన్నింగ్స్ : కెఎల్ రాహుల్ (బి) హసరంగ 45, శిఖర్ ధావన్ (ఎల్బీ) హసరంగ 32, శ్రేయాష్ అయ్యర్ (సి) శనక (బి) లహిరు కుమార 34, విరాట్ కోహ్లి నాటౌట్ 30, రిషబ్ పంత్ నాటౌట్ 1, ఎక్స్ట్రాలు : 02, మొత్తం : (17.3 ఓవర్లలో 3 వికెట్లకు) 144.
వికెట్ల పతనం : 1-71, 2-86, 3-137.
బౌలింగ్ : లసిత్ మలింగ 4-0-41-0, లహిరు కుమార 3.3-0-30-1, ధనంజయ డిసిల్వ 2-0-15-0, శనక 4-0-26-0, హసరంగ 4-0-30-2.