Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 256 టార్గెట్ను ఊదేసిన ఓపెనర్లు
-వాంఖడెలో భారత్కు దారుణ ఓటమి
నవతెలంగాణ-ముంబయి
వాంఖడెలో టీమ్ ఇండియాకు హ్యాట్రిక్ ఓటమి. సొంతగడ్డపై వరుస విజయాలతో దూసుకుపోతున్న టీమ్ ఇండియా.. ముంబయి వాంఖడెలో మాత్రం వరుసగా మూడో వన్డేలో ఓటమి చవిచూసింది. ఆస్ట్రేలియా ఓపెనర్లు డెవిడ్ వార్నర్ (128 నాటౌట్, 112 బంతుల్లో 17 ఫోర్లు, 3 సిక్స్లు), అరోన్ ఫించ్ (110 నాటౌట్, 114 బంతుల్లో 13 ఫోర్లు, 2 సిక్స్లు) అజేయ సెంచరీలతో చెలరేగారు. డెవిడ్ వార్నర్, అరోన్ ఫించ్ మెరుపులతో 256 పరుగుల లక్ష్యాన్ని ఆస్ట్రేలియా 37.4 ఓవర్లలోనే ఊదేసింది. ఆస్ట్రేలియా 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 255 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ శిఖర్ ధావన్ (74, 91 బంతుల్లో 9 ఫోర్లు, 1 సిక్స్), లోకేశ్ రాహుల్ (47, 61 బంతుల్లో 4 ఫోర్లు) రాణించారు. మూడు వన్డేల సిరీస్లో ఆస్ట్రేలియా 1-0తో ఆధిక్యం సాధించింది. సిరీస్లో రెండో వన్డే శుక్రవారం రాజ్కోట్లో జరుగనుంది.
ఓపెనర్లే ఊదేశారు : భారీ లక్ష్యాలను టాప్ ఆర్డర్ మెరుపులతోనే ఊదేసిన రికార్డు భారత్ సొంతం. తొలిసారి భారత్కు ఆ చేదు అనుభవం రుచి చూపించింది ఆసీస్. ఫ్లాట్ వికెట్పై డెవిడ్ వార్నర్ (128), అరోన్ ఫించ్ (110) అద్భుత శతకాలు నమోదు చేశారు. డెవిడ్ వార్నర్ ఓ సారి క్యాచ్, మరోసారి ఎల్బీగా అవుటైనా.. సమీక్షకు వెళ్లి ఇన్నింగ్స్ కొనసాగించాడు. తొలుత కెప్టెన్ అరోన్ ఫించ్ నెమ్మదిగా ఆడాడు. విధ్వంసక ఓపెనర్ వార్నర్ తనదైన శైలిలో విరుచుకుపడ్డాడు. ఆరు ఫోర్లు, రెండు సిక్సర్లతో 40 బంతుల్లోనే అర్ధ సెంచరీ బాదాడు. ఎనిమిది ఫోర్లు, ఓ సిక్స్తో ఫించ్ 52 బంతుల్లో ఫిఫ్టీ మార్క్ అందుకున్నాడు. పవర్ప్లేలో 84 పరుగులు చేసి ఆస్ట్రేలియాను గెలుపు బాటలో నిలిపిన ఓపెనర్లు అదే జోరుతో కుమ్మేశారు. డజను ఫోర్లు, మూడు సిక్సర్లతో 88 బంతుల్లో వార్నర్ శతకబాదగా, ఫించ్ 108 బంతుల్లో ఆ ఘనత సాధించాడు. 2019 వరల్డ్కప్ సెమీఫైనల్లో ఇంగ్లాండ్ చేతిలో ఓటమి తర్వాత ఆస్ట్రేలియా తొలిసారి వాంఖడెలోనే వన్డే ఆడింది. అగ్ర జట్టు భారత్పై 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
ఔరా ఆసీస్ సీమర్లు : ఫ్లాట్ వికెట్పై ఓపెనర్ రోహిత్ శర్మ (10)ను త్వరగా కోల్పోయిన భారత్ను శిఖర్ ధావన్, కెఎల్ రాహుల్ ఆదుకున్నారు. ఈ ఇద్దరూ రెండో వికెట్కు 121 పరుగులు జోడించారు. 134/1తో భారీ స్కోరు దిశగా సాగిన భారత్.. ఆసీస్ బౌలర్ల ధాటికి 164/5తో పీకల్లోతు కష్టాల్లో పడింది. విరాట్ కోహ్లి (16), శ్రేయాష్ అయ్యర్ (4) విఫలమయ్యారు. రిషబ్ పంత్ (28), రవీంద్ర జడేజా (25), కుల్దీప్ యాదవ్ (17) భారత్కు గౌరవప్రద స్కోరు అందించారు. స్టార్క్ బంతి తలకు తగలటంతో రిషబ్ పంత్ వికెట్ కీపింగ్కు రాలేదు. కెఎల్ రాహుల్ వికెట్ కీపింగ్ బాధ్యతలు చూసుకున్నాడు. ఫ్లాట్ వికెట్పై వైవిధ్యం చూపించిన ఆసీస్ బౌలర్లు భారత్ను కట్టడి చేశారు. మిచెల్ స్టార్క్ (3/56), కమిన్స్ (2/44), రిచర్డ్సన్ (2/43)లు రాణించారు. స్పిన్నర్లు ఆగర్ (1/56), జంపా (1/53) ఆకట్టుకున్నారు.