Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పునరాగమనంలో మెరిసిన సానియా మీర్జా
- డబుల్స్ క్వార్టర్ఫైనల్లో ప్రవేశం
హౌబర్ట్ : మహిళల డబుల్స్ మాజీ వరల్డ్ నం.1, ఆరు గ్రాండ్స్లామ్ టైటిళ్ల విజేత, భారత టెన్నిస్ ముఖచిత్రం సానియా మీర్జా పునరాగమనం ఘనంగా మొదలెట్టింది. సుమారు రెండేండ్ల పాటు కోర్టుకు బయట గడిపిన సానియా మీర్జా 2020లో మళ్లీ రాకెట్ పట్టింది. మంగళవారం జరిగిన హౌబర్ట్ ఇంటర్నేషనల్ టోర్నీలో సానియా మీర్జా మహిళల డబుల్స్లో అదిరే ఆరంభం చేసింది. ఉక్రెయిన్ క్రీడాకారిణి నదియా కిచనోక్ జతగా సానియా మీర్జా హౌబర్టలో క్వార్టర్ఫైనల్లో కాలుమోపింది. జపాన్ ప్లేయర్ మియు కటో, జార్జీయా ప్లేయర్ ఒక్సానాలపై 2-6, 7-6(7-3), 10-3తో సానియా, నదియా జోడీ గెలుపొందింది. మూడు సెట్ల పాటు ఉత్కంఠగా సాగిన మ్యాచ్లో విజయం కోసం సానియా జోడీ 101 నిమిషాల పాటు పోరాడింది. నేడు జరిగే క్వార్టర్ఫైనల్లో అమెరికా జోడీ వానియా కింగ్, క్రిస్టినా మెకాలెలతో తలపడనుంది.
తడబడినా.. నిలబడింది : 33 ఏండ్ల సానియా మీర్జా రెండేండ్ల విరామం తర్వాత తిరిగి రాకెట్ పట్టగానే ఆమెపై అంచనాలతో పాటు అనుమానాలు సైతం ఉన్నాయి. మునుపటి రీతిలో ప్రభావశీల అథ్లెట్గా తన ముద్ర చూపించగలదా? అనే ప్రశ్నలు ఎదురయ్యాయి. పునరాగమనంలో తొలి విజయంతోనే సానియా మీర్జా పూర్వపు ఫామ్ అందుకోకపోయినా.. తనలో ఇంకా టెన్నిస్ మిగిలి ఉందని చాటి చెప్పింది. సానియా, నదియాలు తొలి సెట్లో చెత్తగా ఆడారు. రెండు డబుల్ ఫాల్ట్స్, ఏడు బ్రేక్ పాయింట్లు సద్వినియోగం చేసుకోలేని అలసత్వం, రెండు సర్వ్లు కోల్పోవటం సానియా జోడీని వెనుకంజలో నిలిపింది. దీంతో తొలి సెట్లో 2-6తో ఓటమి తప్పలేదు. రెండో సెట్లో సానియా, నదియా పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. ప్రత్యర్థుల నిలకడ లేమి ఆటతీరు సైతం కలిసొచ్చింది. సానియా జోడీ మూడు బ్రేక్ పాయింట్లు సాధించగా, ప్రత్యర్థి జంట సైతం మూడు బ్రేక్ పాయింట్లు సొంతం చేసుకుంది. ఉత్కంఠగా సాగిన రెండో సెట్లో 6-6తో స్కోరు సమం అయ్యింది. టైబ్రేకర్లో పైచేయి సాధించిన సానియా జోడీ 7-3తో రెండో సెట్ టైబ్రేకర్లో ఆధిక్యం సాధించింది, మ్యాచ్ను నిర్ణయాత్మక మూడో సెట్కు తీసుకెళ్లింది. మూడో సెట్లో బలమైన రిటర్న్లతో అలరించిన సానియా మీర్జా మెరుపు ప్రదర్శన చేసింది. సానియా జోరుతో మూడో సెట్లో 10-3తో అలవోకగా గెలుపు దక్కింది. 2017 చైనా ఓపెన్లో మోకాలి గాయంతో ఆటకు దూరమైన సానియా మీర్జా, ఆ తర్వాత కుమారుడు ఇజహాన్కు జన్మనిచ్చేందుకు మాతృత్వ సెలవులో గడిపింది. ప్రసవానంతరం 25 కేజీలు బరువు పెరిగిన సానియా మీర్జా నాలుగు నెలలు జిమ్లో చెమట చిందింది. నిజానికి సానియా నవంబర్లోనే పునరాగమనం చేయాల్సింది. బరువు తగ్గినా, మ్యాచ్ ఫిట్నెస్ కోసం సానియా మీర్జా మరికొంత కాలం వేచి చూసింది. విజయంతో క్వార్టర్స్లోకి అడుగుపెట్టిన క్షణాన, కుమారుడు ఇజహాన్తో సానియా మీర్జా ఆనందం పంచుకుంది.
నా జీవితంలో ప్రత్యేకమైన రోజు : ' నా జీవితంలో ఈ రోజు అత్యంత ప్రత్యేకమైన రోజుల్లో ఒకటి. సుదీర్ఘ విరామం తర్వాత నా తల్లిదండ్రులు, నా కుమారుడు పక్కనుండగా తొలి మ్యాచ్ ఆడుతున్నాను. పునరాగమనంలో తొలి మ్యాచ్లో గెలిచాం. నేను అందుకుంటున్న ప్రేమాభిమానాలకు ఎంతో సంతోషపడుతున్నాను. నమ్మకం మనల్ని గెలుపు తీరాలకు తీసుకెళ్తుంది. అనువు బేబీ (కుమారుడు ఇజహాన్) మనం సాధించాం' అని తొలి రౌండ్ విజయానంతరం సానియా మీర్జా ట్వీట్ చేసింది.