Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కోహ్లి, రోహిత్, బుమ్రాలకు టాప్ గ్రేడ్
- బీసీసీఐ వార్షిక కాంట్రాక్టు విడుదల
ముంబయి : భారత క్రికెట్ దిగ్గజం మహేంద్రసింగ్ ధోని కెరీర్ ఈ ఏడాది ముగియనుందని బీసీసీఐ పరోక్ష సంకేతాలు అందించింది. జాతీయ జట్టు ప్రణాళికల్లో ఉండే ఆటగాళ్లకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ప్రతి ఏడాది ప్రకటించే వార్షిక కాంట్రాక్టు జాబితా నుంచి ఎం.ఎస్ ధోని పేరు గల్లంతైంది. టెస్టులకు దూరమైనా గత ఏడాది ఏ గ్రేడ్ కాంట్రాక్టు పొందిన ధోనికి ఈసారి సెలక్టర్లు మొండిచేయి చూపించారు. 2019 వరల్డ్కప్ సెమీఫైనల్స్ తర్వాత మహి మ్యాచ్లో కనిపించలేదు. 2020 ఐపీఎల్లో చెన్నై తరఫున నేరుగా బరిలోకి దిగనున్నాడు. మూడు ఫార్మాట్లలో భారత స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, జశ్ప్రీత్ బుమ్రాలు అత్యున్నత ఏ ప్లస్ గ్రేడ్ కాంట్రాక్టు నిలుపుకున్నారు. ఏ ప్లస్ గ్రేడ్ ఆటగాళ్లకు ఏడాదికి రూ. 7 కోట్ల వేతనం అందనుండగా.. ఏ గ్రేడ్ ఆటగాళ్లకు రూ. 5 కోట్లు, బీ గ్రేడ్ ఆటగాళ్లకు రూ. 3 కోట్లు, సీ గ్రేడ్ ఆటగాళ్లకు రూ. 1 కోటి చొప్పున బీసీసీఐ ఇస్తుంది. గాయంతో చాలా కాలంగా క్రికెట్కు దూరమైన స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్య బి గ్రేడ్లో ఉండగా, ఆస్ట్రేలియాతో సిరీస్లో అరంగ్రేటం చేసిన మయాంక్ అగర్వాల్ తొలిసారి కేంద్ర కాంట్రాక్టు అందుకుని, ఏడాదికి రూ. 3 కోట్లు అందుకోనున్నాడు. బీసీసీఐ కాంట్రాక్టు జాబితాలో లేని ఆటగాడు జాతీయ జట్టుకు ఎంపికై ఏ ఫార్మాట్లోనైనా రెండు మ్యాచులు ఆడితే నేరుగా సీ గ్రేడ్ కాంట్రాక్టు పొంది, ఏడాది రూ. 1 కోటి తీసుకుంటాడు. మహిళా క్రికెటర్ల జాబితాలో దిగ్గజం మిథాలీరాజ్ గ్రేడ్ను తగ్గించారు. టీ20 ఫార్మాట్కు దూరమైన మిథాలీ గ్రేడ్ బిలో ఏడాదికి రూ.30 లక్షలు అందుకోనుంది. గ్రేడ్ ఏలో హర్మన్ప్రీత్ కౌర్, స్మృతీ మంధాన, పూనమ్ యాదవ్ ఏడాది రూ. 50 లక్షలు తీసుకోనున్నారు.
బీసీసీఐ 2019-20 కాంట్రాక్టు జాబితా :
గ్రేడ్ ఏ ప్లస్ : విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, జశ్ప్రీత్ బుమ్రా
గ్రేడ్ ఏ : అశ్విన్, జడేజా, భువనేశ్వర్ కుమార్, చతేశ్వర్ పుజార, అజింక్య రహానె, శిఖర్ ధావన్, మహ్మద్ షమి, ఇషాంత్ శర్మ, కుల్దీప్ యాదవ్, రిషబ్ పంత్, కెఎల్ రాహుల్.
గ్రేడ్ బి : ఉమేశ్ యాదవ్, యుజ్వెంద్ర చాహల్, హార్దిక్ పాండ్య, వృద్దిమాన్ సాహా, మయాంక్ అగర్వాల్.
గ్రేడ్ సి : కేదార్ జాదవ్, మనీశ్ పాండే, హనుమ విహారి, నవదీప్ సైని, దీపక్ చాహర్, షార్దుల్ ఠాకూర్, శ్రేయాష్ అయ్యర్, వాషింగ్టన్ సుందర్.