Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విజయంపై కోహ్లిసేన చూపు
- సిరీస్ విజయంపై కన్నేసిన కంగారూ
- భారత్, ఆస్ట్రేలియా రెండో వన్డే నేడు
- మధ్యాహ్నాం 1.30 నుంచి స్టార్స్పోర్ట్స్లో..
వాంఖడెలో వరుసగా మూడు. ఆస్ట్రేలియాకు వరుసగా నాలుగు. వన్డే ఫార్మాట్లో టీమ్ ఇండియా పరాజయాల రికార్డు ఇది. గత పర్యటనలో ఆస్ట్రేలియాకు హ్యాట్రిక్ విజయాలు అందించి సిరీస్ చేజార్చుకున్న కోహ్లిసేన.. తాజాగా మరో సిరీస్ కోల్పోయే ప్రమాదంలో పడింది. సిరీస్లో ఆరంభ మ్యాచ్లో ఓటమి ఎదుర్కొవటం భారత్కు ఇది తొలిసారి కాదు. గతంలోనూ ఐదు పర్యాయాలు ఈ పరిస్థితిని చవిచూసింది. అందులో నాలుగుసార్లు పుంజుకుని సిరీస్ను సొంతం చేసుకుంది. ఆ విజయాలకు కోహ్లి, రోహిత్ సారథ్యం వహించటం నేటి మ్యాచ్లో భారత్కు కలిసొచ్చే అంశం. ఆస్ట్రేలియా సిరీస్ కైవసం చేసుకోవాలని చూస్తుండగా, లెక్క సరి చేయాలని భారత్ భావిస్తోంది. భారత్, ఆస్ట్రేలియా రెండో వన్డే సమరం నేడు.
నవతెలంగాణ-రాజ్కోట్
2020 టీ20 వరల్డ్కప్ నేపథ్యంలో ఈ ఏడాది భారత్ ప్రథమ ప్రాధాన్యత పొట్టి ఫార్మాట్దే. 2021 ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్షిప్స్ ఫైనల్లో చోటు సాధించేందుకు మరో అడుగే మిగిలి ఉండగా.. టెస్టులపై కోహ్లిసేన ఫోకస్ ఏమాత్రం తగ్గలేదు. ఏ కోణంలో చూసినా టీమ్ ఇండియా ప్రాధాన్యత జాబి తాలో వన్డేలకు మూడో స్థానమే దక్కుతోంది. అలాగని, ముంబయి వాంఖడెలో చవిచూసిన 10 వికెట్ల పరాజయాన్ని కప్పిపుచ్చలేము. అగ్రజట్ల నడుమ సమరం అనగానే విజేత ఎవరో ఆఖరు బంతి వరకూ నిర్ణయించలేము. అయినా, సొంతగడ్డపై కోహ్లిసేనకు ఈ స్థాయిలో ఓటమినీ ఎవరూ అంచనా వేయలేదు. విరాట్ కోహ్లి నాయకత్వంలో భారత్ ఇప్పటికే ఆస్ట్రేలియాకు ఓ సిరీస్ కోల్పోయింది. ఇప్పుడు మరోసారి ఆ వైఫల్యం పునరావృతం అయ్యే ప్రమాదం ముంచుకొస్తుంది. అన్ని రంగాల్లో అద్భుత జోరుతో ఉన్న ఆస్ట్రేలియా రాజ్కోట్లోనే సిరీస్ విజయం పట్టేయాలని చూస్తుంది. అమీతుమీ సమరాన్ని బెంగళూర్కు తీసుకెళ్లాలని కోహ్లిసేన అనుకుంటోంది. ఈ నేపథ్యంలో రాజ్కోట్లో భారత్, ఆస్ట్రేలియా బాహాబాహీ ఆసక్తి రేపుతోంది.
విరాట్ 3లోనే రావాలి : స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్య లేడు. సీనియర్ సీమర్ భువనేశ్వర్ కుమార్ దూరమయ్యాడు. సూపర్ బ్యాట్స్మన్ తన స్థానాన్ని మరోకరికి ఇచ్చేశాడు. ప్రయోగాల వేళ కోహ్లిసేన దారుణ ఓటమి చవిచూసింది. నేడు కచ్చితంగా నెగ్గి తీరాల్సిన మ్యాచ్లో భారత్ ముందుగా బ్యాటింగ్ ఆర్డర్పై దృష్టి సారించాలి. కెప్టెన్ విరాట్ కోహ్లి తిరిగి నం.3 స్థానంలోనే బ్యాటింగ్కు రావాలి. మాజీ క్రికెటర్లు సైతం కోహ్లి బ్యాటింగ్ పొజిషన్పై ఇదే చెబుతున్నారు. మూడో స్థానంలో వస్తే క్రీజులో నిలదొక్కుకునేందుకు కోహ్లికి తగినంత సమయం లభించనుంది. ఆఖర్లో ఫామ్లో ఉన్న బ్యాట్స్మన్ అండ లభించనుంది. కెఎల్ రాహుల్ వరల్డ్కప్లో వచ్చినట్టే నాల్గో స్థానంలో వచ్చే అవకాశం ఉంది. తల బాగా అదరటంతో రిషబ్ పంత్ రాజ్కోట్ వన్డేకు దూరమయ్యాడు. దీంతో కెఎల్ రాహుల్ వరుసగా రెండో మ్యాచ్లో వికెట్ కీపింగ్ బాధ్యతలు తీసుకోనున్నాడు. రిషబ్ పంత్ గాయం కేదార్ జాదవ్కు తుది జట్టులో లైన్ క్లియర్ చేసింది. పార్ట్టైమ్ స్పిన్నర్గా జాదవ్ ఐదారు ఓవర్లు అత్యంత కీలకం కానున్నాయి. రవీంద్ర జడేజా రెగ్యులర్ ఆల్రౌండర్గా ఆడనున్నాడు.
బౌలింగ్ విభాగంలో జశ్ప్రీత్ బుమ్రా అరుదైన వైఫల్యం చెందాడు. ఫామ్లో ఉన్న మహ్మద్ షమి సైతం తేలిపోయాడు. ఇటీవల దక్షిణాఫ్రికా బ్యాట్స్మెన్ను వణికించిన మహ్మద్ షమి వాంఖడెలో సరైన లెంగ్త్లో బంతులు వేయలేదు. ఆరంభంలో ఫుల్ లెంగ్త్, ఆఖర్లో మరీ షార్ట్ లెంగ్త్తో బంతులేసి మూల్యం చెల్లించుకున్నారు. నవదీప్ సైని తుది జట్టులోకి వచ్చే అవకాశం లేకపోలేదు. కుల్దీప్ యాదవ్, యుజ్వెంద్ర చాహల్ స్పిన్నర్ కోటా స్థానం కోసం పోటీపడుతున్నారు. షార్దుల్ ఠాకూర్తో కలిసి బుమ్రా పేస్ బాధ్యతలు పంచుకోనున్నాడు.
జోరుమీదున్న కంగారూ : కీలక ఆటగాళ్లు డెవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్ సహకారం లేకుండానే 2019లో టీ20, వన్డే సిరీస్ ఎగరేసుకుపోయిన ఆస్ట్రేలియా.. ఇప్పుడు స్టార్ బ్యాట్స్మెన్ అండతో మరింత రెచ్చిపోతుంది. అన్ని విభాగాల్లో భారత్ను మట్టికరిపించి మానసికంగా పైచేయి సాధించిన కంగారూ శిబిరం.. నేడు రాజ్కోట్లోనూ అదే జోరు చూపించాలని భావిస్తోంది. వార్నర్, ఫించ్ జోరుతో మార్నస్ లబుషేన్ అరంగ్రేట ఇన్నింగ్స్ సాధ్యపడలేదు. చిన్న బౌండరీల మైదానంలో లబుషేన్, స్మిత్, టర్నర్, ఆగర్, క్యారె సత్తా చాటేందుకు ఎదురుచూస్తున్నారు. బౌలింగ్ విభాగంలో పాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, కేన్ రిచర్డ్సన్ త్రయం మరోసారి భారత్కు గట్టి సవాల్ విసరనుంది. స్పిన్నర్ ఆడం జంపా నుంచి భారత స్టార్ బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లి అరుదైన పోటీ ఎదుర్కొంటున్నాడు. కోహ్లి క్రీజులోకి రాగానే ఫించ్ స్పిన్నర్ జంపాను ప్రయోగించనున్నాడు. రాజ్కోట్లో కోహ్లి దీటుగా బదులిస్తే సిరీస్ కోసం ఆస్ట్రేలియా బెంగళూర్కు వెళ్లక తప్పదు.
పిచ్ రిపోర్టు : రాజ్కోట్ పిచ్ వాంఖడె కంటే ఫ్లాట్గా ఉండనుంది. మంచి ఎండకాయటంతో పిచ్ పచ్చిక లేకుండా కనిపిస్తోంది. రాజకోట్ చిన్న బౌండరీల మైదానం. భారీ హిట్టర్లు కోరుకునే మైదానం అనటంలో సందేహం లేదు. మ్యాచ్కు ఎటువంటి వర్షం ముప్పు లేదు. వైవిధ్యం చూపిస్తే పేసర్లు ప్రభావం చూపగలరు. మరో భారీ స్కోర్ల మ్యాచ్లో టాస్ నెగ్గిన తొలుత బౌలింగ్కు మొగ్గుచూపనుంది.
తుది జట్లు (అంచనా) :
భారత్ : శిఖర్ ధావన్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, కెఎల్ రాహుల్, శ్రేయాష్ అయ్యర్, కేదార్ జాదవ్, రవీంద్ర జడేజా, షార్దుల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమి, జశ్ప్రీత్ బుమ్రా.
ఆస్ట్రేలియా : అరోన్ ఫించ్, డెవిడ్ వార్నర్, మార్నస్ లబుషేన్, స్టీవ్ స్మిత్, అలెక్స్ క్యారె, ఆష్టన్ టర్నర్, పాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, కేన్ రిచర్డ్సన్, ఆడం జంపా.