Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-నేటి నుంచి పీబీఎల్ సీజన్ 5
- తొలి మ్యాచ్లో హంటర్స్తో చెన్నై ఢీ
నవతెలంగాణ-చెన్నై : షటిల్ సమరానికి రంగం సిద్ధమైంది. ఒలింపిక్స్ ఏడాదిలో తొలి రెండు టోర్నీల్లో నిరాశపరిచిన భారత బ్యాడ్మింటన్ క్రీడాకారులు గాడిలో పడేందుకు మరో అద్భుత అవకాశం పీబీఎల్ రూపంలో ఎదురుచూస్తోంది. ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (పీబీఎల్) ఐదో సీజన్ నేటి నుంచి ఆరంభం కానుంది. ఒక టైటిల్ కోసం ఏడు జట్లు 21 రోజుల పాటు రసవత్తరంగా పోరాడేందుకు సిద్ధమయ్యాయి. నాలుగు సీజన్లు విజయవంతంగా ముగించుకున్న పీబీఎల్ సరికొత్త హంగులతో ఐదో సీజన్కు ముస్తాబైంది. పీబీఎల్ సీజన్ 5 చెన్నైలో మొదలు కానుంది. తొలి మ్యాచ్లో హైదరాబాద్ హంటర్స్, చెన్నై సూపర్స్టార్జ్ తలపడనున్నాయి. ఆరంభ మ్యాచ్లో మహిళల సింగిల్స్లో పి.వి సింధు బరిలోకి దిగనుంది. సింధు మ్యాచ్తో సీజన్5 ఆరంభం కానుంది.
పాల్గొనే జట్లు : పీబీఎల్లో ఈసారి ఏడు జట్లు పోటీపడనున్నాయి. అవాధె వారియర్స్, బెంగళూర్ రాఫ్టార్స్, ముంబయి రాకెట్స్, హైదరాబాద్ హంటర్స్, చెన్నై సూపర్స్టార్జ్, నార్త్ ఈస్ట్రర్న్ వారియర్స్, పుణె 7 ఏసెస్లు టైటిల్ కోసం పోరాడనున్నాయి. విజేత రూ. 6 కోట్ల నగదు బహుమానం దక్కించుకోనుంది.
మూడు వేదికలు : పీబీఎల్లో ప్రతి సీజన్లో ప్రాంఛైజీ సొంత వేదికల్లో మ్యాచులు జరిగేవి. ఈ సీజన్లో మూడు వేదికల్లోనే మ్యాచులు నిర్వహించనున్నారు. చెన్నై, లక్నోల్లో తొలి రెండు షెడ్యూల్ మ్యాచులు జరుగుతుండగా.. హైదరాబాద్లో ఆఖరి దశ లీగ్ మ్యాచులు తుది సమరం జరుగనున్నాయి.
స్టార్స్ లేరు : పీబీఎల్లో ఈసారి స్టార్ కళ తగ్గనుంది. పి.వి సింధు హైదరాబాద్ హంటర్స్ తరఫున బరిలోకి దిగేందుకు సిద్ధమవుతోంది. కానీ నార్త్ ఈస్ట్రర్న్ వారియర్స్ దిగ్గజ షట్లర్ సైనా నెహ్వాల్ ఈ ఏడాది లీగ్కు దూరమైంది. లక్నో వారియర్స్ స్టార్ కిదాంబి శ్రీకాంత్ సైతం ఈ సీజన్ నుంచి తప్పుకున్నాడు.