Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రంజీలో గాయపడిన ఇషాంత్ శర్మ
- భుజం గాయంతో ధావన్ దూరం
- ఆక్లాండ్లో కాలుమోపిన టీమ్ ఇండియా
నవతెలంగాణ-ముంబయి
కీలక న్యూజిలాండ్ పర్యటనకు ముందు టీమ్ ఇండియాకు వరుస ఎదురు దెబ్బలు. ఫామ్లో ఉన్న సీనియర్ ఓపెనింగ్ బ్యాట్స్మన్ శిఖర్ ధావన్ భుజం గాయంతో టీ20లకు దూరం కాగా.. సీనియర్ సీమర్ ఇషాంత్ శర్మ రంజీ ట్రోఫీలో గాయం బారిన పడ్డాడు. విదర్భతో ఢిల్లీ రంజీ మ్యాచ్ సందర్భంగా ఇషాంత్ శర్మ చీలమండ గాయానికి లోనయ్యాడు. నొప్పితో మైదానాన్ని వీడిన ఇషాంత్ శర్మను స్థానిక స్పెషలిస్ట్ వైద్యుడి వద్ద పరీక్షలకు పంపించారు. ఇషాంత్ శర్మ గ్రేడ్ 3 చీలమండ గాయానికి గురైనట్టు వైద్యుడు తెలిపాడు. దీంతో పున పరీక్ష నిమిత్తం ఇషాంత్ శర్మను బెంగళూర్కు పంపించారు. నేషనల్ క్రికెట్ అకాడమీలో ఇషాంత్ శర్మ గాయంపై ఎన్సీఏ మెడికల్ బృందం ఓ నిర్దారణకు రానుంది. ప్రాథమికంగా ఇషాంత్ శర్మకు వైద్యులు ఆరు వారాల విశ్రాంతి సూచించారు. టీ20, వన్డే జట్టు ప్రణాళికల్లో ఇషాంత్ శర్మ భాగం కాడు. కానీ ఫిబ్రవరి 21 నుంచి ఆరంభం కానున్న టెస్టు సిరీస్లో ఇషాంత్ కీలక ఆటగాడు. ఐసీసీ వరల్డ్ టెస్టు చాంపియన్షిప్స్లో ఈ రెండు టెస్టులు భాగం. ఆరు వారాల విశ్రాంతిని ఎన్సీఏ వైద్యులూ ధ్రువీకరిస్తే న్యూజిలాండ్ పర్యటనకు టీమ్ ఇండియా ప్రధాన సీమర్ సేవలు కోల్పోనుంది. మరోవైపు శిఖర్ ధావన్ మళ్లీ గాయం బారినపడ్డాడు. ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో ఆడుతూ మోకాలి గాయంతో బాధపడిన శిఖర్ ధావన్ స్వదేశంలో వెస్టిండీస్తో సిరీస్కు దూరమయ్యాడు. పునరాగమనంలో ఆస్ట్రేలియాపై వరుసగా స్ఫూర్తివంతమైన అర్ధ సెంచరీలు సాధించిన శిఖర్ ధావన్.. కంగారూతో మూడో వన్డేలో ఫీల్డింగ్ చేస్తూ భుజం గాయం బారిన పడ్డాడు. నొప్పితో బ్యాటింగ్కు సైతం ధావన్ రాలేదు. గాయం తీవ్రత దృష్ట్యా సోమవారం న్యూజిలాండ్ పర్యటనకు బయల్దేరిన భారత జట్టులో శిఖర్ ధావన్ లేకుండాపోయాడు. సెలక్షన్ కమిటీ ధావన్ స్థానంలో మరో ఆటగాడిని ఎంపిక చేయాల్సి ఉంది. న్యూజిలాండ్-ఎ పర్యటనలో ఉన్న పృథ్వీ షా, సంజు శాంసన్, మయాంక్ అగర్వాల్లలో ఒకరిని సెలక్టర్లు ఎంచుకునే అవకాశం కనిపిస్తోంది.