Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 204 టార్గెట్ను ఛేదించిన కోహ్లిసేన
- రాణించిన కెప్టెన్ విరాట్ కోహ్లి
- టేలర్, మన్రో, విలియమ్సన్ ఫిఫ్టీలు వృథా
- తొలి టీ20లో 6 వికెట్లతో భారత్ గెలుపు
టీ20ల్లో న్యూజిలాండ్పై భారత్ గెలుపు రికార్డు మరీ పేలవం. కివీస్పై ఛేదనలోనూ టీమ్ ఇండియా మెరుగైన రికార్డు కలిగి లేదు. చిన్న బౌండరీలు, భారీ హిట్టర్ల అండ ఉన్నా.. ఆక్లాండ్లో 204 లక్ష్యం భారత్కు గట్టి పోటీ ఇస్తుందనే అనిపించింది. ఫామ్లో ఉన్న బ్యాట్స్మెన్ కెఎల్ రాహుల్ (56), శ్రేయాష్ అయ్యర్ (58), విరాట్ కోహ్లి (45) మెరుపుల ముందు 204 పరుగుల లక్ష్యం చిన్నబోయింది. భారీ లక్ష్యాన్ని 19 ఓవర్లలోనే ఛేదించిన కోహ్లిసేన ఐదు మ్యాచుల టీ20 సిరీస్లో 1-0 ఆధిక్యం సాధించింది.
నవతెలంగాణ-ఆక్లాండ్
భారత్, న్యూజిలాండ్లు చివరగా తలపడిన వరల్డ్కప్ సెమీఫైనల్లో కీవీస్ ఆటగాడు మార్టిన్ గప్టిల్ కండ్లుచెదిరే డైరెక్ట్ త్రో తో ఎం.ఎస్ ధోనిని రనౌట్ చేశాడు. ఆ రనౌట్తో మ్యాచ్ కివీస్ పక్షం మొగ్గింది. తాజాగా ఆక్లాండ్ టీ20 ఛేదనలో కుదురుకున్న కెప్టెన్ విరాట్ కోహ్లినీ సూపర్బ్ క్యాచ్తో మార్టిన్ గప్టిల్ వెనక్కి పంపించాడు. సవాల్ విసిరిన ఛేదనలో భారత్ను ఆ వికెట్ కాస్త ఒత్తిడిలో పడేసింది. శ్రేయాష్ అయ్యర్ (58 నాటౌట్, 29 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్లు) అజేయ అర్ధ సెంచరీతో కదం తొక్కాడు, న్యూజిలాండ్ను గెలుపు ఆలోచనకే దూరం చేశాడు. ఓపెనర్ కెఎల్ రాహుల్ (56, 27 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్లు) ఛేదనకు గట్టి పునాది వేయగా.. ఆఖర్లో శ్రేయాష్ అయ్యర్ అజేయ ఇన్నింగ్స్తో లాంఛనం ముగించాడు. విరాట్ కోహ్లి (45, 32 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్), మనీశ్ పాండే (14 నాటౌట్, 12 బంతుల్లో 1 సిక్స్) సైతం రాణించగా 204 పరుగుల లక్ష్యాన్ని మరో ఆరు బంతులు మిగిలి ఉండగానే భారత్ ఛేదించింది. కొలిన్ మన్రో (59, 42 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్లు), రాస్ టేలర్ (54 నాటౌట్, 27 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్లు), కేన్ విలియమ్సన్ (51, 26 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్లు) అర్థ సెంచరీలతో కదం తొక్కారు. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత ఓవర్లలో 203/5 పరుగులు చేసింది. ఛేదనలో కీలక ఇన్నింగ్స్ నమోదు చేసిన శ్రేయాష్ అయ్యర్ 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు అందుకున్నాడు. సిరీస్లో రెండో టీ20 ఆక్లాండ్లోనే ఆదివారం జరుగనుంది.
రాహుల్, అయ్యర్ మెరుపులు : పొట్టి ఫార్మాట్లో ఓ మంచి ఇన్నింగ్స్ బాకీ పడిన శ్రేయాష్ అయ్యర్ ఆక్లాండ్లో ఆ మార్క్ అందుకున్నాడు. మనీశ్ పాండే (14) క్రీజులో జత కలిసిన సమయాన భారత్ మరో 40 బంతుల్లో 62 పరుగులు చేయాల్సి ఉంది. పాండే అండతో 26 బంతుల్లోనే అర్ధ సెంచరీ బాదేసిన అయ్యర్ ఆక్లాండ్లో ఆరు వికెట్ల విజయాన్ని అందించాడు. టిమ్ సౌథి లెంగ్త్ బంతులు, అరంగ్రేట హమిశ్ బెనెట్ షార్ట్ బంతులపై విరుచుకుపడిన అయ్యర్ సీమర్లు వేసిన 17 బంతుల్లోనే 40 పరుగులు పిండుకున్నాడు. మూడు సిక్సర్లు, ఐదు ఫోర్లతో అలరించే ఇన్నింగ్స్ ఆడాడు. మరో ఎండ్లో మనీశ్ పాండే సమయోచిత ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. మ్యాచ్ చేతిలో ఉన్న తరుణంలో అయ్యర్కు స్ట్రయిక్ రొటేట్ చేస్తూ సహకరించాడు. సౌథి బంతిని మిడ్వికెట్ మీదుగా సిక్సర్గా బాదిన అయ్యర్ లాంఛనాన్ని ఘనంగా ముగించాడు.
భారీ ఛేదనలో భారత్ ఆరంభంలోనే రోహిత్ శర్మ (7)ను కోల్పోయింది. కొత్త బంతితో టర్న్ దొరకబుచ్చుకున్న శాంట్నర్ విధ్వంసకారుడు రోహిత్ను క్యాచౌట్తో వెనక్కి పంపించాడు. కెప్టెన్ విరాట్ కోహ్లితో కలిసి మరో ఓపెనర్ కెఎల్ రాహుల్ ధనాధన్ ఇన్నింగ్స్ ఆడాడు. తొలి ఓవర్ మినహాయిస్తే తర్వాత వరుసగా ఎనిమిది ఓవర్లలో భారత్ బౌండరీలు కొట్టింది. 23 బంతుల్లోనే అర్ధ సెంచరీ బాదిన కెఎల్ రాహుల్.. అలవోకగా బౌండరీలు సాధించాడు. నిజానికి కెఎల్ రాహుల్ 27 పరుగుల వద్దే నిష్క్రమించాలి. ఆరో ఓవర్లో లభించిన రెండు రనౌట్ల అవకాశాలను కివీస్ వృథా చేసుకుంది. కోహ్లి 33 పరుగుల వద్ద ఉండగా థర్డ్మ్యాన్లో సోథి సులువైన క్యాచ్ నేలపాలు చేశాడు. రాహుల్ను సౌథి, కోహ్లిని గప్టిల్ మంచి క్యాచ్లతో అవుట్ చేసి కివీస్ శిబిరంలో ఆశలు రేపారు. కానీ శ్రేయాష్ అయ్యర్, మనీశ్ పాండేలు ఆతిథ్య జట్టు ఆశలను ఆవిరి చేశారు.
మూడు అర్ధ సెంచరీలు : టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన న్యూజిలాండ్ భారీ స్కోరు సాధించింది. మార్టిన్ గప్టిల్ (30), కొలిన్ మన్రో (59)లు తొలి వికెట్కు గట్టి ఆరంభం ఇచ్చారు. మన్రోకు బాడీ లెంగ్త్ బంతులతో సవాల్ విసిరిన భారత్ పెద్దగా సక్సెస్ సాధించలేదు. లెగ్ సైడ్ బౌండరీలను అలవోకగా అందుకున్న మన్రో మెరుపు అర్థ సెంచరీ సాధించాడు. ఓ సిక్సర్, నాలుగు ఫోర్లతో జోరు మీదున్న గప్టిల్ను దూబె అవుట్ చేయటంతో భారత్కు తొలి బ్రేక్ లభించింది. కేన్ విలియమ్సన్ (51), రాస్ టేలర్ (54)లు న్యూజిలాండ్ ఇన్నింగ్స్కు ఊపు తీసుకొచ్చారు. 25 బంతుల్లోనే అర్ధ సెంచరీలు పూర్తి చేసుకున్న విలియమ్సన్, టేలర్లు భారత బౌలర్లపై ఏడు సిక్సర్లు పిండుకున్నారు. కొలిన్ డీ గ్రాండ్హౌమె (0) టిమ్ సీఫర్ట్ (1) నిరాశపరిచారు. భారత బౌలర్లలో జడేజా, బుమ్రా, దూబె, ఠాకూర్లు తలా ఓ వికెట్ తీసుకున్నారు.
స్కోరు వివరాలు :
న్యూజిలాండ్ ఇన్నింగ్స్ : మార్టిన్ గప్టిల్ (సి) రోహిత్ (బి) దూబె 30, కొలిన్ మన్రో (సి) చాహల్ (బి) ఠాకూర్ 59, కేన్ విలియమ్సన్ (సి) కోహ్లి (బి) చాహల్ 51, గ్రాండ్హౌమె (సి) దూబె (బి) జడేజా 0, రాస్ టేలర్ నాటౌట్ 54, టిమ్ సీఫర్ట్ (సి) అయ్యర్ (బి) బుమ్రా 1, మిచెల్ శాంట్నర్ నాటౌట్ 2, ఎక్స్ట్రాలు : 06, మొత్తం : (20 ఓవర్లలో 5 వికెట్లకు) 203.
వికెట్ల పతనం : 1-80, 2-116, 3-117, 4-178, 5-181.
బౌలింగ్ : జశ్ప్రీత్ బుమ్రా 4-0-31-1, షార్దుల్ ఠాకూర్ 3-0-44-1, మహ్మద్ షమి 4-0-53-0, యుజ్వెంద్ర చాహల్ 4-0-32-ర1, శివం దూబె 3-0-24-1, రవీంద్ర జడేజా 2-0-18-1.
భారత్ ఇన్నింగ్స్ : రోహిత్ శర్మ (సి) టేలర్ (బి) శాంట్నర్ 7, కెఎల్ రాహులÊ (సి) సౌథీ (బి) సోధి 56, విరాట్ కోహ్లి (సి) గప్టిల్ (బి) టిక్నర్ 45, శ్రేయాష్ అయ్యర్ నాటౌట్ 58, శివం దూబె (సి) సౌథి (బి) సోధి 13, మనీశ్ పాండే నాటౌట్ 14, ఎక్స్ట్రాలు : 11, మొత్తం : (19 ఓవర్లలో 4 వికెట్లకు) 204.
బౌలింగ్ : టిమ్ సౌథి 4-0-48-0, మిచెల్ శాంట్నర్ 4-0-50-1, హమిశ్ బెనెట్ 4-0-36-0, బ్లేర్ టిక్నర్ 3-0-34-1, ఇశ్ సోధి 4-0-36-2.