Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చీఫ్ సెలక్టర్ రేసులో మాజీ క్రికెటర్లు
- సీఏసీ ఎంపిక సోమవారం!
ముంబయి : ఎమ్మెస్కే ప్రసాద్ 40 నెలల చీఫ్ సెలక్టర్ పదవీకాలం శుక్రవారంతో ముగిసింది. సెంట్రల్ జోన్ సహచరుడు గనన్ ఖోడాతో కలిసి ప్రసాద్ సెలక్షన్ కమిటీ నుంచి వీడ్కోలు తీసుకున్నాడు. సీనియర్ సెలక్షన్ కమిటీ తదుపరి చీఫ్ సెలక్టర్ ఎవరనేది ఇంకా తేలలేదు. మాజీ క్రికెటర్లు లక్ష్మణ్ శివరామకృష్ణన్, వెంకటేశ్ ప్రసాద్లు చీఫ్ సెలక్టర్ రేసులో ఉన్నారు. సెలక్షన్ కమిటీలోని రెండు ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవాల్సిన గడువు జనవరి 24తో ముగిసింది. జూనియర్ సెలక్షన్ కమిటీ చీఫ్ సెలక్టర్గా పనిచేసిన వెంకటేశ్ ప్రసాద్ చీఫ్ సెలక్టర్గా ఎంపికైతే నిబంధనల ప్రకారం ఏడాన్నర మాత్రమే పదవిలో కొనసాగగలడు. నిబంధనల ప్రకారం బీసీసీఐ ఏ కమిటీలోనైనా ఐదేండ్లకు మించి ఏక కాలంలో పనిచేయకూడదు. 2015-2018లో జూనియర్ సెలక్షన్ కమిటీ చైర్మన్గా కొనసాగిన ప్రసాద్, నిబంధనల ప్రకారం 2021లోనే తప్పుకోవాలి. లక్ష్మణ్ శివరామకృష్ణన్ మూడేండ్ల పాటు కొనసాగవచ్చు. సీనియర్ సెలక్షన్ కమిటీలో మిగిలిన ముగ్గురు సభ్యులు మరో ఏడాది పాటు కొనసాగనున్నారు. దీంతో ప్రసాద్కు సైతం ఏడాది కాల వ్యవధితో చీఫ్ సెలక్టర్గా బాధ్యతలు అప్పగిస్తే 2021లో కొత్త సెలక్షన్ కమిటీని ఎంచుకునే వీలుంటుందని బీసీసీఐ బాస్ గంగూలీ భావనగా తెలుస్తోంది. సోమవారం న్యూఢిల్లీలో సమావేశం కానున్న ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ సందర్భంగా క్రికెట్ సలహా సంఘం (సీసీఏ) సభ్యులను ప్రకటించే వీలుంది. జులై 27న సీఏసీ ఏర్పాటైతే, మంగళవారం నాటికి చీఫ్ సెలక్టర్ను ఎంపిక చేసే అవకాశం కనిపిస్తోంది.