Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఓపెనర్లుగా పృథ్వీ, మయాంక్
- కివీస్కు కేన్ సేవలు దూరం
- భారత్, న్యూజిలాండ్ తొలి వన్డే నేడు
- ఉ. 7.30 నుంచి స్టార్స్పోర్ట్స్లో..
2019 వరల్డ్కప్ ఫైనల్స్ తర్వాత న్యూజిలాండ్ తొలి వన్డే ఆడబోతుంది. నవంబర్ 25, 2019 తర్వాత కివీలు ఏ ఫార్మాట్లోనూ ఓ గెలుపు చూడలేదు. ఆఖరు వన్డే చేదు జ్ఞాపకాలు ఓవైపు, వరుస ఓటముల నైరాశ్యం మరోవైపు న్యూజిలాండ్ను మానసికంగా దారుణంగా దెబ్బతీస్తున్నాయి. సొంతగడ్డపై తొలిసారి భారత్కు టీ20 సిరీస్ కోల్పోయిన న్యూజిలాండ్, మరో వన్డే సిరీస్ వదులుకునేందుకు సిద్ధంగా లేదు!. మూడు మ్యాచుల వన్డే సిరీస్లో భారత్కు గట్టి పోటీఇచ్చేందుకు ఆతిథ్య జట్టు సిద్ధమవుతోంది. 5-0 టీ20 సిరీస్ విజయంతో న్యూజిలాండ్ పర్యటనను భారత్ మెగా హిట్తో మొదలెట్టింది. టాప్ ఆర్డర్లో ఇద్దరు కీలక బ్యాట్స్మెన్ సేవలు కోల్పోయినా, ఫామ్లో ఉన్న కుర్రాళ్లు భారత్ను వన్డే సిరీస్లోనూ ఫేవరెట్గా నిలుపుతున్నారు. హామిల్టన్ సెడాన్ పార్క్లో భారత్, న్యూజిలాండ్ తొలి నేడు.
నవతెలంగాణ-హామిల్టన్
ఇటు వైపు రోహిత్ శర్మ లేడు. అటు వైపు కేన్ విలియమ్సన్ దూరమయ్యాడు. ఇరు శిబిరాలు సూపర్ స్టార్స్ను కోల్పోయినా.. హామిల్టన్ వన్డే వన్నె ఏమాత్రం తగ్గటం లేదు. ప్రతిభావంతులైన ఇద్దరు యువ బ్యాట్స్మెన్ భారత్ నుంచి ఆరంగ్రేటం చేయనుండగా, మంచి ఫామ్ చాటుకున్న యువ క్రికెటర్ కెప్టెన్ కేన్ స్థానంలో ఆడేందుకు రంగం సిద్ధం చేసుకున్నాడు. పతాక సన్నివేశాలకు చేరుతూ, ఊహించని మలుపులు తిరుగుతూ అభిమానులను ఉర్రూతలూగించిన టీ20 సమరం తరహాలోనే వన్డే సవాల్కు భారత్, న్యూజిలాండ్ సై అంటున్నాయి. భారత జట్టు మరో సిరీస్పై కన్నేసిన వేళ, పర్యాటక జట్టును నిలువరించేందుకు ఆతిథ్య జట్టు ఏం చేయనుందో చూడాలి.
ఇద్దరు కొత్త ఓపెనర్లు : పరిమిత ఓవర్ల ఫార్మాట్లో భారత్ విజయాల్లో ముఖ్య భూమిక వహించిన రోహిత్ శర్మ, శిఖర్ ధావన్లు న్యూజిలాండ్ వన్డేలకు దూరమయ్యారు. ఇద్దరు స్టార్ బ్యాట్స్మెన్ను కోల్పోయిన టీమ్ ఇండియా నేడు హామిల్టన్లో కొత్త జంటతో ఇన్నింగ్స్ ఆరంభించనుంది. ఇప్పటికే టెస్టుల్లో ఓపెనర్లు నిరూపించుకున్న పృథ్వీ షా, మయాంక్ అగర్వాల్లు నేడు తొలి వన్డేలో జంటగా బరిలోకి దిగనున్నారు. 1974లో ఇంగ్లాండ్పై సునీల్ గవాస్కర్, సుధీర్ నాయక్ జోడీ, 2016లో జింబాబ్వేపై కెఎల్ రాహుల్, కరుణ్ నాయర్ జంట, 1976లో దిలీప్ వెంగ్సర్కార్, పి శర్మలు ఓపెనర్లుగా ఒకే మ్యాచ్లో అరంగ్రేటం చేశారు. ఈ జాబితాలోకి పృథ్వీ షా, మయాంక్ అగర్వాల్ చేరనున్నారు. కెఎల్ రాహుల్ రూపంలో మరో ఓపెనర్ అందుబాటులో ఉన్నప్పటికీ భారత్ ఇద్దరు కొత్త ఓపెనర్లవైపే మొగ్గుచూపుతోంది. వికెట్ కీపర్గా కెఎల్ రాహుల్ ఐదో స్థానంలో కుదురుకునేందుకు కోహ్లిసేన తగిన సమయం ఇవ్వాలని భావిస్తోంది. టెస్టుల్లో ఓపెనర్లుగా సత్తా చాటిన షా, అగర్వాల్లు వన్డేల్లోనూ ఆ మార్క్ చూపించాలని ఎదురుచూస్తున్నారు. కెప్టెన్ విరాట్ కోహ్లి, శ్రేయాష్ అయ్యర్ ఫామ్లో ఉన్నారు. మిడిల్ ఆర్డర్లో మనీశ్ పాండే ఎక్కువ సమయం క్రీజులో గడపాలని ఆలోచిస్తున్నాడు. పరిస్థితులు అనుకూలిస్తే మనీశ్ పాండేకు బ్యాటింగ్ ఆర్డర్లో ప్రమోషన్ లభించే అవకాశం ఉంది. బౌలింగ్ విభాగంలో యుజ్వెంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్లు తుది జట్టులో చోటు కోసం పోటీపడుతున్నారు. చివరి రెండు టీ20లకు విశ్రాంతి పొందిన మహ్మద్ షమి తొలి వన్డేకు తిరిగి రానున్నాడు. జశ్ప్రీత్ బుమ్రా, షార్దుల్ ఠాకూర్లతో కలిసి షమి బౌలింగ్ చేయనున్నాడు. ఆల్రౌండర్గా రవీంద్ర జడేజా తుది జట్టులో కొనసాగనున్నాడు.
కేన్ లేడు మార్క్ వచ్చాడు! : న్యూజిలాండ్ గాయాల జాబితా పెరిగిపోతుంది. ట్రెంట్ బౌల్ట్, లాకీ ఫెర్గుసన్, మాట్ హెన్రీల సరసన కెప్టెన్ కేన్ విలియమ్సన్ చేరిపోయాడు. మూడో టీ20లో భుజం గాయానికి గురైన కేన్ విలియమ్సన్ తొలి రెండు వన్డేలకు దూరమయ్యాడు. గాయం తీవ్రత తక్కువే అయినా, ముందు జాగ్రత్తగా విలియమ్సన్కు సెలక్టర్లు విశ్రాంతి ఇచ్చారు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో, ఇండియా-ఏపై శతకాలతో సూపర్ ఫామ్లో ఉన్న మార్క్ చాప్మ్యాన్ వన్డే జట్టుకు ఎంపికయ్యాడు. కేన్ స్థానం నం.3లో మార్క్ బ్యాటింగ్ చేయనున్నాడు. మార్టిన్ గప్టిల్కు తోడుగా హెన్రీ నికోల్స్ ఇన్నింగ్స్ ఆరంభించనున్నాడు. రాస్ టేలర్, జిమ్మీ నీషమ్, కొలిన్ డీ గ్రాండ్హౌమె నుంచి న్యూజిలాండ్ బాధ్యతాయుత ప్రదర్శన ఆశిస్తోంది. టీ20 సిరీస్లో చితికిపోయిన టిమ్ సౌథికి విశ్రాంతి లభించే సూచనలు కనిపిస్తున్నాయి. స్కాట్, బెనెట్, కైల్లు పేస్ విభాగంలో, మిచెల్ శాంట్నర్ స్పిన్నర్గా తుది జట్టులో ఉండనున్నారు.
పిచ్ రిపోర్టు : మూడో టీ20కి సెడాన్ పార్క్లో వినియోగించిన పిచ్ మరీ ఫ్లాట్గా లేదు. నేడు వన్డేకు సైతం పిచ్ భిన్నంగా స్పందించే అవకాశం లేదు!. 300 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకునే సత్తా ఇరు జట్ల బౌలర్లకు ఉంది. తొలి వన్డేకు ఆహ్లాదకర వాతావరణం ఎదురుచూస్తోంది. భారీ స్కోర్లు నమోదు కాకపోయినా పోటీతత్వ క్రికెట్ అభిమానులను అలరించనుంది. టాస్ నెగ్గిన జట్టు ఫీల్డింగ్ చేసేందుకు మొగ్గుచూపనుంది.
తుది జట్లు (అంచనా) :
భారత్ : మయాంక్ అగర్వాల్, పృథ్వీ షా, విరాట్ కోహ్లి, శ్రేయాష్ అయ్యర్, కెఎల్ రాహుల్, మనీశ్ పాండే, రవీంద్ర జడేజా, షార్దుల్ ఠాకూర్, యుజ్వెంద్ర చాహల్, మహ్మద్ షమి, జశ్ప్రీత్ బుమ్రా.
న్యూజిలాండ్ : మార్టిన్ గప్టిల్, హెన్రీ నికోల్స్, మార్క్ చాప్మ్యాన్, రాస్ టేలర్, టామ్ లేథమ్, కొలిన్ డీ గ్రాండ్హౌమె, జిమ్మీ నీషమ్, మిచెల్ శాంట్నర్, టిమ్ సౌథీ, హమిశ్ బెనెట్, స్కాట్.
రోహిత్ శర్మ లేకుండా వన్డే సిరీస్కు వెళ్తుండటం దురదృష్టకరం. రోహిత్ భారత్కు అన్ని ఫార్మాట్లలో తొలి ప్రాధాన్య ఆటగాడు. పృథ్వీ షా జట్టుతో ఉన్నాడు. మయాంక్ అగర్వాల్తో కలిసి నేడు ఇన్నింగ్స్ ఆరంభించనున్నాడు. కెఎల్ రాహుల్ వికెట్ కీపింగ్ బాధ్యతలతో ఐదో స్థానంలోనే బ్యాటింగ్కు రానున్నాడు. టీ20 వరల్డ్కప్ సన్నాహానికి ఐపీఎల్ను వాడుకుంటాం. 50 ఓవర్ల క్రికెట్ను గౌరవిస్తాం, దీన్ని పొట్టి ప్రపంచకప్ కోసం వినియోగించుకోబోం'
- విరాట్ కోహ్లి, భారత కెప్టెన్