Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భారత్లో టెన్నిస్ అభివృద్దిపై పేస్
ముంబయి : ప్రపంచవ్యాప్తంగా అత్యంత పాపులర్ గేమ్ ఫుట్బాల్కు భారత్లో ఆదరణ లేదు. ఫుట్బాల్, రగ్బీ, బాస్కెట్బాల్తో సమానంగా ప్రేక్షకాదరణ పొందుతున్న టెన్నిస్కూ భారత్లో ఆదరణ విషయంలో మెరుగైన స్థానం లేదు. లియాండర్ పేస్, సానియా మీర్జా, మహేశ్ భూపతి రూపంలో ఇటీవల కాలంలో చిన్నారులకు దిగ్గజాలు కనిపిస్తున్నా.. బాల్యంలోనే టెన్నిస్ను కెరీర్ను ఎంచుకునేందుకు ఇంకా అనువైన వాతావరణం ఏర్పడలేదు. ఇదే విషయాన్ని దిగ్గజ ఆటగాడు లియాండర్ పేస్ వద్ద ప్రస్తావించగా ఆసక్తికరంగా స్పందించాడు. ' ఆటకు వీడ్కోలు పలికిన వారిలో రాహుల్ ద్రవిడ్, పుల్లెల గోపీచంద్ పట్ల నాకు ఎంతో గౌరవం ఉంది. ఎందుకంటే తర్వాత తరం క్రీడాకారులను తీర్చిదిద్దేందుకు వారు నడుం బిగించారు. సరైన సహకారం, సదుపాయాలు లేకపోయినా 2001లో పుల్లెల గోపీచంద్ ఆల్ ఇంగ్లాండ్ చాంపియన్గా నిలిచాడు. కోచ్గా ఇద్దరు ఒలింపిక్ మెడలిస్ట్లను తయారు చేశాడు. రాహుల్ ద్రవిడ్ చేతుల్లో భారత క్రికెట్ భవిష్యత్ దివ్యంగా ఉంది. టెన్నిస్కు భారత్లో ఆదరణ ఇప్పుడిప్పుడే పెరుగుతోంది. ఐపీఎల్ సహా బ్యాడ్మింటన్, కబడ్డీ, రెజ్లింగ్, వాలీబాల్, బాక్సింగ్, టేబుల్ టెన్నిస్లు లీగ్ రూపంలో ఆదరణ పొందుతున్నాయి. భారత్లో టెన్నిస్కు ఆదరణ పెరగాలంటే వర్థమాన క్రీడాకారులను తీర్చిదిద్దేందుకు రాహుల్ ద్రవిడ్, గోపీచంద్లు కావాలి. టెన్నిస్లో పునరుజ్జీవం కల్పించేందుకు ఉత్తేజపూరిత ఇంజెక్షన్ ఇవ్వాలి. టెన్నిస్ వైపు చిన్నారులను ఆకర్షించాల్సి ఉంది. టెన్నిస్ నుంచి దూరంగా మరల్చేందుకు ఎన్నో అంశాలు ఉన్నాయి, చిన్నారులను టెన్నిస్ వైపు ఆకర్షితులు చేసేందుకు బలమైన సాధనం అవసరం' అని లియాండర్ పేస్ వ్యాఖ్యానించాడు.