Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బంగ్లా యువ కెప్టెన్ అక్బర్ అలీ స్ఫూర్తిగాథ
ఢాకా : ఎంత ఎదిగినా, ఒదిగి ఉంటారు చాంపియన్లు. ఆదివారం అండర్19 వరల్డ్కప్ ఫైనల్లో భారత్పై బంగ్లాదేశ్ 3 వికెట్ల తేడాతో గెలుపొందింది. బంగ్లాదేశ్ బౌలర్లు మైదానంలో భారత ఆటగాళ్ల వైపుగా అతిగా ప్రవర్తించారు. క్రీడాస్ఫూర్తిగా మరిచారు. బంగ్లా కుర్రాళ్ల దురుసు ప్రవర్తనపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. మంచి ప్రదర్శనతో వరల్డ్కప్ గెలుచుకుని, చెత్త ప్రవర్తనతో చెడ్డ పేరు తెచ్చుకున్నారు. ' మా బౌలర్లు కొందరు అతిగా ప్రవర్తించారు. విజయానంతరం జరిగినది, అసలు జరిగి ఉండాల్సింది కాదు. బంగ్లాదేశ్ జట్టు తరఫున నేను క్షమాపణలు చెబుతున్నాను' అని బంగ్లాఅండర్19 కెప్టెన్ అక్బర్ అలీ పేర్కొన్నాడు. జట్టు తరఫున క్షమాపణలతో హృదయాలను గెల్చుకున్న 18 ఏండ్ల అక్బర్ అలీ, అంతకముందే చిరస్మరణీయ 43 నాటౌట్ ఇన్నింగ్స్తో బంగ్లాదేశ్కు తొలి ప్రపంచకప్ అందించాడు. ఇదిలా ఉండగా, అక్బర్ అలీ వ్యక్తిగత జీవితంలో మరో కోణం అందరినీ కలిచి వేసింది. బంగ్లాదేశ్కు చారిత్రక ప్రపంచకప్ అందించిన అక్బర్ అలీ, పాకిస్థాన్తో గ్రూప్ మ్యాచ్కు ముందు తన సోదరిని కోల్పోయాడు. కవల పిల్లలకు జన్మనిస్తూ అక్బర్ అలీ సోదరి ఖాదిజా ప్రసవానంతరం మరణించింది. దక్షిణాఫ్రికాతో మ్యాచ్లో (జనవరి 18)న తమ్ముడు జాతీయ జట్టును గెలుపు తీరాలకు చేర్చడానికి వీక్షించిన ఖాదిజా.. పాకిస్థాన్తో మ్యాచ్కు ముందే కండ్లు మూసింది. వరల్డ్కప్ ఆడుతున్న అక్బర్ అలీకి కుటుంబ సభ్యులు ఈ విషయాన్ని చేరవేయలేదు. కానీ పాకిస్థాన్తో మ్యాచ్ వర్షంతో రద్దు కాగా, అప్పుడే ఇంటికి ఫోన్ చేసిన అక్బర్ అలీ సోదరి మరణ వార్త తనకు ఎందుకు చెప్పలేదని వాపోయాడు. ఈ విషయాన్ని బంగ్లాదేశ్కు చెందిన పత్రిక వెలువరించింది. ' అక్క ఖాదిజాతో అక్బర్ ఎంతో సన్నిహితంగా ఉండేవాడు. ఖాదిజా తమ్ముడిని ఎంతగానో ప్రేమించేది. మరణ వార్తను అక్బర్కు చెప్పకూడదని మేం అనుకున్నాం. పాక్తో మ్యాచ్ రద్దు అయిన తర్వాత అక్బర్ ఫోన్ చేసి, ఎందుకు నన్ను దూరం పెట్టారు? అని అడిగాడు. అక్బర్తో మాట్లాడేందుకు నాకు ధైర్యం లేకపోయింద. ఏం చెప్పాలో అర్థం కాలేదు' అని అక్బర్ అలీ తండ్రి తెలిపాడు. అక్క ఇక లేదని మానసికంగా కుంగిపోయిన అక్బర్ అలీ, ఫైనల్లో కఠిన పరిస్థితుల్లో గొప్ప ప్రదర్శనతో సోదరికి చక్కనైన నివాళి అర్పించాడు. అండర్19 వరల్డ్కప్ విజయ సారథిగా అక్బర్ అలీ బంగ్లాదేశ్ యువ హీరో అయిపోయాడు. జాతీయ జట్టునూ అక్బర్ అలీ మెగా విజయం దిశగా ఒకనాడు నడిపిస్తాడని ఢాకా వాసులు మురిసిపోతున్నారు!