Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- శ్రీనివాస్ దాస్ మంతటి
2020లో టీమ్ ఇండియా అతి తేలిగ్గా తీసుకున్న ఫార్మాట్ వన్డేలు. 2020 టీ20 ప్రపంచకప్ సెప్టెంబర్లో జరుగనుంది. అందుకే ఈ ఏడాది కోహ్లిసేన తొలి ప్రాధాన్యం పొట్టి ఫార్మాట్. 2021 ఐసీసీ టెస్టు ప్రపంచ చాంపియన్షిప్స్ ఫైనల్లో బెర్త్ ఖాయం చేసుకునేందుకు భారత్ మరో రెండు అడుగుల దూరంలోనే నిలిచింది. చారిత్రక లార్డ్స్ టెస్టు ఫైనల్లోకి ప్రవేశించేందుకు కసిగా దూసుకెళ్తోన్న కోహ్లిసేన టెస్టు ఫార్మాట్పై ప్రాధాన్యతను ఏమాత్రం తగ్గించుకోలేదు. ఇక వన్డే విషయానికొస్తే, 2019లోనే వరల్డ్కప్ ముగిసింది. 2023 వరల్డ్కప్ మిషన్ ఆరంభానికి తగినంత సమయం ఉంది. దీంతో వన్డేలనూ టీ20 జట్టు కూర్పు కోసం వినియోగించుకుంది. చీఫ్ కోచ్ రవిశాస్త్రి సైతం వన్డే ఫార్మాట్లో టీమ్ ఇండియా ప్రాధాన్యతపై స్పష్టమైన సంకేతాలే ఇచ్చాడు. న్యూజిలాండ్ చేతిలో 0-3 వైట్వాష్ ఓటమి కెప్టెన్గా విరాట్ కోహ్లి రికార్డుల్లో ఎప్పటికీ డాట్ (.)గానే ఉండిపోతుంది. స్వదేశంలో ఆసీస్కు వన్డే సిరీస్ను కోల్పోయిన కోహ్లి, ఇప్పుడు విదేశీ గడ్డపై కివీస్కు వైట్వాష్ పరాజయం పాలయ్యాడు. నాయకుడిగా విరాట్ కోహ్లి ప్రతిష్టను ఇది కచ్చితంగా ప్రభావితం చేయనుంది.
మధ్యమ స్టార్స్ దొరికారు : వన్డే సిరీస్కు ముందే రెగ్యులర్ ఓపెనర్లు రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ దూరమయ్యారు. జట్టులోని మూడో ఓపెనర్ కెఎల్ రాహుల్ సహజంగానే ఓపెనర్గా రావాలి. కానీ భారత్ ఈ సిరీస్ను ప్రయోగాల కోసమే పూర్తిగా వినియోగించింది. రాహుల్ను టాప్ ఆర్డర్లో ఆడించే ఆలోచనకు చెక్ పెట్టింది. పృథ్వీ షా, మయాంక్ అగర్వాల్ రూపంలో ఇద్దరు కొత్త ఓపెనర్లతోనే ముందుకు సాగింది. తొలి రెండు వన్డేల్లో కొత్త జంట నిరాశపరిచినా, మూడో వన్డేలోనూ అవకాశం ఇచ్చింది. రాహుల్ను టాప్ ఆర్డర్లోకి తీసుకురాలేదు. 2019 వరల్డ్కప్ ఓటమికి ప్రధాన కారణం బలహీన మిడిల్ ఆర్డర్. పాఠాలు నేర్చుకున్న కోహ్లి నాలుగేండ్ల ముందు నుంచే మిడిల్పై దృష్టి సారిస్తున్నాడు. యువరాజ్ సింగ్, ఎం.ఎస్ ధోనిలు ఖాళీ చేసిన 4, 5 స్థానాల్లో సరైన వారసులు దొరకలేదు. ఆ ఇద్దరి లేని లోటు కనిపిస్తూనే ఉంది. న్యూజిలాండ్ సిరీస్లో ఆ సమస్యకు ఓ పరిష్కారం లభించింది. నం.4లో శ్రేయష్ అయ్యర్, ఐదో స్థానంలో కెఎల్ రాహుల్ స్ఫూర్తిదాయక ప్రదర్శనలు చేశారు. తొలి వన్డేలో శ్రేయస్ అయ్యర్ 103 పరుగుల శతక ఇన్నింగ్స్తో మెరిశాడు. మౌంట్ మాంగనురులోనూ 62 పరుగుల అర్ధ సెంచరీతో రాణించాడు. నిలకడగా రాణిస్తున్న శ్రేయష్ అయ్యర్ క్లాస్తో పాటు తనలోని మాస్ కోణాన్ని సైతం ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నాడు. లోయర్ ఆర్డర్లో ఎం.ఎస్ ధోని తర్వాత మరో ఆటగాడు మెప్పించిన దాఖలా లేదు. గత ఐదారేండ్లలో ధోని తర్వాత అంతటి ఇన్నింగ్స్ ఆ స్థానంలో ఆడిన ఆటగాడు కెఎల్ రాహుల్. హామిల్టన్ వన్డేలో అజేయంగా 88 పరుగులు చేసిన రాహుల్, మౌంట్ మాంగానురులో 112 పరుగుల శతకం బాదాడు. టెయిలెండర్లతో కలిసి కీలక భాగస్వామ్యాలు నిర్మించటం, పరిస్థితులకు అనుగుణంగా ధనాధన్ పరుగులు రాబట్టడం, ప్రతికూల సమయంలో వికెట్ కాపాడుకుంటూ జట్టును రేసులో నిలుపటం ఈ స్థానంలో బ్యాటింగ్ చేసే ఆటగాడికి ఉండవలసిన ముఖ్య లక్షణాలు. కెఎల్ రాహుల్ ఈ వన్డే సిరీస్లో ఇవన్నీ తనలో ఉన్నాయని బ్యాట్తోనే బదులిచ్చాడు. బలమైన టాప్ ఆర్డర్తో నిజానికి గత కొన్నేండ్లుగా మిడిల్ ఆర్డర్కు న్యాయమైన అవకాశాలు లభించలేదు. రోహిత్, ధావన్ లేకపోవటం.. కోహ్లి నిరాశపరటంతో ఈ సిరీస్లో మిడిల్ ఆర్డర్కు సత్తా చాటే సమయం చిక్కింది. శ్రేయష్ అయ్యర్, రాహుల్ ఈ అవకాశం సద్వినియోగం చేసుకున్నారు. భారత్కు ఇక మిడిల్ ఆర్డర్ బెంగ లేదని, మధ్యమ స్టార్స్ వచ్చేశామని చాటి చెప్పారు.
మిడిల్ ఆర్డర్ మెరుపులు భారత్కు ఆనందాన్ని మిగల్చగా.. బౌలింగ్ విభాగం వైఫల్యం ఆందోళన మిగిల్చింది. ప్రపంచ జట్లలో మేటి బ్యాట్స్మెన్ సైతం కొట్టలేని మొనగాడుగా జశ్ప్రీత్ బుమ్రా ఇన్నాండ్లూ నిలిచాడు. కానీ న్యూజిలాండ్ బ్యాట్స్మెన్ మిస్టర్ బుమ్రా మిస్టరీని ఛేదించారు. మూడు వన్డేల్లో 0/53, 0/64, 0/50 గణాంకాలతో బుమ్రా దారుణంగా నిరాశపరిచాడు. గాయం నుంచి కోలుకుని నేరుగా న్యూజిలాండ్కు వచ్చిన బుమ్రా ఇక పూర్తి స్థాయి లయ అందుకోలేదని సరిపెట్టుకోవాలా? బుమ్రాలో మునుపటి వాడి వేడీ తగ్గిపోయిందని ఆందోళన చెందాలా? అనేది తెలియటం లేదు. స్పిన్నర్లు రవీంద్ర జడేజా, యుజ్వెంద్ర చాహల్ రాణించినా.. శార్దుల్ ఠాకూర్ జాతీయ జట్టు ప్రమాణాలను అందుకోలేదు. మౌంట్ మాంగానురులో పది ఓవర్ల కోటా పూర్తయితే, రాహుల్ కంటే ఎక్వువ పరుగులు కొట్టేవాడు (కొట్టించేవాడు) అని ట్వీటర్లో ఠాకూర్పై సెటైర్లు పేలుతున్నాయి. వన్డే ఓటమిని అంగీకరించిన టీమ్ ఇండియా.. ఆ జ్ఞాపకాలు మరిచిపోయి టెస్టు సవాల్కు సిద్ధం కానుంది.