Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 3-0తో వన్డే సిరీస్ న్యూజిలాండ్ వశం
- 30 ఏండ్లలో భారత్కు తొలి వైట్వాష్
- కెఎల్ రాహుల్ శతకం వృథా
ప్రపంచ క్రికెట్లో ప్రతీకారాలకు దూరంగా ఉండే జట్టు న్యూజిలాండ్. తొలిసారి ఆ జట్టు ఓ తీయని ప్రతీకారం తీర్చుకుందని చెప్పాలేమో!. టీ20 సిరీస్ను 0-5తో కోల్పోయిన న్యూజిలాండ్.. వన్డే సిరీస్ను 3-0తో భారత్ నుంచి లాగేసుకుంది. ఆధునిక క్రికెట్లో వైట్వాష్ ఓటమిని మరిచిపోయిన టీమ్ ఇండియాకు 30 ఏండ్ల తర్వాత (1989) తొలి వైట్వాష్ వన్డే ఓటమిని రుచి చూపించింది. మూడో వన్డేలోనూ జట్టుగా మెరిసిన న్యూజిలాండ్ వన్డే సిరీస్ను క్లీన్స్వీప్ చేసింది. గప్టిల్ (66), నికోల్స్ (80), గ్రాండ్హౌమ్ (58) మెరుపులతో 297 లక్ష్యాన్ని ఊదేసింది. వన్డే సిరీస్లో మరో భారత బ్యాట్స్మన్ శతకం వృథా అయ్యింది. కెఎల్ రాహుల్ (112), శ్రేయష్ అయ్యర్ (62) రాణించినా భారత్ 296 పరుగులే చేసింది. న్యూజిలాండ్ పర్యటనలో కీలక టెస్టు సిరీస్ ఫిబ్రవరి 21న వెల్లింగ్టన్ టెస్టుతో ఆరంభం కానుంది.
నవతెలంగాణ-మౌంట్ మాంగానురు
న్యూజిలాండ్ వన్డే సిరీస్ను క్లీన్స్వీప్ చేసింది. 297 పరుగుల ఛేదనలో హెన్రీ నికోల్స్ (80, 103 బంతుల్లో 9 ఫోర్లు), మార్టిన్ గప్టిల్ (66, 46 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్లు), కొలిన్ డీ గ్రాండ్హౌమ్ (58 నాటౌట్, 28 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్లు) అర్థ సెంచరీలతో మెరిశారు. మూడో వన్డేలో న్యూజిలాండ్కు 5 వికెట్ల విజయాన్ని అందించారు. మౌంట్ మాంగనురు విజయంతో వన్డే సిరీస్ను న్యూజిలాండ్ 3-0తో క్లీన్స్వీప్ చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమ్ ఇండియా నిర్ణీత ఓవర్లలో 296/7 పరుగులు చేసింది. వికెట్ కీపర్, బ్యాట్స్మన్ కెఎల్ రాహుల్ (112, 113 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్లు) సెంచరీతో కదం తొక్కాడు. శ్రేయష్ అయ్యర్ (62, 63 బంతుల్లో 9 ఫోర్లు), పృథ్వీ షా (40, 42 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్లు), మనీశ్ పాండే (42, 48 బంతుల్లో 2 ఫోర్లు) రాణించారు. ఓపెనర్గా మెరుపు ఇన్నింగ్స్తో కివీస్ను విజేతగా నిలిపిన హెన్రీ నికోల్స్ 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్'గా నిలువగా, రాస్ టేలర్ ' మ్యాన్ ఆఫ్ ది సిరీస్' అవార్డు అందుకున్నాడు.
సమిష్టిగా కొట్టారు : 297 పరుగుల ఛేదనను న్యూజిలాండ్ ధాటిగా మొదలు పెట్టింది. ఓపెనర్లు మార్టిన్ గప్టిల్ (66), హ హెన్రీ నికోల్స్ (80)లు తొలి వికెట్కు 106 పరుగులు జోడించారు. ఓపెనర్లు ఇద్దరూ అర్ధ సెంచరీలతో చెలరేగారు. గప్టిల్, నికోల్స్ జోరుతో న్యూజిలాండ్ వేగంగా ఛేదన పూర్తి చేసేలా కనిపించింది. స్పిన్నర్ చాహల్ను బరిలో నిలిపిన గప్టిల్ను సాగనంపిన కోహ్లి.. ప్రమాదకర కేన్ విలియమ్సన్ (22)ను సైతం మణికట్టు మాయగాడి చేతనే అవుట్ చేయించాడు!. సిరీస్లో భారత్కు కొరకరాని కొయ్యగా తయారైన రాస్ టేలర్ (12)ను జడేజా ఆరంభంలోనే వెనక్కి పంపించాడు. 159/1తో పటిష్టంగా ఉన్న న్యూజిలాండ్ 189/4, 220/5తో కష్టాల్లో పడింది. వరుస వికెట్ల పతనం టీ20 ఉత్కంఠను గుర్తు చేసింది. ఈ దశలో వికెట్ కీపర్ టామ్ లేథమ్ (32 నాటౌట్, 34 బంతుల్లో 3 ఫోర్లు)తో కలిసి కొలిన్ డీ గ్రాండ్హౌమ్ (58 నాటౌట్, 28 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్లు) ధనాధన్ ఇన్నింగ్స్ నమోదు చేశాడు. మూడు సిక్సర్లు, ఆరు ఫోర్లతో 28 బంతుల్లోనే 58 పరుగులు చేసి మ్యాచ్ను న్యూజిలాండ్ పరం చేశాడు. ఒత్తిడితో కూడిన ఛేదనలో లేథమ్ మరో ఎండ్లో కూల్గా సహకరించాడు. గ్రాండ్హౌమ్ మెరుపులతో 47.1 ఓవర్లలోనే న్యూజిలాండ్ లాంఛనం ముగించింది. భారత బౌలర్లలో చాహల్ (3/47), జడేజా (1/45) రాణించారు.
రాహుల్ శతకం : టాస్ నెగ్గిన న్యూజిలాండ్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. కొత్త ఓపెనింగ్ జంట మరోమారు నిరాశపరిచింది. యువ పృథ్వీ షా (40, 42 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్లు) స్వేచ్ఛగా బ్యాట్ ఝులిపించగా, మయాంక్ అగర్వాల్ (1) రెండో ఓవర్లోనే వికెట్ కోల్పోయాడు. కెప్టెన్ విరాట్ కోహ్లి (9) సైతం ఎంతోసేపు క్రీజులో నిలువలేదు. 12 బంతుల్లో ఓ సిక్సర్ కొట్టిన కోహ్లి.. బెనెట్ బౌలింగ్లో వెనుదిరిగాడు. జోరుమీదున్న పృథ్వీ షా సైతం వికెట్ల మధ్య పరుగు తీస్తూ నిష్క్రమించాడు. 62/3తో టాప్ ఆర్డర్ను కోల్పోయిన భారత్ ఒత్తిడిలో పడింది. ఈ పరిస్థితుల్లో తొలి వన్డే శతక హీరో శ్రేయష్ అయ్యర్ (62, 63 బంతుల్లో 9 ఫోర్లు), కెఎల్ రాహుల్ (112, 113 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్లు) శతక భాగస్వామ్యం నెలకొల్పారు. కివీస్ పేసర్లు, స్పిన్నర్లను సమయోచితంగా ఎదుర్కొన్న అయ్యర్, రాహుల్ రన్రేట్ కాపాడారు. వీరిద్దరూ క్రీజులో కుదురుకోవటంతో భారత్ భారీ స్కోరుపై ఆశలు పెంచుకుంది. 52 బంతుల్లో అయ్యర్ అర్ధ సెంచరీ చేయగా, రాహుల్ 66 బంతుల్లో అందుకున్నాడు. ఫిఫ్టీ తర్వాత అయ్యర్ వికెట్ కోల్పోయినా.. మనీశ్ పాండే (42, 48 బంతుల్లో 2 ఫోర్లు) సహకారంతో రాహుల్ జోరు కొనసాగించాడు. 9 ఫోర్లు, ఓ సిక్సర్తో 104 బంతుల్లో కెరీర్ నాల్గో వన్డే సెంచరీ సాధించిన రాహుల్, ఆఖరు వరకూ క్రీజులో నిలువలేదు. ధనాధన్ ఆడే తరుణంలో రాహుల్, మనీశ్ పాండే వరుస బంతుల్లో వికెట్ కోల్పోయారు. జడేజా (8), ఠాకూర్ (7), సైని (8)లు భారత్ను 296 పరుగులకు చేర్చారు. న్యూజిలాండ్ బౌలర్లలో హమిశ్ బెనెట్ నాలుగు వికెట్లతో మెరిశాడు.
భారత్ ఇన్నింగ్స్ : పృథ్వీ షా (రనౌట్) 40, మయాంక్ అగర్వాల్ (బి) జెమీసన్ 1, విరాట్ కోహ్లి (సి) జెమీసన్ (బి) బెనెట్ 9, శ్రేయష్ అయ్యర్ (సి) గ్రాండ్హౌమ్ (బి) నీషమ్ 62, కెఎల్ రాహుల్ (సి) జెమీసన్ (బి) బెనెట్ 112, మనీశ్ పాండే (సి) శాంట్నర్ (బి) బెనెట్ 42, రవీంద్ర జడేజా నాటౌట్ 8, శార్దుల్ ఠాకూర్ (సి) గ్రాండ్హౌమ్ (బి) బెనెట్ 7, నవదీప్ సైని నాటౌట్ 8, ఎక్స్ట్రాలు : 07, మొత్తం : (50 ఓవర్లలో 7 వికెట్లకు) 296.
వికెట్ల పతనం : 1-8, 2-32, 3-62, 4-162, 5-269, 6-269, 7-280.
బౌలింగ్ : టిమ్ సౌథీ 9-0-50-0, కైల్ జెమీసన్ 10-0-53-1, హమిశ్ బెనెట్ 10-1-64-4, గ్రాండ్హౌమ్ 3-0-10-0, జిమ్మీ నీషమ్ 8-0-50-1, మిచెల్ శాంట్నర్ 10-0-59-0.
న్యూజిలాండ్ ఇన్నింగ్స్ : మార్టిన్ గప్టిల్ (సి) చాహల్ 66, హెన్రీ నికోల్స్ (సి) రాహుల్ (బి) ఠాకూర్ 80, కేన్ విలియమ్సన్ (సి) అగర్వాల్ (బి) చాహల్ 22, రాస్ టేలర్ (సి) కోహ్లి (బి) జడేజా 12, టామ్ లేథమ్ నాటౌట్ 32, నీషమ్ (సి) కోహ్లి (బి) చాహల్ 19, కొలిన్ డీ గ్రాండ్హౌమ్ నాటౌట్ 58, ఎక్స్ట్రాలు : 11, మొత్తం : (47.1 ఓవర్లలో 5 వికెట్లకు) 300.
వికెట్ల పతనం : 1-106, 2-159, 3-186, 4-189, 5-220.
బౌలింగ్ : జశ్ప్రీత్ బుమ్రా 10-0-50-0, నవదీప్ సైని 8-0-68-0, యుజ్వెంద్ర చాహల్ 10-1-47-3, శార్దుల్ ఠాకూర్ 9.1-0-87-1, రవీంద్ర జడేజా 10-0-45-1.
1989
మూడు అంతకంటే ఎక్కువ మ్యాచుల వన్డే సిరీస్లో టీమ్ ఇండియా వైట్వాష్కు చివరగా గురైనది 1989 వెస్టిండీస్ పర్యటనలో.
ఆ సిరీస్ను భారత్ 0-5తో కోల్పోయింది.