Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తుది జట్టులో రేసులో బ్యాట్స్మెన్ పోటీ
- నేటి నుంచి న్యూజిలాండ్ ఎలెవన్తో వార్మప్
- ఉ.3.30 నుంచి స్టార్స్పోర్ట్స్లో..
నవతెలంగాణ-హామిల్టన్
పరిమిత ఓవర్ల ఫార్మాట్ సమరం ముగిసింది. 20 ఓవర్ల సిరీస్ను 5-0తో టీమ్ ఇండియా గెల్చుకుంది. 50 ఓవర్ల సిరీస్ను 3-0తో న్యూజిలాండ్ కైవసం చేసుకుంది. చెరో క్లీన్స్వీప్తో భారత్, న్యూజిలాండ్ సత్తా చాటుకున్నాయి. ఇప్పుడు పోటీ సంప్రదాయ క్రికెట్కు చేరుకుంది. భారత్, న్యూజిలాండ్లు ఐసీసీ టెస్టు చాంపియన్షిప్స్లో భాగంగా రెండు టెస్టుల సిరీస్కు సిద్ధమవుతున్నాయి. ఫిబ్రవరి 21న వెల్లింగ్టన్లో తొలి టెస్టు ఆరంభం కానుంది. టెస్టు సవాల్కు సన్నాహాకంగా భారత్ నేడు మూడు రోజుల వార్మప్ మ్యాచ్లో ఆడనుంది. న్యూజిలాండ్ ఎలెవన్తో హామిల్టన్లో కోహ్లిసేన వార్మప్కు సిద్ధమవుతోంది. టెస్టు సిరీస్కు వెళ్తోన్న తరుణంలో బౌలింగ్ విభాగం ఫామ్ ఆందోళనకు గురి చేస్తుండగా, బ్యాటింగ్ ఆర్డర్లో తుది జట్టు కూర్పు మరోసారి కెప్టెన్ కోహ్లికి తీయని తలనొప్పిగా మారనుంది. బ్యాటింగ్ లైనప్లో అందరూ ఫామ్లో ఉన్నారు. వార్మప్లో మెరిసి, తుది జట్టు రేసులో ముందు నిలిచేందుకు యువ క్రికెటర్లు ఎదురుచూస్తున్నారు.
మెరవాలి, నిలవాలి! : టెస్టుల్లో ఓపెనర్గా సూపర్ హిట్ కొట్టిన రోహిత్ శర్మ గాయంతో దూరమయ్యాడు. దీంతో మయాంక్ అగర్వాల్కు తోడుగా మరో ఓపెనర్ ఎవరనేది ఆసక్తికరం. రేసులో శుభ్మన్ గిల్, పృథ్వీ షా ఉన్నారు. గాయంతో ఆస్ట్రేలియాలో మెగా సిరీస్కు దూరమైన పృథ్వీ షా.. తర్వాత టెస్టుల్లో కనిపించలేదు. రంజీ ట్రోఫీలో బరోడాపై 202 పరుగుల ద్వి శతకం, న్యూజిలాండ్ ఏపై 150 పరుగుల ధనాధన్ ఇన్నింగ్స్తో పృథ్వీ సెలక్టర్ల దృష్టిలో పడ్డాడు. వన్డే జట్టులోకి వచ్చాడు. మూడు వన్డేల్లో 20, 24, 40 పరుగులతో అంచనాలను అందుకోలేదు. అయినా, టెస్టుల్లో ఓపెనర్గా పృథ్వీ షాకు తొలి అవకాశం లభించే వీలుంది!. చాన్నాండ్లుగా జట్టుతో ప్రయాణిస్తున్నా అరంగ్రేటం కోసం ఎదురుచూస్తున్న ఆటగాడు శుభ్మన్ గిల్. న్యూజిలాండ్ఏతో ఫస్ట్ క్లాస్ మ్యాచ్లో గిల్ 204 పరుగుల అజేయ ద్వి శతకం బాదాడు. తాజాగా 136 పరుగుల శతకం సహా, 83 పరుగుల ఇన్నింగ్స్తో మెరిశాడు. గత మూడు ఇన్నింగ్స్ల్లోనూ భారీగా పరుగులు చేసిన శుభ్మన్ గిల్ అరంగ్రేటం ఖాయమని భావిస్తున్నాడు. మయాంక్ అగర్వాల్కు తోడుగా పృథ్వీ షా, శుభ్మన్ గిల్లలో ఎవరు వెళ్తారనేది నేడు వార్మప్ మ్యాచ్లో ప్రదర్శన సైతం తేల్చనుంది!. టెస్టుల్లో వైస్ కెప్టెన్ అజింక్య రహానె తాజాగా న్యూజిలాండ్ఏపై అజేయ సెంచరీతో ఫామ్లోకి వచ్చాడు. రంజీ ట్రోఫీలో బరోడాపై 79 పరుగుల ఇన్నింగ్స్ నమోదు చేసిన రహానె తర్వాత రైల్వేస్పై 5, 8.. కర్ణాటకపై 7, 1 పరుగులతో నిరాశపరిచాడు. దేశవాళీ వైఫల్యాన్ని న్యూజిలాండ్ఏతో ఫస్ట్క్లాస్ సెంచరీతో భర్తీ చేసుకున్నాడు. మిడిల్ ఆర్డర్లో స్థానానికి ఢోకా లేకుండా చూసుకున్నాడు. రోహిత్ శర్మ ఓపెనర్గా వెళ్లటంతో తెలుగు తేజం హనుమ విహారికి తుది జట్టులో చోటు సుస్థిరం అయ్యింది!. రంజీ ట్రోఫీలో, ఇక్కడ న్యూజిలాండ్ఏతో ఫస్ల్ క్లాస్ మ్యాచ్లో విహారి చెలరేగాడు. విదర్బపై 83, 27.. హైదరాబాద్పై 55 పరుగులతో మెరిశాడు. ఇక్కడ న్యూజిలాండ్లో వరుసగా 51, 100, 59 పరుగులతో ఆకట్టుకున్నాడు. మూడు ఇన్నింగ్స్ల్లోనూ 50 పరుగుల మార్క్ దాటిన విహారి తుది జట్టులో చోటు సాధించటం లాంఛనమే. టెస్టు స్పెషలిస్ట్ చతేశ్వర్ పుజార సైతం ఫామ్లో ఉన్నాడు. న్యూజిలాండ్ఏపై 53 పరుగుల అర్ధ సెంచరీతో పుజార సత్తా చాటాడు. అంతకముందు రాజ్కోట్లో కర్ణాటకతో రంజీ మ్యాచ్లో 248 పరుగుల భారీ డబుల్ సెంచరీతో పుజార కదం తొక్కాడు. బంగ్లాదేశ్తో చారిత్రక కోల్కత డేనైట్ గులాబీ టెస్టు తర్వాత వృద్దిమాన్ సాహా మైదానంలోకి రావాల్సి ఉంది. తొలి ప్రాధాన్య వికెట్ కీపర్గా సాహాకు కోహ్లి మద్దతు ఉంది. వార్మప్ మ్యాచ్లో సాహా మ్యాచ్ ఫిట్నెస్, ఫామ్ నిరూపించుకోవాల్సి ఉంది. వాంఖడే వన్డే తర్వాత తుది జట్టులో చోటు కోల్పోయిన యువ ఆటగాడు రిషబ్ పంత్కు టెస్టు సిరీస్లో అవకాశం కష్టమే. వన్డే సిరీస్లో పెద్దగా ప్రభావం చూపించలేకపోయిన విరాట్ కోహ్లి ఐదు రోజుల ఆటలో చెలరేగాలని చూస్తున్నాడు. కోహ్లి మేనియా వార్మప్ నుంచే ఆరంభమయ్యే అవకాశం లేకపోలేదు!.
బౌలింగ్ విభాగంలోనూ తుది జట్టులో చోటు కోసం పోటీ కనిపిస్తోంది. ఫామ్లో ఉన్నా లేకపోయినా జశ్ప్రీత్ బుమ్రా పేస్ దళానికి నాయకత్వం వహించనున్నాడు. ఇషాంత్ శర్మ ఫిట్నెస్ పరీక్ష రేపు జరుగనుంది. దీంతో మహ్మద్ షమి, నవదీప్ సైనిలు పేస్ బాధ్యతలు తీసుకోనున్నారు. స్పిన్ ఆల్రౌండర్గా తుది జట్టులో చోటు కోసం రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ నడుమ ఆరోగ్యకరమైన పోటీ నడుస్తోంది. జట్టు మేనేజ్మెంట్ ఇటీవల కాలంలో జడేజాపై ఎక్కువ విశ్వాసం ఉంచుతోంది. అందుకే వార్మప్ మ్యాచ్లో విస్మరించలేని ప్రదర్శన చేయాలని అశ్విన్ భావిస్తున్నాడు. ఏకైక వార్మప్ మ్యాచ్కు ముందు భారత ఆటగాళ్లు టీమ్ బాండింగ్పై దృష్టి సారించారు. టెస్టు ఆటగాళ్లుఉదయపు నడకకు వెళ్లి సరదాగా గడిపారు. టెస్టు సిరీస్కు ముందు ఆటగాళ్లలో సానుకూల దృక్పథం తీసుకురావటం, ఒత్తిడి తొలగించటం విజయంలో గొప్పగా పనికొస్తాయని జట్టు మేనేజ్మెంట్ భావిస్తోంది.
భారత టెస్టు జట్టు : విరాట్ కోహ్లి (కెప్టెన్), మయాంక్ అగర్వాల్, పృథ్వీ షా, రవిచంద్రన్ అశ్విన్, జశ్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా, మహ్మద్ షమి, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), చతేశ్వర్ పుజార, అజింక్య రహానె, వృద్దిమాన్ సాహా (వికెట్ కీపర్), నవదీప్ సైని, శుభ్మన్ గిల్, హనుమ విహారి, ఉమేశ్ యాదవ్.