Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- షమి, బుమ్రా, సైని, ఉమేశ్ జోరు
- మెరిసిన ఓపెనర్లు పృథ్వీ, మయాంక్
- కివీస్ ఎలెవన్ తొలి ఇన్నింగ్స్ 235/10
- భారత్ రెండో ఇన్నింగ్స్ 59/0
నవతెలంగాణ-హామిల్టన్
మన పేసర్లూ మెరిశారు. న్యూజిలాండ్ ఎలెవన్ను స్వల్ప స్కోరుకే పరిమితం చేశారు. కొత్త బంతితో మహ్మద్ షమి, జశ్ప్రీత్ బుమ్రా చెలరేగారు. మహ్మద్ షమి (3/17), జశ్ప్రీత్ బుమ్రా (2/18), ఉమేశ్ యాదవ్ (2/49), నవదీప్ సైని (2/58) నిప్పులు చెరిగారు. పేసర్ల ధాటికి న్యూజిలాండ్ ఎలెవన్ తొలి ఇన్నింగ్స్లో 235 పరుగులకే కుప్పకూలింది. భారత్ 28 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించింది. ఓపెనర్లు పృథ్వీ షా (35), మయాంక్ అగర్వాల్ (23) రెండో ఇన్నింగ్స్లో మెరిశారు. ఏడు ఓవర్లలోనే 59 పరుగులు చేసి ఇన్నింగ్స్ను దూకుడుగా మొదలెట్టారు. నేడు మూడో రోజు ఆటలో భారత్ బ్యాటింగ్ సాధన చేయనుంది!.
టెస్టు సన్నాహకంలో పేసర్లు మెరిశారు. న్యూజిలాండ్ ఎలెవన్ను పేస్తో వణికించారు. నలుగురు సీమర్లు కలిసి తొమ్మిది వికెట్లు పడగొట్టారు. న్యూజిలాండ్ ఎలెవన్ను తొలి ఇన్నింగ్స్లో 235 పరుగులకే కుప్పకూల్చారు. దీంతో భారత్ 28 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించింది. రచిన్ రవీంద్ర (34, 67 బంతుల్లో 7 ఫోర్లు), హెన్రీ కూపర్ (40, 68 బంతుల్లో 6 ఫోర్లు), టామ్ బ్రూస్ (31, 34 బంతుల్లో 4 ఫోర్లు), డార్లీ మిచెల్ (32, 65 బంతుల్లో 5 ఫోర్లు) మంచి ఆరంభాలు సాధించినా, భారీ స్కోర్లు చేయలేకపోయారు. తొలి ఇన్నింగ్స్లో విఫలమైన ఓపెనింగ్ జోడీ పృథ్వీ షా (35 నాటౌట్, 25 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్), మయాంక్ అగర్వాల్ (23 నాటౌట్, 17 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్) ఆకట్టుకున్నారు. రెండో ఇన్నింగ్స్లో ఏడు ఓవర్లలోనే 59/0తో దూకుడుగా ఆడారు. భారత్ ప్రస్తుతం 87 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. వార్మప్ మ్యాచ్లో ఆఖరు రోజు భారత్ బ్యాటింగ్ సాధనపై దృష్టి సారించనుంది.
పేసర్లు మెప్పించారు : వన్డే సిరీస్లో బౌలర్లు తేలిపోవటంతో, టెస్టు సన్నాహకంలో బౌలర్ల సామర్థ్యంపై కొన్ని అనుమానాలు నెలకొన్నాయి. వార్మప్ మ్యాచ్లో పేసర్లు అనుమానాలను పటాపంచలు చేశారు!. స్టార్ సీమర్ జశ్ప్రీత్ బుమ్రాపై ఈ అనుమానాలు మరింత ఎక్కువగా వినిపించాయి. ఓపెనర్ విల్ యంగ్ (2)ను వికెట్ల వెనకాల క్యాచ్తో బుమ్రా సాగనంపాడు. కివీన్ ఎలెవన్ తొలి వికెట్ పడగొట్టాడు. మహ్మద్ షమి మరో వికెట్తో జతకలిశాడు. టిమ్ సీఫర్ట్ (9) సైతం షమి ఓవర్లో వెనుక అవుటయ్యాడు. 36/2తో న్యూజిలాండ్ టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ను కోల్పోయింది. రచిన్ రవీంద్ర (34, 67 బంతుల్లో 7 ఫోర్లు), ఫిన్ అలెన్ (20, 55 బంతుల్లో 3 ఫోర్లు) సహా హెన్రీ కూపర్ (40, 68 బంతుల్లో 6 ఫోర్లు), టామ్ బ్రూస్ (31, 34 బంతుల్లో 4 ఫోర్లు), డార్లీ మిచెల్ (32, 65 బంతుల్లో 5 ఫోర్లు) మంచి ఆరంభాలు సాధించారు. ఏ ఒక్కరూ శుభారంభాలను సద్వినియోగం చేసుకోలేదు. ఉమేశ్ యాదవ్, నవదీప్ సైనిలు సైతం బంతితో మెరిశారు. నిలదొక్కుకుంటున్న బ్యాట్స్మెన్ను పెవిలియన్కు చేర్చారు. ఆఖర్లో స్కాట్ (11), క్లీవెర్ (13), సోధి (14)ల పరుగులతో న్యూజిలాండ్ 200 పరుగుల మార్క్ దాటింది. తొమ్మిది వికెట్లు పేసర్లు పడగొట్టగా, ఆఖరు వికెట్ను ఆఫ్స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ సొంతం చేసుకున్నాడు. 74.2 ఓవర్లలో భారత బౌలర్లు న్యూజిలాండ్ ఎలెవన్ను పడగొట్టారు. భారత్కు విలువైన 28 పరుగుల ఆధిక్యం సాధించారు.
ఓపెనర్లు మెరిశారు : న్యూజిలాండ్ పిచ్లపై కొత్త బంతిని ఎదుర్కొవటం భారత ఓపెనర్లకు పెద్ద పరీక్ష. ఆ దిశగా తొలి ఇన్నింగ్స్లో ముగ్గురు బ్యాట్స్మెన్ నిరాశపరిచారు. పృథ్వీ షా (0), మయాంక్ అగర్వాల్ (1), శుభ్మన్ గిల్ (0)లు వైఫల్యం చెందారు. రెండో ఇన్నింగ్స్లో ఓపెనర్లు గొప్పగా ఆకట్టుకున్నారు. తొలి ఇన్నింగ్స్లో తమ వికెట్లు పడగొట్టిన స్కాట్ను ఉతికారేశారు. స్కాట్ వేసిన మూడు ఓవర్లలోనే 34 పరుగులు కొట్టారు. మయాంక్ అగర్వాల్ స్కాట్ను హ్యాట్రిక్ బౌండరీలు బాదాడు. 6, 4, 4తో చెలరేగాడు. పృథ్వీ షా సైతం ఐదు ఫోర్లు, ఓ సిక్సర్తో మెరిసింది. పృథ్వీ షా, మయాంక్ అగర్వాల్ మెరుపులతో భారత్ ఏడు ఓవర్లలోనే 59 పరుగులు చేసింది. నేడు సైతం ఓపెనర్లు సహా శుభ్మన్ గిల్, అజింక్య రహానె బ్యాటింగ్ ప్రాక్టీస్పై భారత్ ఫోకస్ చేయనుంది.
నిలకడగా కొంత కాలం సరైన ప్రదర్శన చేయలేనప్పుడు ఓ ఆటగాడి సామర్థ్యంపై చర్చను అర్థం చేసుకోవచ్చు. కేవలం 2-3 గేముల్లో రాణించలేదని ఈ చర్చ చేయటం తగదు. జనాలు అంత త్వరగా బుమ్రా మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శనలను మరిచిపోయారు. భారత్కు బుమ్రా సాధించిన విజయాలను అంత తేలిగ్గా ఎలా విస్మరించగలరు? అందుకే మీరు సానుకూలంగా ఆలోచిస్తే, అది ఆటగాడికీ మంచిది. రెట్టించిన ఆత్మవిశ్వాసంతో పుంజుకోగలడు'
- బుమ్రా విమర్శలపై మహ్మద్ షమి
స్కోరు వివరాలు
భారత్ తొలి ఇన్నింగ్స్ : 163/10
న్యూజిలాండ్ ఎలెవన్ తొలి ఇన్నింగ్స్ : విల్ యంగ్ (సి) పంత్ (బి) బుమ్రా 2, రవీంద్ర (సి) పంత్ (బి) ఉమేశ్ 34, సీఫర్ట్ (సి) పంత్ (బి) షమి 9, ఫిన్ అలెన్ (బి) బుమ్రా 20, బ్రూస్ (సి) సైని 31, మిచెల్ (సి) షా (బి) ఉమేశ్ 32, నీషమ్ (బి) షమి 1, క్లీవెర్ (బి) సైని 13, స్కాట్ నాటౌట్ 11, ఇశ్ సోధి (సి) పుజార (బి) అశ్విన్ 14, ఎక్స్ట్రాలు : 28, మొత్తం : (74.2 ఓవర్లలో ఆలౌట్) 235.
వికెట్ల పతనం : 1-11, 2-36, 3-70, 4-82, 5-133, 6-155, 7-161, 8-204, 9-213, 10-235.
బౌలింగ్ : జశ్ప్రీత్ బుమ్రా 11-3-18-2, ఉమేశ్ యాదవ్ 13-1-49-2, మహ్మద్ షమి 10-5-17-3, నవదీప్ సైని 15-2-58-2, రవిచంద్రన్ అశ్విన్ 15.2-2-46-1, రవీంద్ర జడేజా 10-4-25-0.
భారత్ రెండో ఇన్నింగ్స్ : పృథ్వీ షా నాటౌట్ 35, మయాంక్ అగర్వాల్ నాటౌట్ 23, ఎక్స్ట్రాలు : 01, మొత్తం : (7 ఓవర్లలో వికెట్ నష్టం లేకుండా) 59.
బౌలింగ్ : బ్లెయిర్ టిక్నర్ 3-0-19-0, స్కాట్ 3-0-34-0, జాన్సన్ 1-0-6-0.