Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మయాంక్, రిషబ్ పంత్ అర్ద శతకాలు
- భారత్ రెండో ఇన్నింగ్స్ 252/4
- కివీస్ ఎలెవన్తో టూర్ మ్యాచ్ డ్రా
న్యూజిలాండ్ పర్యటనలో టీమ్ ఇండియా తొలి ఎరుపు బంతి సవాల్ను విజయవంతంగా ఎదుర్కొన్నది. కొత్త బంతితో ఓపెనర్లు పృథ్వీ షా, మయాంక్ అగర్వాల్ మెరిశారు. టాప్ ఆర్డర్లో చతేశ్వర్ పుజార, మిడిల్ ఆర్డర్లో హనుమ విహారి భారీ ఇన్నింగ్స్లు నమోదు చేశాడు. లోయర్ ఆర్డర్లో రిషబ్ పంత్ అర్ద సెంచరీతో ఆకట్టుకున్నాడు. పచ్చిక పిచ్పై పేసర్లు చెలరేగిపోయారు. స్వల్ప స్కోరుకే ప్రత్యర్థిని కుప్పకూల్చి తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం అందించారు. న్యూజిలాండ్ ఎలెవన్తో మూడు రోజుల వార్మప్ మ్యాచ్లో కోహ్లిసేన అస్త్రాలను పరీక్షించుకుంది. సంతృప్తికర ప్రదర్శనతో తొలి టెస్టు సవాల్కు వెల్టింగ్టన్కు బయల్దేరింది.
నవతెలంగాణ-హామిల్టన్
భారత్, న్యూజిలాండ్ ఎలెవన్ మూడు రోజుల వార్మప్ మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఓపెనర్లు మయాంక్ అగర్వాల్ (81, 99 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్స్లు), పృథ్వీ షా (39, 31 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్) సహా రిషబ్ పంత్ (70, 65 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్లు) రాణించటంతో రెండో ఇన్నింగ్స్లో భారత్ 252/4 పరుగులు చేసింది. మూడో రోజు ఆటలో 41 ఓవర్లే ఎదుర్కొన్న టీమ్ ఇండియా, న్యూజిలాండ్ ఎలెవన్తో డ్రాకు అంగీకరించింది. తొలి ఇన్నింగ్స్లో హనుమ విహారి (101), చతేశ్వర్ పుజార (93) మెరుపులతో భారత్ 263 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. న్యూజిలాండ్ ఎలెవన్ తొలి ఇన్నింగ్స్లో 235 పరుగులు చేసింది. పేసర్లు మహ్మద్ షమి, జశ్ప్రీత్ బుమ్రా, నవదీప్ సైని, ఉమేశ్ యాదవ్లు తొమ్మిది వికెట్లు పడగొట్టి ఔరా అనిపించారు. రెండు టెస్టుల సిరీస్కు ముందు ఏకైక వార్మప్ మ్యాచ్ను కోహ్లిసేన దిగ్విజయంగా ముగించుకుంది. ఫిబ్రవరి 21 నుంచి భారత్, న్యూజిలాండ్ తొలి టెస్టు ఆరంభం కానుంది.
మయంక్, పంత్ జోరు : ఓవర్నైట్ స్కోరు 59/0తో మూడో రోజు బ్యాటింగ్ మొదలు పెట్టిన టీమ్ ఇండియా అదే జోరు కొనసాగించింది. ఓపెనింగ్ జోడీ సుమారు 9 రన్రేట్తో దుమ్మురేపింది. తొలి ఇన్నింగ్స్లో ఇబ్బంది పెట్టిన స్కాట్ను ఉతికారేసింది. ఓవర్నైట్ స్కోరు 35 పరుగులకు మరో నాలుగు పరుగులు జోడించిన పృథ్వీ షా (39) డార్లీ మిచెల్కు వికెట్ కోల్పోయాడు. దీంతో 72 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. తొలి ఇన్నింగ్స్లో నిరాశపరిచిన యువ బ్యాట్స్మన్ శుభ్మన్ గిల్ (8) రెండో ఇన్నింగ్స్లోనూ మెరువలేదు. 13 బంతుల్లో 8 పరుగులకే వికెట్ కోల్పోయాడు. డార్లీ మిచెల్ బంతికి వికెట్ల ముందు అడ్డంగా దొరికిపోయాడు. 82/2తో భారత్ ఇద్దరు యువ బ్యాట్స్మెన్ను కోల్పోయింది. ఈ సమయంలో మయాంక్ అగర్వాల్కు రిషబ్ పంత్ (70) తోడయ్యాడు. పంత్, అగర్వాల్ మూడో వికెట్కు విలువైన 100 పరుగులు జోడించారు. రిషబ్ పంత్ 4 ఫోర్లు, 4 సిక్సర్లతో చెలరేగాడు. మయాంక్ అగర్వాల్ 10 ఫోర్లు, 3 సిక్సర్లతో 99 బంతుల్లో 81 పరుగులు పిండుకున్నాడు. భారత్-ఏతో జనవరిలోనే న్యూజిలాండ్కు చేరుకున్న మయాంక్ అగర్వాల్ కివీస్ గడ్డపై తొలి ఫిఫ్టీ ప్లస్ స్కోరు సాధించాడు. న్యూజిలాండ్-ఏతో ఫస్ట్ క్లాస్ మ్యాచ్లో డకౌట్గా నిలిచిన మయాంక్.. వన్డే సిరీస్లో వరుసగా 32, 3, 1 పరుగులతో పేలవ ఫామ్ కొనసాగించాడు. కీలక తొలి టెస్టుకు ముందు మయాంక్ అగర్వాల్ ఫామ్లోకి వచ్చాడు. జట్టు మేనేజ్మెంట్ ఆందోళనను తొలగించాడు!. ధనాధన్ రిషబ్ పంత్ నిష్క్రమించినా.. మరో వికెట్ కీపర్ బ్యాట్స్మన్ వృద్దిమాన్ సాహా (30 నాటౌట్, 38 బంతుల్లో 5 ఫోర్లు), రవిచంద్రన్ అశ్విన్ (16 నాటౌట్, 43 బంతుల్లో 2 ఫోర్లు) క్రీజులో విలువైన సమయం గడిపారు. రెండో ఇన్నింగ్స్లో 48 ఓవర్లలో భారత్ 252/4 పరుగులు చేసింది. ఇరు జట్లు మ్యాచ్ను డ్రాగా ముగించేందుకు అంగీకరించాయి. న్యూజిలాండ్ ఎలెవన్ పేసర్ డార్లీ మిచెల్ మూడు వికెట్లు పడగొట్టి ఆకట్టుకున్నాడు.
స్కోరు వివరాలు :
భారత్ తొలి ఇన్నింగ్స్ : 263/10
న్యూజిలాండ్ ఎలెవన్ తొలి ఇన్నింగ్స్ : 235 ఆలౌట్
భారత్ రెండో ఇన్నింగ్స్ : పృథ్వీ షా (బి) డార్లీ మిచెల్ 39, మయాంక్ అగర్వాల్ (రిటైర్డ్ ఔట్) 81, శుభ్మన్ గిల్ (ఎల్బీ) డార్లీ మిచెల్ 8, రిషబ్ పంత్ (సి) క్లీవెర్ (బి) డార్లీ మిచెల్ 70, వృద్దిమాన్ సాహా నాటౌట్ 30, రవిచంద్రన్ అశ్విన్ నాటౌట్ 16, ఎక్స్ట్రాలు : 08, మొత్తం : (48 ఓవర్లలో 4 వికెట్లకు) 252.
వికెట్ల పతనం : 1-72, 2-82, 3-182, 4-216.
బౌలింగ్ : బ్లెయిర్ టిక్నర్ 3-0-19-0, స్కాట్ 12-0-81-0, జాన్సన్ 4-0-18-0, డార్లీ మిచెల్ 9-2-33-3, నీషమ్ 6-1-29-0, హెన్రీ కూపర్ 3-0-27-0, టామ్ బ్రూస్ 5-1-8-0, ఫిన్ అలెన్ 1-1-0-0.