Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వెల్లింగ్టన్ టెస్టు రేసులో రిషబ్ పంత్
- ప్రాక్టీస్లో మెరిసిన యువ కెరటం
- సాహాను కాదని అవకాశం ఇస్తారా!
నవతెలంగాణ క్రీడా విభాగం
22 ఏండ్ల కుర్రాడు. ప్రస్తుతం జాతీయ జట్టులోని సీనియర్ ఆటగాళ్లు సైతం చూడని విమర్శలు చవిచూశాడు. టీమ్ ఇండియా తరఫున విజయవంతమైన ఆటగాళ్లు అందుకున్న నీరాజనాల కంటే అమితమైన ఆదరణ దక్కించుకున్నాడు. యువ క్రికెటర్లలో అత్యంత ప్రతిభావంతుడిగా మద్ర పడ్డాడు. ఇంగ్లాండ్, ఆస్ట్రేలియాల్లో టెస్టు శతకాలు బాది, భారత క్రికెట్ చరిత్రలో దిగ్గజాలకు దక్కని ఘనత సొంతం చేసుకున్నాడు. అయినా, తుది జట్టులో అతడికి చోటు ఉంటుందా? అని ప్రతి మ్యాచ్కు ముందు చర్చ జరుగుతోంది. వార్మప్ మ్యాచ్ ప్రదర్శనతో వెల్టింగ్టన్ టెస్టులో రిషబ్ పంత్ ఆడతాడా? చూడాలి.
వికెట్ కీపింగ్లో రిషబ్ పంత్ శైలే వేరు. పేసర్లు వికెట్లకు దూరంగా విసిరిన బంతులు, బౌన్సర్లుగా సంధించిన బంతులు బైస్ రూపంలో బౌండరీ చేరకుండా చేసేందుకు రిషబ్ పంత్ జిమ్నాస్టిక్స్ స్కిల్స్ ప్రదర్శిస్తుంటాడు. గాల్లోకి ఎగిరి బంతిని అందుకోవటం, వికెట్కు ఇరువైపులా డైవ్ చేస్తూ గ్లౌవ్స్లోకి బంతిని తీసుకోవటం, గల్లీల్లో కుర్రాళ్ల తరహాలో పైకి జంప్ చేస్తూ స్లిప్స్లోని ఆటగాళ్లకు బంతిని అందించటం పంత్ వికెట్ కీపింగ్లో ఎక్కువగా చూస్తుంటాం. ఈ తరహా జిమ్నాస్టికల్ సన్నివేశాలు యువతలో పంత్కు క్రేజ్ను తీసుకొస్తే, వికెట్ కీపింగ్లో వైఫల్య ప్రదర్శనకు విశ్లేషకుల నుంచి విమర్శలు తెచ్చి పెడుతోంది. అసలు ప్రదర్శన పక్కకొదిలి, కొసరు ప్రదర్శనలపై ఫోకస్ పెడుతున్నాడని పంత్పై తరచుగా సోషల్ మీడియాలో విమర్శలు వినిపిస్తుంటాయి. ప్రతిభావంతుడు, ఎం.ఎస్ వారసత్వం అందుకోగల సమర్ధుడు.. ఈ వ్యాఖ్యలు యువ రిషబ్ పంత్పై ఒత్తిడి భారం పెంచాయి. ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా పర్యటనల్లో టెస్టు శతకాలు సాధించిన రిషబ్ పంత్.. సాహా జట్టులో లేని వేళ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. వరుస సెంచరీలతో జోరందుకున్న వేళ అంతా పంత్కు అనుకూలంగానే సాగుతుందని అనిపించింది. కానీ ఇంతలోనే స్వదేశంలో టెస్టు సీజన్కు బెంచ్కు పరిమితం. వాంఖడే వన్డే తర్వాత పరిమిత ఓవర్ల ఫార్మాట్లోనూ పెవిలియన్ నుంచి మ్యాచ్ను చూడాల్సిన దుస్థితి. ఫిబ్రవరి 21 నుంచి భారత్, న్యూజిలాండ్ తొలి టెస్టు సమరానికి సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో తుది జట్టు కూర్పులో రిషబ్ పంత్ కుదిరేనా? చూడాలి.
ప్రాక్టీస్లో పంత్కే ప్రాధాన్యం! : కోహ్లి, శాస్త్రి హయాంలో జట్టు మేనేజ్మెంట్ ఆలోచనలు, తుది జట్టు కూర్పుపై ఓ అంచనాకు రాలేం. ఈ రోజు ఓ ఆటగాడిని ఆకాశానికి ఎత్తేశారంటే, తర్వాతి మ్యాచ్కు అతడిని దూరం చేసిన ఘటనలు ఎన్నో చూశాం. ఆస్ట్రేలియాతో సిడ్నీ టెస్టులో ఐదు వికెట్ల ప్రదర్శన చేసిన తర్వాత విదేశీ టెస్టుల్లో కుల్దీప్ యాదవ్ మా నం.1 స్పిన్నర్ అని చీఫ్ కోచ్ రవిశాస్త్రి అన్నాడు. కుల్దీప్ యాదవ్కు సిడ్నీ టెస్టే చివరి మ్యాచ్గా మిగిలిపోతుందని ఎవరూ ఊహించలేదు (బహుశా రవిశాస్త్రికి తెలుసేమో!). రిషబ్ పంత్ విషయంలో టీమ్ మేనేజ్మెంట్ సరైన రీతిలో వ్యవహరించలేదు. ఓ దశలో విమర్శకులు సైతం జాలిపడేలా జట్టు మేనేజ్మెంట్ పంత్ విమర్శలు గుప్పించింది. వాంఖడేలో ఆస్ట్రేలియాతో వన్డేలో తల బెదరటంతో పంత్ మైదానం వీడాడు. ఆ మ్యాచ్లో వికెట్ కీపింగ్ గ్లౌవ్స్ తీసుకున్న కెఎల్ రాహుల్, మళ్లీ విడిచిపెట్టలేదు. జట్టుతో పాటు న్యూజిలాండ్కు వచ్చిన రిషబ్ పంత్ ఐదు టీ20, మూడు వన్డేలు ముగిసినా తొలి అవకాశం కోసం ఎదురుచూస్తున్నాడు.
వృద్దిమాన్ సాహా ఉండగా టెస్టుల్లోనూ పంత్కు అవకాశం లేదనే వాస్తవం అభిమానులకు చేరింది!. దీంతో పంత్కు నిరాశ తప్పదనే భావన కనిపించింది. విచిత్రంగా మూడు రోజుల వార్మప్ మ్యాచ్లో రిషబ్ పంత్కు జట్టు మేనేజ్మెంట్ ప్రాధాన్యత కల్పించింది. లంచ్కు ముందు, టీ తర్వాత సెషన్లలో రిషబ్ పంత్ వికెట్ కీపింగ్ చేయగా.. లంచ్ తర్వాత ఒక్క సెషన్లోనే వృద్దిమాన్ సాహా వికెట్ల వెనకాల కనిపించాడు. బ్యాటింగ్లోనూ వృద్దిమాన్ సాహా కంటే ముందుగా పంత్ను పంపించారు. తొలి ఇన్నింగ్స్లో ఇద్దరు నిరాశపరిచారు. రెండో ఇన్నింగ్స్ల్లో 65 బంతుల్లో 70 పరుగులు చేసిన పంత్ తన చేయగలిగే ప్రదర్శన ఏంటో చూపించాడు. సాహా అజేయంగా 30 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు.
అవకాశం ఉందా? : ప్రపంచకప్ తర్వాత కరీబియన్ పర్యటనలో వృద్దిమాన్ సాహా జట్టులో ఉన్నప్పటికీ రిషబ్ పంత్కు వికెట్ కీపింగ్ అవకాశం లభించింది. గాయం నుంచి కోలుకున్న తొలి ప్రాధాన్య కీపర్కు పెవిలియన్ పాత్ర తప్పలేదు. అప్పట్లో ఇదీ ఓ అనూహ్య ఎంపిక నిర్ణయమే. భారత పిచ్లపై పేస్తో పాటు సుదీర్ఘ సెషన్ల పాటు స్పిన్ను వికెట్ల వెనకాల కాచుకోవాలి. విదేశీ పిచ్లు అందుకు భిన్నం. స్వదేశంలో వికెట్ కీపర్ బ్యాటింగ్ సామర్థ్యంపై ఆధారపడాల్సిన అవసరం కోహ్లిసేనకు ఏ కోశాన కనిపించదు. కానీ విదేశీ పిచ్లపై మూడో ఇన్నింగ్స్లో వేగంగా పరుగులు చేయగల ఓ బ్యాట్స్మన్ భారత్కు అవసరం. వికెట్ కీపింగ్ నైపుణ్యం ప్రకారం సాహా ముందు వరుసలో ఉంటాడు. కానీ న్యూజిలాండ్ పిచ్లపై, వార్మప్లో పంత్ గ్లౌవ్స్తో మెరుగ్గానే రాణించాడు. న్యూజిలాండ్ పిచ్లపై బంతి స్వింగ్ అవుతుంది. బౌన్స్లో నిలకడ ఉంటుంది( భారత్లో అనిశ్చితితో కూడిన బౌన్స్ లభిస్తుంది). ఇక్కడ వికెట్ కీపర్లు ఎక్కువగా వికెట్లకు దూరంగానే నిల్చోని ఉండాలి. తొలి రెండు రోజులు పేసర్లకు అనుకూలించిన తర్వాత న్యూజిలాండ్ పిచ్లు క్రమంగా స్పిన్కు మొగ్గుచూపుతున్నాయి. నాల్గో ఇన్నింగ్స్లో ప్రత్యర్థిని ఆలౌట్ చేసేందుకు బౌలర్లకు తగినంత సమయం, ఓవర్లు ఇవ్వాలి. అందుకు మూడో ఇన్నింగ్స్లో భారత్ తక్కువ సమయంలో ఎక్కువ పరుగులు రాబట్టాలి. అందుకే కోహ్లి, శాస్త్రి విదేశీ పిచ్లపై రిషబ్ పంత్ను తుది జట్టులోకి తీసుకునేందుకు ఎక్కువ ఇష్టపడతారు!. న్యూజిలాండ్ జట్టులో అజాజ్ పటేల్ రూపంలో ఒక్క స్పిన్నరే ఉన్నాడు. బ్యాటింగ్ లైనప్లో ఓ ఎడమ చేతి వాటం బ్యాట్స్మన్ ఉండాల్సిన అవసరం, స్పిన్నర్కు చెక్ పెట్టాలనే ఆలోచన సైతం పంత్ వెల్లింగ్టన్ టెస్టులో ఆడుతున్నాడనే సంకేతాలు అందిస్తున్నాయి. జట్టు ఎంపికలో అంచనాలకు అందని కోహ్లి, శాస్త్రి ద్వయం వెల్లింగ్టన్లో ఏం చేయనుంది? ఆసక్తికరం.