Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టెస్టు, టీ20 కెప్టెన్సీకి డుప్లెసిస్ గుడ్బై
జొహనెస్బర్గ్ : దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టు టెస్టు, టీ20 జట్ల నాయకుడిగా డుప్లెసిస్ వైదొలిగాడు. 35 ఏండ్ల డుప్లెసిస్, తక్షణమే నాయకత్వ స్థానం నుంచి తప్పుకుంటున్నట్టు క్రికెట్ దక్షిణాఫ్రికాకు (సీఎస్ఏ)కు పంపిన లేఖలో పేర్కొన్నాడు. తర్వాతి తరం నాయకత్వం నిలదొక్కుకునేందుకు అన్ని విధాల సహకారం అందిస్తానని డుప్లెసిస్ తెలిపాడు. ఇంగ్లాండ్తో వన్డే సిరీస్కు క్వింటన్ డికాక్ను తాత్కాలిక కెప్టెన్గా దక్షిణాఫ్రికా ఎంపిక చేసింది. దక్షిణాఫ్రికా తీర్ఘకాలిక, పూర్తి స్థాయి నాయకుడు డికాకే అని దక్షిణాఫ్రికా క్రికెట్ డైరెక్టర్ గ్రేమ్ స్మిత్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. '2019 వరల్డ్కప్ తర్వాత కెప్టెన్గా కొనసాగాలని నిర్ణయించుకున్నాను. కీలక ఆటగాళ్లు వీడ్కోలు పలుకటం, సహాయక సిబ్బంది మారిన దశలో జట్టు పునర్మిమాణంలో కెప్టెన్గా నా బాధ్యత నిర్వర్తించాలని అనుకున్నాను. నాయకత్వ బాధ్యతల నుంచి తప్పుకోవాలనేది నిర్ణయం తీసుకోవటం కష్టమైన పని. సీనియర్ ఆటగాడిగా యువ నాయకుడు క్వింటన్ డికాక్కు, మార్క్ బౌచర్, సహచరులకు పూర్తి సహకారం అందిస్తాను. దక్షిణాఫ్రికా క్రికెట్ నూతన దశలోకి ప్రవేశించింది. కొత్త నాయకత్వం, కొత్త ముఖాలు, కొత్త సవాళ్లు, సరికొత్త వ్యూహచతురత అవసరం. మూడు ఫార్మాట్లలో ఆటగాడిగా కొనసాగుతాను. నా అనుభవం యువ నాయకత్వంతో పంచుకుంటాను. నాయకుడిగా దక్షిణాఫ్రికాను ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లేందుకు అత్యుత్తమ ప్రతిభ చూపించేందుకు తపన పడ్డాను. నాయకుడిగా నేను చేయగలిగినది చేశాను. నాకు ఎప్పుడూ జట్టు ప్రయోజనాలే ప్రధానం' అని డుప్లెసిస్ పేర్కొన్నాడు. దక్షిణాఫ్రికా తన సిరీస్లో ఆస్ట్రేలియాను ఎదుర్కొనుంది. కంగారూ జట్టుతో దక్షిణాఫ్రికా మూడు టీ20, మూడు వన్డేలు ఆడనుంది.