Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్ర క్రీడల మంత్రి కిరణ్ రిజిజు
న్యూఢిల్లీ: కబడ్డీ ఫెడరేషన్ అనుమతి లేకుండా పాకిస్తాన్కు వెళ్లిన ఆటగాళ్లపై విచారణ జరపాలని కేంద్ర క్రీడా శాఖ మంత్రి కిరణ్ రిజిజు కబడ్డీ ఫెడరేషన్ను కోరారు. ప్రపంచ కబడ్డీ ఛాంపియన్షిప్ పేరిట పాకిస్తాన్ నిర్వహించిన ఈవెంట్లో కొందరు లాహోర్కు వెళ్లి ఆ పోటీల్లో పాల్గొన్నారు. ఆదివారం జరిగిన ఫైనల్లో భారత ఆటగాళ్లు ఓటమిపాలయ్యారు. సోమవారం అట్టారి-వాఘా బార్డర్ మీదుగా ఆ జట్టు భారత్కు చేరుకుంది. ఈ నేపథ్యంలో స్పందించిన కేంద్ర మంత్రి భారత అధికార కబడ్డీ జట్టు పాకిస్థాన్కు వెళ్లలేదని చెప్పారు. అక్కడికి ఎవరు వెళ్లారో తమకు తెలియదని, ఎవరు పడితే వాళ్లు ఎక్కడపడితే అక్కడ భారత్ పేరుతో ఆడటం సరికాదని స్పష్టం చేశారు. అనుమతి లేకుండా పాకిస్థాన్కు వెళ్లి భారత జట్టు పేరుతో ఆడిన వారిని గుర్తించి విచారణ జరపాలని కబడ్డీ ఫెడరేషన్ను కోరినట్లు మంత్రి చెప్పారు. ఇదిలా ఉండగా, పాకిస్థాన్ నుంచి భారత్కు వచ్చిన జట్టుకు బాధ్యత వహించిన దావిందర్ సింగ్ మాట్లాడుతూ.. తమకు ఎవరి అనుమతులు అవసరం లేదని, తామంతా వ్యక్తిగతంగానే పాకిస్తాన్కు వెళ్లామని అందులో తప్పులేదని చెప్పడం గమనార్హం.