Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వెల్లింగ్టన్: ప్రపంచ క్రికెట్లో అత్యంత బిజీ షెడ్యూల్ కలిగిన క్రికెటర్లలో భారత కెప్టెన్ విరాట్ కోహ్లి ముందుంటాడు. గత మూడేండ్లలో విరాట్ కోహ్లి విరామం లేని క్రికెట్ ఆడుతున్నాడు. భారత్ను మూడు ఫార్మాట్లలో నాయకుడిగా నడిపిస్తూ, ఐపీఎల్లో సైతం బెంగళూర్ జట్టు తరఫున అన్ని మ్యాచుల్లో బరిలోకి దిగుతున్నాడు. బిజీ క్రికెటర్లలో ఒకడైన విరాట్ కోహ్లి గతంలో ఎన్నో సార్లు పని ఒత్తిడిపై స్పందించాడు. బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ రానున్న మూడేండ్లు జాతీయ జట్టు తరఫున మూడు ఫార్మాట్లలో ఇదే ఉత్సాహంతో ఆడగలనని అన్నాడు. 'నాకు తెలిసి గత 8-9 ఏండ్లుగా అంతర్జాతీయ క్రికెట్లో ఏడాదికి 300 రోజులు క్రికెట్తోనే సరిపోతుంది. మ్యాచ్ రోజులు, ప్రయాణం, ప్రాక్టీస్ సెషన్లు ఇలా 300 రోజులు క్రికెట్తోనే ఉంటున్నాను. అన్ని వేళలా అదే ఉత్సాహం ఉంటుంది. బిజీ షెడ్యూల్ ఆటగాళ్లపై ఒత్తిడి పెంచుతుంది. కష్టమైనా వీలు చూసుకుని క్రమంగా విరామం తీసుకోవాలి. రానున్న కాలంలో నాతో సహా చాలా మంది క్రికెటర్లు ఇదే చేయనున్నారు. ప్రత్యేకించి మూడు ఫార్మాట్లు ఆడే క్రికెటర్లు కచ్చితంగా విరామం తీసుకోవాల్సిందే. జట్టు నాయకుడిగా నాపై మరింత పని ఒత్తిడి ఉంటుంది. వచ్చే మూడేండ్లలో ఎటువంటి ఇబ్బంది లేకపోయినా, 35 ఏండ్లలో పని ఒత్తిడిని సమీక్షించుకోవాల్సి ఉంటుంది. అప్పుడు నా ఆలోచన, వ్యూహం కచ్చితంగా భిన్నంగా ఉంటాయి' అని విరాట్ కోహ్లి పేర్కొన్నాడు.
న్యూజిలాండ్ పర్యటనలో టీమ్ ఇండియాకు రెండు లక్ష్యాలు ఉన్నాయి. రెండు టెస్టుల్లోనూ విజయాలు సాధించి 120 పాయింట్లు దక్కించుకోవటం. కివీస్ గడ్డపై వరల్డ్ నం.1 జట్టు ప్రదర్శన చేయటం. కోహ్లిసేన ఈ రెండు లక్ష్యాల కోసం న్యూజిలాండ్తో సిరీస్ను మొదలుపెట్టనుంది'
- రవిశాస్త్రి, భారత చీఫ్ కోచ్