Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐపీఎల్పై బీసీసీఐ, ప్రాంఛైజీల ఆలోచన
- వాయిదాపై ఏకీభవించిన ప్రాంఛైజీలు
- ప్రజారోగ్యమే ప్రధానమని తీర్మానించిన సమావేశం
'కరోనా వైరస్ కబళిస్తోన్న ప్రమాదకర పరిస్థితుల్లో బీసీసీఐ, ప్రాంఛైజీలు ఐపీఎల్ నిర్వహణ ద్వారా డబ్బు ఆర్జినకు పూనుకుంటున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. బీసీసీఐ, ప్రాంఛైజీలు డబ్బు గురించి ఏమాత్రం ఆలోచన చేయటం లేదు. ప్రజలకు సేవ చేసేందుకు అందరం ఉన్నాం, ప్రజారోగ్యమే ప్రధానం. ఆరోగ్యం, భద్రత ముందు ఆర్థిక లబ్ది ఎంతమాత్రం నిలబడదు'.. బీసీసీఐ ఉన్నతాధికారులు, ఐపీఎల్ ప్రాంఛైజీల యజమానుల సమావేశం అనంతరం నెస్ వాడియా స్పందన ఇది. రానున్న నెల రోజుల్లో కరోనా వైరస్ పరిస్థితి కట్టడి కాకపోతే, ఐపీఎల్ నిర్వహణ ఈ ఏడాదికి మరిచిపోయేందుకు మానసికంగా సిద్ధమైనట్టు ప్రాంఛైజీలు చెబుతుండటం గమనార్హం.
నవతెలంగాణ-ముంబయి
ప్రపంచంలో పాపులర్ క్రికెట్ లీగ్, భారత ఆర్థిక వ్యవస్థకు సుమారు రూ. 8 లక్షల కోట్ల లావాదేవీల ఊతం అందించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)పై ' వేచి చూద్దాం' వైఖరి కనిపిస్తోంది. కరోనా విజృంభణ, కేంద్ర ప్రభుత్వం, ఆరోగ్య శాఖ సూచనల నేపథ్యంలో ఐపీఎల్ 13 సహా దక్షిణాఫ్రికా, భారత్ వన్డే సిరీస్ను వాయిదా వేస్తున్నట్టు బీసీసీఐ శుక్రవారం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఐపీఎల్ను ఏప్రిల్ 15 వరకు వాయిదా వేయటంపై శనివారం ముంబయిలోని బీసీసీఐ ప్రధాన కార్యాలయంలో ఐపీఎల్ ప్రాంఛైజీల యజమానులతో బోర్డు అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, కార్యదర్శి జై షాలు భేటీ అయ్యారు. అభిమానులకు, ప్రేక్షకులకు ఆరోగ్యకరమైన పరిస్థితుల్లో ఐపీఎల్ వినోదం అందించటంపై బోర్డు, ప్రాంఛైజీలు ఏకతాటిపై వచ్చినట్టు సమాచారం. అభిమానులు, క్రికెటర్లు, జట్టు మేనేజ్మెంట్, ఆతిథ్య నగరాలు ఆరోగ్యకరంగా ఉండటమే కీలకమని సమావేశంలో నిశ్చయించారు. కరోనా వైరస్ నూతన కేసులు, కట్టడికి తీసుకున్న చర్యలు ఫలప్రదమైతే మరో 2-3 వారాల్లోనే బీసీసీఐ, ఐపీఎల్ ప్రాంఛైజీలు మరోసారి సమావేశం అయ్యే అవకాశం కనిపిస్తోంది. 90 నిమిషాల పాటు సాగిన సమావేశానికి కోల్నత నైట్రైడర్స్ సహ యజమాని షారుక్ ఖాన్, ముంబయి ఇండియన్స్ యజమాని ఆకాశ్ అంబాని, కింగ్స్ ఎలెవన్ సహ యజమాని నెస్ వాడియా, ఢిల్లీ క్యాపిటల్స్ సహ యజమాని పార్థ్ జిందాల్లు సైతం హాజరయ్యారు.
రద్దు అయినా, బాధలేదు! : బీసీసీఐ ఉన్నతాధికారులతో సమావేశం ముగిసిన అనంతరం కింగ్స్ ఎలెవన్ పంజాబ్ సహ యజమాని నెస్ వాడియా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఐపీఎల్ నిర్వహణపై బీసీసీఐ, ప్రాంఛైజీలు డబ్బు మోజులో ముందుకు వెళ్తున్నాయనే ఆరోపణలను వాడియా ఖండించారు. ' ప్రస్తుత పరిస్థితుల్లో సాధ్యాసాధ్యాలపై సమావేశం చర్చించింది. మొదటిది, ప్రధానంగా అందరూ అర్ధం చేసుకోవాల్సిన విషయం.. బీసీసీఐ, ప్రాంఛైజీలు, స్టార్ ఇండియాలు ఐపీఎల్ ద్వారా ఆర్థిక లబ్ది పొందాలనే ఆలోచనలో లేవు. ఇటువంటి సమయంలో ఒక్క రూపాయి గురించి ఆలోచన చేసినా, తప్పే అని సమావేశంలో అందరూ అభిప్రాయపడ్డారు. పరిస్థితులను పూర్తిగా అర్థం చేసుకోకుండా ఈ సమయంలో ఐపీఎల్ నిర్వహణపై ఎవరికీ ఆసక్తి లేదు. డబ్బు గురించి ఆలోచనే లేదు. అన్నింటికి కంటే ప్రధానమైనది ప్రజారోగ్యం. రెండోది, కరోనా వైరస్ విషయంలో ప్రభుత్వం చేసిన సూచనలను తూచా తప్పకుండా పాటిస్తాం. మూడోది, ప్రస్తుత పరిస్థితుల్లో ఐపీఎల్13ను ఎప్పుడు నిర్వహిస్తారో ఎవరూ చెప్పలేని స్థితి. రానున్న 3-4 వారాల్లో పరిస్థితిని సమీక్షిస్తాం. అప్పటికి కరోనా వైరస్ నూతన కేసులు తగ్గుముఖం పడితే, మిగతా విషయాలు ఆలోచిస్తాం. ప్రజారోగ్యానికి ప్రమాదం లేదని స్పష్టమైనప్పుడే, ఐపీఎల్పై ముందడుగు పడుతుంది. ప్రజారోగ్యం కంటే పైసలు ముఖ్యం కాదు' అని నెస్ వాడియా అన్నాడు. అసలు ఈ ఏడాది ఐపీఎల్ రద్దు అయినా, అందుకూ మానసికంగా సన్నద్ధమైనట్టు వాడియా సూచనప్రాయంగా వెల్లడించాడు. ' ఐపీఎల్పై అందరం పట్టుదలగా ఉన్నాం. ఐపీఎల్ జరగాలనే అందరం కోరుకుంటున్నాం. అందుకు కరోనా వైరస్పై పోరాట పురోగతి ఆధారపడి ఉంది. పరిస్థితుల్లో మార్పు కోసం వేచి చూడటమే ప్రస్తుత తక్షణ కర్తవ్యం' అని పార్థ్ జిందాల్ అన్నారు.
కరోనా వైరస్ ఇప్పటికే 100కు పైగా దేశాలకు వ్యాపించింది. ప్రపంచవ్యాప్తంగా 5000కు పైచిలుకు ప్రజల ప్రాణాలను బలి తీసుకుంది. కరోనా వైరస్ పంజా విసురుతున్న వేళ అంతర్జాతీయ, దేశవాళి టోర్నీలు వాయిదా పడుతున్నాయి. ఐపీఎల్ 13ను ఏప్రిల్ 15కు వాయిదా వేసిన గంటల్లోనే భారత్, దక్షిణాఫ్రికా వన్డే సిరీస్ను రద్దు చేశారు. నూతన షెడ్యూల్ను తర్వాత వెల్లడిస్తామని బీసీసీఐ, సీఏలు ప్రకటించాయి. ప్రేక్షకులు లేకుండా, ఖాళీ స్టేడియంలో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్లో తొలి వన్డేలో తలపడ్డాయి. విదేశీ రాకపోకలపై న్యూజిలాండ్ ప్రభుత్వం కఠిన ఆంక్షలు విధించిన నేపథ్యంలో వన్డే సిరీస్, టీ20 సిరీస్ రద్దు అయ్యాయి.