Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-క్రీడా రంగాన్ని కుదిపేసిన విపత్తులు
-కరోనాకు కంగుతిన్న ప్రపంచ క్రికెట్
-ఖాళీ స్టేడియాల్లో జరుగుతున్న మ్యాచులు
నవతెలంగాణ క్రీడా విభాగం
కరోనా వైరస్ (కోవిడ్-19) వరల్డ్ను వణికిస్తోంది. యూరోప్లో అతి వేగంగా వ్యాపిస్తోన్న కరోనా వైరస్ను కట్టడి చేసే మార్గం ఇంకా కనుగొనాల్సి ఉంది. రోజురోజుకూ కరోనా వైరస్ బాధితుల జాబితా పెరుగుతోంది. కరోనా వైరస్ కారణంగా బాధింపబడుతున్న జాబితాలో క్రీడా రంగం చేరిపోయింది. ఇంగ్లాండ్, ఇటలీ, గ్రీస్, ఫ్రాన్స్ సహా అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్లు మెగా స్పోర్ట్స్ ఈవెంట్లను వాయిదా వేసుకున్నాయి. నవీన కాలంలో ఈ స్థాయిలో ఇండ్లూ వాకిలికి గేట్లు వేసి ప్రజలను ఇంటికే పరిమితం చేసిన సంఘటనలు ఇప్పుడే చూస్తున్నాం. క్రీడా రంగం కుదుపును సైతం గత యాభై ఏండ్లలో చూడటం ఇదే ప్రథమం.
కరోనా వైరస్ దెబ్బకు ఒక్కో క్రీడా టోర్నీల రెక్కలు రాలిపోతున్నాయి. ఇంగ్లాండ్లో ప్రీమియర్ లీగ్, ఇటలీలో ఫుట్బాల్, అమెరికాలో బేస్బాల్, బాస్కెట్బాల్ టోర్నీలను రద్దు చేశారు. ఈ ఏడాది సీజన్ షెడ్యూల్ను తర్వాత ప్రకటి స్తారా? అసలు సీజన్ సాధ్యపడుతుందా? అనే ప్రశ్నలకు ఎవరి వద్దా సమాధానం లేదు. అందరి నోటా ఒకటే మాట.. ప్రజారోగ్యం ప్రధానం. కరోనా వైరస్ బాధిత క్రీడా ఈవెంట్ల జాబితాలో క్రికెట్ సైతం చేరిపోయింది. కరోనా వైరస్కు బలై అత్యధిక మూల్యం చెల్లిస్తోన్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) పరిస్థితి సైతం ఇప్పటికిప్పుడు ఏమీ చెప్పలేం. తొలుత ప్రేక్షకులు లేకుండా ఖాళీ స్టేడియాల్లో ఐపీఎల్ ఆడించాలనే ఆలోచన వచ్చినా.. ఆర్థికాంశాలు తెరపైకి రావటంతో ఆ ఆలోచన కార్యరూపం దాల్చలేదు.
అప్పుడు యుద్ధ భీతి
మెగా క్రికెట్ మ్యాచులను రద్దు, వాయిదా వేయటం అత్యంత అరుదైన విషయం. కరోనా వైరస్ కారణంగా క్రికెట్ మ్యాచుల రద్దు చూస్తున్నాం. కానీ గతంలోనూ రెండు పర్యాయాలు క్రికెట్కు ఇదే స్థాయిలో అంతరాయం ఏర్పడింది. ఆ రెండు సందర్భాలు చీకటి రోజుల్లో చోటుచేసుకున్నాయి. మొదటి ప్రపంచ యుద్ధం, రెండో ప్రపంచ యుద్ధ సమయంలో క్రికెట్ మ్యాచులకు ఈ స్థాయిలో అంతరాయం ఏర్పడింది. 1914 ఆరంభంలో మొదటి ప్రపంచ యుద్ధం కారణంగా క్రికెట్ మ్యాచులను రద్దు చేశారు. తిరిగి 1920 ఆఖర్లో క్రికెట్ మ్యాచులు ఆడటం మొదలైంది. రెండో ప్రపంచ యుద్ధం సమయంలో ఈ విరామ సమయం కాస్త ఎక్కువ. 1939 ఆగస్టు నుంచి 1946 మార్చి వరకు క్రికెట్ మ్యాచులు జరుగలేదు.
ఈ రెండు ప్రపంచ యుద్ధ కాలాల్లో క్రికెట్లో ప్రధానంగా రెండు ఫస్ట్ క్లాస్ క్రికెట్ టోర్నీలు నష్టపోయాయి. ఇంగ్లాండ్లో కౌంటీ క్రికెట్, ఆస్ట్రేలియాలో షెఫల్ట్ షీల్డ్ ట్రోఫీ. ఈ రెండు ఫస్ట్ క్లాస్ క్రికెట్ మ్యాచులు యుద్ధాల కారణంగా రద్దు చేయబడ్డాయి. యుద్ధ సమయంలోనూ, స్నేహపూర్వక వాతావరణం కొరవడిన తరుణంలోనూ కొన్ని మ్యాచులు జరిగాయి. 1944 లార్డ్స్లో ఇంగ్లాండ్ కౌంటీ క్లబ్ మిడిలెక్స్ ఓపెనింగ్ బ్యాట్స్మన్ జాక్ రాబర్ట్సన్ బ్యాటింగ్ చేస్తున్నాడు. ఆ సమయంలో వైమానిక దాడుల సైరన్ మోగింది. మైదానంలో అందరూ నేలపై పడుకున్నారు. జర్మనీ బాంబు దాడుల సైరన్ ముగిసిన తర్వాత లార్డ్స్ మ్యాచ్ యథాలాపంగా జరిగింది. జాక్ రాబర్ట్సన్ సహజ రీతిలో తర్వాతి బంతినే సిక్సర్గా బౌండరీ లైన్ దాటించాడు.
ఆస్ట్రేలియా, న్యూజిలాండ్లు తొలి వన్డేను ప్రేక్షకులు లేకుండా, ఖాళీ స్టేడియంలో ఆడారు. ఈ మ్యాచ్లో అర్థ సెంచరీ చేసిన డెవిడ్ వార్నర్ ప్రేక్షకులు లేకపోవటంతో ఎటువంటి సంబరాలు చేసుకోలేదు. ఇటీవల కాలంలో ప్రేక్షకుల మద్దతు లేకుండా ఓ క్రికెట్ మ్యాచ్ను చూడటం ఇదే ప్రథమం. క్రికెట్ మ్యాచ్ను రక్తి కట్టించేందుకు స్టేడియం నిండా అభిమానులే ఉండనక్కర్లేదు, ఇరు జట్లను రసవత్తర సమరంలో ముంచేయగల పోటీతత్వం ఉంటే చాలు అనే వారు లేకపోలేదు.
ఇప్పుడు కరోనా పంజా
2019 ఆఖర్లో మొదలైన కరోనా వైరస్ 2020 ప్రథమార్థంలో పంజా విసరటం మొదలెట్టింది. చైనాలోని వుహాన్ నగరంలో కరోనా వైరస్ తొలి కేసు వెలుగుచూసినట్టు ప్రాథమిక సమాచారం. దీనిపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. 2019 అక్టోబర్లో వుహాన్లో సైనిక క్రీడలు జరిగాయి. అమెరికా సహా ఎన్నో దేశాల సైనికులు ఈ క్రీడల్లో పాల్గొన్నారు. అమెరికా సైనికులే వుహాన్లో కరోనా వైరస్ను వదిలేసి వెళ్లారనే ఆరోపణలు సైతం వినిపిస్తున్నాయి. ఈ విషయాలను పక్కనపెడితే కరోనా వైరస్ నెమ్మదిగా భారత్నూ భయపెడుతోంది. ఢిల్లీ, ముంబయి, బెంగళూర్, హైదరాబాద్ నగరాల్లో ఇప్పటికే కరోనా వైరస్ కేసులు వెలుగుచూశాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. ఇందులో భాగంగా స్కూళ్లు, షాపింగ్ మాల్స్, సినిమా థియేటర్లు, బహిరంగ సమావేశాలు, సామూహిక విందులపై కఠిన ఆంక్షలు విధిస్తున్నాయి. ప్రస్తుతానికి భారత్లో కరోనా వైరస్ను చూసే భయపడే పరిస్థితి లేదు. అయినా, ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా నివారణకు నిర్మాణాత్మక అడుగులు పడుతున్నాయి. వేలాది మంది క్రీడాభిమానులు స్టేడియానికి వచ్చి వీక్షించే ఐపీఎల్ మ్యాచులు ప్రస్తుత పరిస్థితుల్లో సురక్షితం కాదని కేంద్ర కుటుంబ ఆరోగ్య, క్రీడా మంత్రిత్వ శాఖలు సూచించాయి. ఐపీఎల్ సహా భారత్, దక్షిణాఫ్రికా వన్డే సిరీస్ సైతం ప్రస్తుతానికి రద్దుగా ముగిసిన సంగతి తెలిసిందే.