Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కరోనాతో బోసిపోతున్న స్టేడియాలు
కోవిడ్-19 క్రీడాంశాలనూ మింగేస్తోంది. 140కు పైగా దేశాల్లో కరోనా ప్రభావం ఉండడం.. ఆరు వేలమందికి పైగా ఈ వైరస్ కారణంగా మరణించడంతోపాటు, సుమారు లక్షా డెబ్బైవేలమంది ఈ వైరస్ కారణంగా బాధపడడంతో డబ్ల్యూహెచ్ఓ సైతం దీనిపై స్పందించింది. వైరస్ వ్యాప్తిని అరికట్టడంలో భాగంగా జనాలు గుమిగూడడం మంచిది కాదని మన ప్రభుత్వాలు ఆదేశాలు కూడా జారీచేసేశాయి. జాతీయ టోర్నీలను సైతం రద్దుచేస్తూ రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశాలు కూడా జారీచేశాయి.
(నవతెలంగాణ - క్రీడాప్రతినిధి)
కరోనా వైరస్ విజృంభిస్తుండటంతో మైదానాలన్నీ ఖాళీగా కనిపిస్తున్నాయి. క్రికెట్, ఫుట్బాల్ వంటి పోటీలు జరుగుతున్నాయంటే కుర్చీలు దొరక్క పాకులాడే ప్రేక్షకులు ప్రస్తుతం కుర్చీల్లో కూర్చోడానికే భయమేసే పరిస్థితి ఏర్పడింది. ప్రేక్షకులతో కళకళలాడే మైదానాలు ప్రస్తుతం కళావిహీనంగా తయారయ్యాయి. అంతర్జాతీయ టోర్నీలన్నీ పూర్తీగా రద్దు కాగా... భారత్లో జరిగే అన్ని టోర్నీలనూ రద్దు మన క్రీడా సంఘం ఆదేశాలు జారీచేసేశాయి. దేశవాళీ టోర్నీలనూ రద్దుచేస్తూ భారత ప్రభుత్వం ప్రకటించింది.
ఇటీవలి ముగిసిన ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ, పాకిస్తాన్ ప్రిమియర్ లీగ్(పిఎస్ఎల్) మినహా మరెక్కడా క్రీడాంశాలు జరగడం లేదు. ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ లీగ్, పీఎస్ఎల్లో కేవలం ప్రేక్షకులు లేకుండానే జరుగుతున్నాయి. అంతర్జాతీయ ఫుట్బాల్ సమాఖ్య(ఫిఫా) సైతం నెలన్నర పాటు అన్నిరకాల ఫుట్బాల్ పోటీలను రద్దుచేస్తూ ఆదేశాలు జారీచేసేసింది.
వేసవి క్రీడలపై సందిగ్ధం..
జపాన్ రాజధాని టోక్యోలో జులైలో జరగాల్సిన ఒలింపిక్స్పై ఇప్పటివరకూ ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఈ పోటీలపై రోజుకొక ప్రకటన వెలువడుతున్నా... వాయిదా వేస్తామనిగానీ, నిర్వహించి తీరుతామనిగాని ఐఓసీ ఇప్పటివరకూ స్పష్టమైన హామీ ఏమీ ఇవ్వలేదు. ఒలింపిక్స్ అర్హత టోర్నీలు సైతం వాయిదా పడుతుండడంతో ఆటగాళ్లలో కొంత నైరాశ్యం నెలకొంది. ఒలింపిక్స్కు నాలుగు నెలల సమయం ఉన్నందున త్వరలోనే ఈ క్రీడలపై స్పష్టమైన ప్రకటన వెలువడే అవకాశముంది.
ఐపీఎల్ వాయిదాతో నిరాశ..
దేశవ్యాప్తంగా ఇప్పటికే ఐపీఎల్ హంగామా మొదలవ్వాల్సిన చోట.. అసలు లీగ్ జరుగుతుందా? లేదా? అనే చర్చ ఇప్పుడు క్రీడాభిమానుల్లో నెలకొంది. బీసీసీఐ, ఐపీఎల్ పాలక మండలి సమావేశంలోనూ ఎలాంటి స్పష్టమైన హామీ ఇవ్వకపోయినా.. ఏప్రిల్ 15 వరకూ వాయిదా వేస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు. ఈలోపు ఆటగాళ్లందరినీ శిక్షణా శిబిరాలనుంచి స్వదేశాలకు పంపించి వేసి ఆదేశాలు వచ్చేవరకూ తిరిగి రావొద్దంటూ ఆయా ఫ్రాంచేజీలు ఆటగాళ్లకు ఆదేశాలూ జారీచేసేశాయి. అసలు ఐపీఎల్-13 ఈ ఏడాది జరుగుతుందా? మినీ ఐపిఎల్ జరుగుతుందా? వాయిదా వేస్తారా? అనే విషయంపై కూడా త్వరలో బీసీసీఐ నిర్ణయం తీసుకోనుంది.