Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జులై-సెప్టెంబర్లో టోర్నీ నిర్వహణకే మొగ్గు
ముంబయి: ఏప్రిల్-15కు వాయిదాపడిన ఇండియన్ ప్రిమియర్లీగ్(ఐపీఎల్) కూడా సజావుగా సాగేలా కనబడడం లేదు. ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా కష్టాలు ఎలాగుంటాయో ఎవ్వరూ చెప్పలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో ఏప్రిల్లోనైనా ఐపీఎల్ జరుగుతుందా? జరిగితే మొత్తమా? కుదించాలా? విదేశీ ఆటగాళ్లు ఉంటారా? ఉండరా? భారత్లోనా? లేక మరే దేశంలోనైనా? అనే సందేహాలు ఐపీఎల్ అభిమానుల్లో కనబడుతోంది. ఈ నేపథ్యంలోనే జులై-సెప్టెంబర్ మధ్యలో నిర్వహిస్తే ఎలా ఉంటుందని బీసీసీఐ యోచిస్తోందని తాజా సమాచారం. ఐసీసీ భవిష్య పర్యటన ప్రణాళిక(ఎఫ్టీపీ) ప్రకారం సెప్టెంబర్లో ఆసియా కప్ ఉంది. అదే సమయంలో ఇంగ్లండ్లో పాకిస్తాన్ పర్యటించనుంది. జూన్, జులైలో ఇంగ్లండ్ 100 బంతుల టోర్నీని ఆరంభించాల్సి ఉంది. ఇంగ్లండ్, పాక్ను పక్కన పెట్టినా ఆస్ట్రేలియా, వెస్టిండీస్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్ జట్లకు ప్రత్యేకమైన, ముందుగా నిర్ణయించిన పెద్ద సిరీస్లేమీ లేవు. ఆసియా కప్ను మినహాయిస్తే టీ20 ప్రపంచకప్ వరకు ఆస్ట్రేలియా, శ్రీలంకతో భారత్ తలపడనుంది. ఇవన్నీ పరిగణనలోకి తీసుకొని జులై-సెప్టెంబర్ మధ్య కాలంలో ఐపీఎల్ కుదురుతుందో లేదో బీసీసీఐ, ఫ్రాంచైజీలు కలిసి సమాలోచనలు చేస్తున్నాయన్నది తాజా కబురు.
ఐపీఎల్లో కంగారు టీమ్ అనుమానమే..
ఆస్ట్రేలియాకు చెందిన 17 మంది ఆటగాళ్లు ఐపీఎల్లో ఆడే విషయంలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం కరోనా నేపథ్యంలో ఇక్కడి ప్రభుత్వం కంగారు టీమ్కు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ పరిస్థితుల్లో భారత్ పర్యటనకు వెళ్లటం తగదనీ, ప్రభుత్వం బాధ్యత వహించదనీ, ఏదైనా జరిగితే మీదే బాధ్యత అంటూ ఆటగాళ్లకు కరాఖండిగా చెప్పేసింది. తమ దేశ పౌరులకు కోవిడ్-19 ప్రబలకుండా చూసుకోవడం తమ బాధ్యతని, అందువల్ల విదేశీ పర్యటనలకు వెళ్లే వారిపై స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేశామని ఆస్ట్రేలియా దేశ ప్రధాని స్కాట్ మారిసన్ తెలిపారు. ఈ మార్గదర్శకాలు వచ్చే నెలలోనూ అమల్లో ఉంటాయని వెల్లడించారు. ఈ నేపథ్యంలో 17 మంది ఆస్ట్రేలియా ఆటగాళ్లు ఐపీఎల్లో పాల్గొనడం అనుమానమేనని నిర్వాహకులు భావిస్తున్నారు. అంతకు ముందు క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) ఆ దేశ ఆటగాళ్లు ఐపీఎల్లో ఆడటానికి నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్ (ఎన్ఓసీ) జారీ చేసింది. అయితే, తాజా పరిస్థితుల నేపథ్యంలో విదేశీ ప్రయాణాలపై ప్రభుత్వం తీసుకున్న ఆంక్షలకు అడ్వైజరీ కమిటీ కూడా సంఘీభావం తెలిపింది. ఒకవేళ తమ ఆటగాళ్లు ఐపీఎల్లో ఆడాలనుకుంటే..ఆడొచ్చు.. కానీ ఏమైనా జరిగితే తమ బాధ్యత కాదనీ, బీమా సదుపాయం కలుగుతుందని ప్రభుత్వం పేర్కొంది.
స్వదేశానికి వెళ్లిన సఫారీల స్వీయ నిర్బంధం
భారత్ నుంచి స్వదేశానికి వచ్చిన దక్షిణాఫ్రికా క్రికెటర్లు స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. కరోనా వైరస్ (కోవిడ్-19) వ్యాప్తి చెందటంతో భారత్, దక్షిణాఫ్రికా వన్డే సిరీస్ను తాత్కాలికంగా రద్దు చేసిన విషయం విదితమే. తమ దేశానికి చేరుకున్న ఆటగాళ్లు14 రోజుల పాటు స్వీయ నిర్బంధంలో ఉంటారని ఆ జట్టు ప్రధాన వైద్యాధికారి డాక్టర్ షుయబ్ మంజ్రా తెలిపారు.
''ఇతరులకు దూరంగా 14 రోజులు స్వీయ నిర్బంధంలో ఉండాలి. కుటుంబాన్ని.. బంధువులను, ఇతరులను రక్షించుకోవటానికి ఇదే సరైన మార్గం. ఆ సమయంలో ఆటగాళ్లకు కరోనా లక్షణాలుంటే గుర్తించొచ్చు. ప్రయాణంలో కొందరు ఆటగాళ్లే మాస్క్ పెట్టుకున్నారు. అయినా, ప్రయాణాల్లో చాలా జాగ్రత్తలు తీసుకున్నాం. పర్యటన ముగిసినా వైద్యులు వారితో అందుబాటులో ఉంటారు'' అని మంజ్రా చెప్పారు.