Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-టోక్యో తరఫున జ్యోతిని అందుకున్న నోకో ఇమోటో ొకరోనా -దెబ్బకు..స్టేడియంలో ప్రేక్షకుల్లేకుండా ప్రారంభం
ఏథెన్స్: టోక్యో-2020 ఒలింపిక్స్ నిర్వాహకులు జ్యోతిని అందుకున్నారు. గ్రీక్ రాజధాని ఏథెన్స్లో ఈ టార్చ్ను టోక్యో నిర్వహణ కమిటీ తరఫున ఆ దేశ మాజీ మహిళా స్విమ్మర్ నోకో ఇమోటో అందుకున్నారు. గురువారం జరిగిన ఈ కార్యక్రమానికి స్టేడియంలో ప్రేక్షకులెవరికీ అనుమతి లేదు. తొలిసారి ఒలింపిక్ క్రీడలు 1896లో ఏథెన్స్లో ప్రారంభమయ్యాయి. ఏథెన్స్లోని పానాథెనిక్ స్టేడియంలో ఈ టార్చ్ను ఆమె సాంప్రదాయ రీతిలో అందుకున్నారు. టోక్యో ఒలింపిక్స్ నిర్వహణ కమిటి తరఫున చివరి నిమిషంలో ఇమోటోకు బాధ్యతలు అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. టోక్యో ఒలింపిక్స్ను యథాతథంగానే జరుపుతామని అంతర్జాతీయ ఒలింపిక్ సమాఖ్య(ఐఓసీ) ఇప్పటికే స్పష్టం చేసింది. ఈ టార్చ్ శుక్రవారం బయల్దేరి మార్చి 26కు జపాన్ చేరుకున్న అనంతరం అధికారికంగా ఒలింపిక్స్ను ప్రారంభించనున్నారు.
కోవిడ్-19 కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకూ 2 లక్షలకు పైగా ప్రజలు వైరస్తో బాధపడుతుండగా... 8,700మంది వరకూ మరణించారు. ఈ నేపథ్యంలో ఒలింపిక్ క్రీడలపై అథ్లెట్లు సైతం ఒలింపిక్స్ వాయిదా వేయాలని కోరుతున్నా.. జరిపి తీరుతామని ఐఓసీ ఇప్పటికే తెలిపింది. గ్రీస్ ఒలింపిక్ కమిటీ చీఫ్ సైరస్ కాప్రలాస్ ఒలింపిక్ జ్యోతిని ఇమోటోకు అందించారు. 50వేల సీట్ల సామర్ధ్యమున్న మైదానంలో ప్రేక్షకులు ఎవరూ లేకుండానే ఈ కార్యక్రమం జరిగింది. సెంట్రల్ ఏథెన్స్ స్టేడియంలో జరిగిన ఈ కార్యక్రమానికి కొద్దిమంది అధికారులకు మాత్రమే ప్రవేశం కల్పించారు. టోక్యో క్రీడల చీఫ్ యషిరో మోరీ వీడియో మెసేజ్లో ఈ కార్యక్రమానికి వీక్షించారు. ఈ జ్యోతిని ప్రత్యేక విమానంలో జపాన్కు శుక్రవారం చేర్చనున్నారు. ఇప్పటివరకు కేవలం 57 శాతం మంది అథ్లెట్లు మాత్రమే ఒలింపిక్స్కు అర్హత సాధించగా.. కరోనా నేపథ్యంలో అనేక అర్హత ఈవెంట్లు వాయిదా పడ్డాయి. స్విమ్మింగ్, జిమ్మాస్టిక్స్లో ఒకే వస్తువును అందరూ తాకుతారని, అది ఇంకా ప్రమాదకరమని అథ్లెట్లు తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. వీలైనంత అత్యుత్తమంగా సాధన చేయాలంటూ ఐఓసీ... అథ్లెట్లకు చెప్పడాన్ని ప్రపంచ హెఫ్టాథ్లాన్ ఛాంపియన్ జాన్సన్ థాంప్సన్ కూడా తప్పు పట్టింది.
ఇమోటోకు అరుదైన గౌరవం
జపాన్ తరఫున ఒలింపిక్ జ్యోతిని అందుకునే వ్యక్తి కోసం అన్వేషించింది. కరోనా వైరస్ ప్రభావం కారణంగా యురప్ నుంచి బయటకు, లోపలకు వెళ్లడానికి అనుమతి లేని సంగతి తెలిసిందే. దీంతో గ్రీస్లోనే ఉంటున్న ఇమోటో(43)ను జపాన్ ఎంపిక చేసింది. టార్చ్ అందుకోనున్న ఇమోటో జపాన్ తరఫున 1996 అట్లాంటా ఒలింపిక్స్లో 800మీ. స్విమ్మింగ్ పోటీలో ప్రాతినిధ్యం వహించారు. ప్రస్తుతం గ్రీస్లోనే యూనిసెఫ్లో ఇమోటో పనిచేస్తున్నారు. దీంతో ఆమెను ఎంపిక చేశారు. ఒలింపిక్ టార్చ్ను అందుకున్న ఇమోటో గ్రీస్లో ఉంటారు. టార్చ్ను మాత్రం ప్రత్యేక విమానంలో జపాన్ పంపిస్తారు.
ఒలింపిక్స్పై పోల్వాల్టర్ కేథరినా అసంతృప్తి
టోక్యో ఒలింపిక్స్ షెడ్యూలు ప్రకారం జరుగుతాయని నిర్వాహకులు ప్రకటించడంతో ఒలింపిక్ పోల్వాల్ట్ ఛాంపియన్ కేథరినా స్టెఫాండి అసంతృప్తిని వ్యక్తం చేశారు. షెడ్యూలు ప్రకారం జులై 24న టోక్యో ఒలింపిక్స్ను ఆరంభించడానికి తాము కట్టుబడి ఉన్నామన్న అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం(ఐఓసీ), వీలైనంతగా సాధన చేయాలని అథ్లెట్లను కోరిన నేపథ్యంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేసింది. ''ప్రతి రోజూ సాధన చేయడానికి.. మా ఆరోగ్యాన్ని, మా కుటుంబ ఆరోగ్యాన్ని, ప్రజల ఆరోగ్యాన్ని మేం ఫణంగా పెట్టాలని ఐఓసి కోరుకుంటోంది. నాలుగు నెలల తర్వాత కాదు.. ఐఒసి ఇప్పుడే మమ్మల్ని ప్రమాదంలో నెడుతోంది'' అని స్టెఫాండి పేర్కొంది.