Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-మేజర్ టోర్నీలపై తీవ్ర ప్రభావం
-సందిగ్థంలో టీ20 ప్రపంచకప్
నవతెలంగాణ క్రీడా విభాగం
కరోనా వైరస్ మహమ్మారి క్రీడా రంగంపై నిర్దాక్షిణ్య పంజా విసిరింది. వేగంగా ప్రబలుతున్న కరోనా వైరస్ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా స్పోర్ట్స్ ఈవెంట్లు వాయిదా పడుతున్నాయి. కొన్ని టోర్నీలు రద్దు అవుతున్నాయి. రెండో ప్రపంచయుద్ధం తర్వాత తొలిసారి క్రికెట్కు విరామం వచ్చింది. సంవత్సరం పొడవునా కొనసాగే క్రికెట్ మ్యాచులు ఇప్పుడు కరోనా దెబ్బకు వాయిదా పడక తప్పటం లేదు. కరోనా వైరస్ ప్రభావం మరిన్ని మాసాల పాటు కొనసాగే ప్రమాదం కనిపిస్తోంది. ఈ పరిస్థితుల్లో క్రికెట్ మేజర్ టోర్నీలపై కరోనా ప్రభావం ఏ విధంగా ఉండనుందో చూద్దాం.
తొలిసారి ఏథెన్స్ సెంట్రల్ స్టేడియం అభిమానులు లేకుండా బోసిపోయింది. అభిమానుల సందడి ఏమాత్రం కనిపించకుండా ఒలింపిక్ జ్యోతి అందజేత కార్యక్రమం ముగిసింది. 2020 టోక్యో ఒలింపిక్స్ వాయిదా పడేందుకు కచ్చితమైన సంకేతాలు ఇప్పటికే కనిపిస్తున్నాయి. బ్యాడ్మింటన్, ఆర్చరీ, అథ్లెటిక్స్, బాస్కెట్బాల్, ఫుట్బాల్, ఫీల్డ్ హాకీ, షుటింగ్, రగ్బీ సహా ఇతర క్రీడలకూ కరోనా దెబ్బ తగిలింది. ప్రపంచ వ్యాప్తంగా క్రీడా ఈవెంట్లు వాయిదా పడ్డాయి. 2020 టోక్యో ఒలింపిక్స్ అర్హత టోర్నీలు సైతం జరిగే పరిస్థితి లేదు. క్రికెట్పైనా కరోనా ప్రభావం గట్టిగానే ఉంది. విరామం లేని క్రికెట్ ఆడే అంతర్జాతీయ స్టార్ క్రికెటర్లకు ఇప్పుడు కోరుకోని పరిస్థితుల్లో తగినంత విశ్రాంతి లభిస్తోంది. కరోనా ప్రభావంతో ద్వైపాక్షిక సిరీస్లు, లీగ్లకు నిలిచిపోయినా ఆర్థికంగా తప్పితే ఇతర ఇబ్బందులు ఏమీ ఉండవు. కానీ ఐసీసీ మెగా ఈవెంట్లకు అర్హత మ్యాచులు ఇప్పుడు వాయిదా పడుతున్నాయి. దీంతో 2019 అక్టోబర్లో జరగాల్సిన టీ20 వరల్డ్కప్, 2021 ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్షిష్స్, 2021 మహిళల వన్డే చాంపియన్షిప్స్ సహా ఇతర మెగా టోర్నీలపై కరోనా దీర్ఘకాలిక ప్రభావం చూపనుంది. ఆ వివరాలు ఓసారి పరిశీలిద్దాం..
ఇండియన్ ప్రీమియర్ లీగ్
పాల్గోనే జట్లు : 08
షెడ్యూల్ : ఏప్రిల్ 15 వరకు వాయిదా
ఐపీఎల్13 షెడ్యూల్ ప్రకారం మార్చి 29న ఆరంభం కావాలి. సామూహిక కార్యక్రమాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిషేధాజ్ఞలు విధించాయి. దీంతో టోర్నీ ఆరంభాన్ని ఏప్రిల్ 15 వరకు వాయిదా వేశారు. 2008లో మొదలైన ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రపంచంలో అత్యంత పాపులర్ టీ20 లీగ్గా రూపొందింది. ఐపీఎల్లో పాల్గొనే క్రికెటర్లకు అనువుగా ఐసీసీ, ఇతర బోర్డులు సైతం షెడ్యూల్ను సర్దుబాటు చేసుకునే స్థాయికి ఐపీఎల్ చేరుకుంది. బీసీసీఐ ఐపీఎల్ను జూన్ మొదటి వారం వరకూ పొడగించే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ప్రాథమిక షెడ్యూల్లో మే 24న ఫైనల్స్ జరగాల్సి ఉంది. ప్రభుత్వం నుంచి అనుమతి లభిస్తే ఖాళీ స్టేడియాల్లోనైనా ఐపీఎల్2020 నిర్వహణకు బీసీసీఐ సిద్ధమవుతోంది.
కరోనా వైరస్ ప్రభావం మహిళల టీ20 చాలెంజ్ సిరీస్పైనా పడుతోంది. గత ఏడాది ఎగ్జిబిషన్ మ్యాచులుగా మహిళల టీ20 చాలెంజ్ మొదలైంది. ఈ సీజన్కు పాల్గొనే జట్ల సంఖ్య నాలుగుకు పెరిగింది. మహిళల ఐపీఎల్ దిశగా ఇది అతి పెద్ద అడుగు అనుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో మహిళల టీ20 చాలెంజ్పై ఇది ప్రతికూల ప్రభావం చూపనుంది. ఈ ఏడాది లీగ్లో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, వెస్టిండీస్ స్టార్ క్రికెటర్లు పాల్గొనాల్సి ఉంది.
ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్షిప్
పాల్గొనే జట్టు : 09
షెడ్యూల్ : జులై 2019-జూన్ 2021
2019 వన్డే వరల్డ్కప్ ముగిసిన వెంటనే ఐసీసీ టెస్టు చాంపియన్షిప్ సమర శంఖం మోగింది. టాప్-9 ఐసీసీ టెస్టు దేశాలు ఇందులో పాల్గొంటున్నాయి. టెస్టు చాంపియన్షిప్ను ఐసీసీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. ప్రతి జట్టు సిరీస్కు గరిష్టంగా 120 పాయింట్లతో, ఆరు సిరీస్లు ఆడాలి. మూడు ఇంటా, మూడు బయట ఆడాలి. కొన్ని జట్లు మెజార్టీ సిరీస్లు ఆడేయగా, మరికొన్ని జట్లు ఇప్పుడిప్పుడే సిరీస్లు ఆడేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. ఈ ఏడాది ద్వితియార్థంలో టెస్టు చాంపియన్షిప్ సిరీస్లు ఏకధాటిగా జరగాల్సి ఉంది. ఇప్పుడు వాటిపై ప్రభావం పడే అవకాశం ఉంది. ఈ ఏడాది మార్చిలో శ్రీలంక, ఇంగ్లాండ్లు రెండు టెస్టులు ఆడాలి. జూన్లో ఇంగ్లాండ్, వెస్టిండీస్లు మూడు టెస్టులు. జులై-ఆగస్టులో ఇంగ్లాండ్, పాకిస్థాన్లు మూడు టెస్టులు ఆడాల్సి ఉంది. జులైలో వెస్టిండీస్, దక్షిణాఫ్రికాలు రెండు టెస్టులు, బంగ్లాదేశ్తో శ్రీలంక మూడు టెస్టులు ఆడాల్సి ఉంది. ఆగస్టులో బంగ్లాదేశ్, న్యూజిలాండ్ రెండు టెస్టులు ఆడాలి. నవంబర్-డిసెంబర్లో న్యూజిలాండ్తో వెస్టిండీస్ మూడు టెస్టులు.. డిసెంబర్-జనవరి (2021)లో ఆస్ట్రేలియాతో భారత్ నాలుగు టెస్టుల సిరీస్ ఆడాల్సి ఉంది. డిసెంబర్-జనవరి (2021)లో న్యూజిలాండ్, పాకిస్థాన్లు సైతం రెండు టెస్టుల సిరీస్ ఆడాల్సి ఉంది. కరోనా ప్రభావం కొనసాగితే ఈ సిరీస్లపై గట్టి ప్రభావం పడనుంది. అంతిమంగా 2021 జూన్ లార్డ్స్ ఫైనల్ ఆలస్యమయ్యే ప్రమాదం ఉంది.
ఐసీసీ వన్డే లీగ్
పాల్గొనే జట్లు : 13
షెడ్యూల్ : మే 1 నుంచి ఆరంభం
ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్షిప్తో పాటే వన్డే లీగ్కూ ఐసీసీ పచ్చజెండా ఊపింది. మే 1, 2020 నుంచి మార్చి 31, 2022 వరకు వన్డే లీగ్ షెడ్యూల్ చేశారు. 2023 వన్డే వరల్డ్కప్కు వన్డే లీగ్ అర్హత లీగ్గా ఉండనుంది. ఇందులో 12 టెస్టు దేశాలు సహా నెదర్లాండ్స్ పాల్గొంటుంది. రెండేండ్ల కాలంలో ప్రతి జట్టు తొమ్మిది వన్డే సిరీస్లు ఆడాల్సి ఉంది. ఆతిథ్య భారత్ నేరుగా అర్హత సాధించనుండగా వన్డే లీగ్లో టాప్-7లో నిలిచిన జట్లు వరల్డ్కప్కు అర్హత సాధించనున్నాయి. రానున్న ఐసీసీ బోర్డు సమావేశాల్లో వన్డే లీగ్ నియమ నిబంధనలు రూపొందించాల్సి ఉంది. అర్హత సాధించలేని ఐదు జట్లకు మరో అవకాశం లభిస్తుంది.
ది హండ్రెడ్ లీగ్
పాల్గొనే జట్లు : 16 (8 మెన్స్, 8 మహిళలు)
షెడ్యూల్ : జులై 17, 2020-ఆగస్టు 15, 2020
120 బంతుల లీగ్లో ఐపీఎల్ పాపులర్ అయ్యింది. టీ20 ఫార్మాట్లో ఇతర లీగ్లు వచ్చినా ఐపీఎల్ చరీష్మా ముందు నిలిచే పరిస్థితి ఎంతమాత్రం లేదు. దీంతో ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు నూతన ఆలోచనతో ముందుకొచ్చింది. మూడు గంటల్లోనే ముగిసే 100 బంతుల లీగ్తో అభిమానులకు దగ్గరయ్యేందుకు రంగం సిద్ధం చేసుకుంది. ఆకర్షణీయ టికెట్ ధరలతో పాటు టెలివిజన్లో ఉచిత ప్రసారంతో ఈసీబీ మెగా ప్లాన్ వేసింది. 100 బంతుల లీగ్కు అభిమానుల నుంచి ఏ మేరకు స్పందన వస్తుందో ఆసక్తికరం. కరోనా వైరస్ ఇంగ్లాండ్లో పంజా విసరుతోంది. ఈ పరిస్థితుల్లో జులైలోనైనా ది హండ్రెడ్ లీగ్ జరిగే అవకాశాలు స్వల్పంగా కనిపిస్తున్నాయి.
ఆసియా కప్
పాల్గొనే జట్లు : 06
షెడ్యూల్ : సెప్టెంబర్ 2020
ఆసియా దేశాలు తలపడే ప్రతిష్టాత్మక టోర్నీ ఆసియా కప్. అఫ్గనిస్థాన్, బంగ్లాదేశ్, హాంగ్కాంగ్, భారత్, పాకిస్థాన్ సహా శ్రీలంక ఆసియా కప్లో పాల్గొంటున్నాయి. 2020 ఆసియా కప్ టీ20 ఫార్మాట్లో జరుగనుంది. టీ20 వరల్డ్కప్కు ముందు ఇది సన్నాహాక టోర్నీగా పనికొస్తుంది. 2020 ఆసియా కప్ ఆతిథ్య హక్కులు పాకిస్థాన్కు ఉన్నాయి. అయినా, ఆతిథ్య వేదికపై ఆసియా క్రికెట్ కౌన్సిల్ ఈ నెలాఖరులో నిర్ణయం తీసుకోనుంది. పాకిస్థాన్లో ఆసియా కప్ జరిగే అవకాశం లేదు. దుబారు, అబుదాబిలో కరోనా వైరస్ భయానక స్థాయిలో ఉంది. ఈ ఏడాది ఆసియా కప్ నిర్వహణపై అనుమానాలు ఎక్కువగా ఉన్నాయి.
మెన్స్ టీ20 వరల్డ్కప్
పాల్గొనే జట్లు : 16
షెడ్యూల్ : అక్టోబర్ 18-నవంబర్ 15, 2020
మహిళల ఐసీసీ టీ20 వరల్డ్కప్ను విజయవంతంగా నిర్వహించిన క్రికెట్ ఆస్ట్రేలియా.. అక్టోబర్లో మెన్స్ టీ20 వరల్డ్కప్ మెగా ఈవెంట్కు భారీ స్థాయిలో ఏర్పాట్లు చేసుకుంది. గత నవంబర్లో నెదర్లాండ్స్, న్యూ గునియా, ఐర్లాండ్, స్కాట్లాండ్, ఒమన్లు టీ20 వరల్డ్కప్ అర్హత టోర్నీ నుంచి ముందుకొచ్చాయి. ఈ ఆరు జట్లు శ్రీలంక, బంగ్లాదేశ్లతో టీ20 వరల్డ్కప్ క్వాలిఫయింగ్ దశలో తలపడనున్నాయి. ఎనిమిది జట్ల తొలి దశ టోర్నీ నుంచి నాలుగు జట్లు సూపర్12కు అర్హత సాధించనున్నాయి. టాప్-8 జట్లతో కూడిన సూపర్ 12, రెండు గ్రూపులుగా (6, 6) విడిపోయి ప్రధాన టోర్నీ జరుగనుంది. మహిళల టీ20 వరల్డ్కప్ మెల్బోర్న్ ఫైనల్స్కు 90000 మంది హాజరయ్యారు. మెల్బోర్న్ ఫైనల్స్కు హాజరైన ఓ అభిమానికి కరోనా వైరస్ పాజిటివ్గా తేలటం కలకలం సృష్టించింది. ఈ పరిస్థితుల్లో ఆస్ట్రేలియాలో సాధారణ స్థాయిలో అభిమానులు క్రికెట్ సమరం చూసేందుకు మైదానాలకు రావటం అనుమానంగా కనిపిస్తోంది. అక్టోబర్లోగా కరోనా వైరస్ కట్టడి అయితే, టీ20 వరల్డ్కప్ సాధ్యపడుతుంది.
ఐసీసీ మహిళల వన్డే చాంపియన్షిప్
పాల్గొనే జట్లు : 08
షెడ్యూల్ : 2017-2020
ఐసీసీ మహిళల వన్డే చాంపియన్షిప్ ప్రస్తుతం నడుస్తోంది. వన్డే చాంపియన్షిప్లో టాప్-4లో నిలిచిన జట్లు 2021 మహిళల వన్డే వరల్డ్కప్కు అర్హత సాధించనున్నాయి. ఫిబ్రవరి 6-మార్చి 7, 2021లో వన్డే వరల్డ్కప్ న్యూజిలాండ్లో జరుగనుంది. ఈ ఏడాది జులైలో శ్రీలంకలో జరుగనున్న ఐసీసీ వన్డే వరల్డ్కప్ క్వాలిఫయర్ నుంచి మూడు జట్లు నేరుగా వరల్డ్కప్కు అర్హత సాధించనున్నాయి. ఆస్ట్రేలియా, డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికాలు ఇప్పటికే వరల్డ్కప్ బెర్త్లు ఖాయం చేసుకున్నాయి. భారత్, పాకిస్థాన్, శ్రీలంక, వెస్టిండీస్లు వరల్డ్కప్ బెర్త్ రేసులో ఉన్నాయి. ప్రస్తుత పాయింట్ల ప్రకారం భారత్, పాకిస్థాన్లకు నేరుగా అర్హత సాధించే అవకాశం కనిపిస్తోంది. కరోనా ప్రభావంతో మార్చిలో జరగాల్సిన దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా సిరీస్.. న్యూజిలాండ్, ఆస్ట్రేలియా.. పాకిస్థాన్, భారత్ సిరీస్లు జరిగేది అనుమానంగా మారింది.