Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-పాక్ దిగ్గజం జావెద్ మియాందాద్
కరాచీ : పాకిస్థాన్ ప్రస్తుత, మాజీ క్రికెటర్ల నుంచి ఇటీవల కాలంలో భారత క్రికెటర్లకు పొగడ్తలు నిత్యకృత్యం అయ్యాయి!. షాహిద్ అఫ్రిది నుంచి షోయబ్ అక్తర్ ఇప్పుడు జావెద్ మియాందాద్లు భారత క్రికెటర్లను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. యూట్యూబ్ చానల్లో మాట్లాడిన పాకిస్థాన్ క్రికెట్ దిగ్గజం జావెద్ మియాందాద్ భారత స్టార్ క్రికెటర్, కెప్టెన్ విరాట్ కోహ్లిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారత క్రికెటర్లలో విరాట్ కోహ్లి తనకు అత్యంత ఇష్టమైన క్రికెటర్గా మియాందాద్ అన్నారు. ' భారత క్రికెటర్లలో నాకు ఎవరంటే ఇష్టమని చాలా మంది అడిగారు. నా సమాధానం విరాట్ కోహ్లి' అని జావెద్ మియాందాద్ అన్నారు. 'దీనిపై ఎక్కువగా మాట్లాడేందుకు ఏమీ లేదు. విరాట్ కోహ్లి ప్రదర్శనే ఆ విషయం చెబుతుంది. ప్రజలకు విరాట్ కోహ్లి గణాంకాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. విరాట్ కోహ్లి దక్షిణాఫ్రికాలో చాలా బాగా ఆడాడు. అనిశ్చితి వికెట్పై సెంచరీ కొట్టాడు. విరాట్ ఫాస్ట్ బౌలర్లను ఆడలేడని చెప్పలేం. బౌన్సీ వికెట్లపై నిలువలేడనీ అనలేం. స్పిన్నర్లపై ఆడలేడనీ చెప్పలేం. అందుకే విరాట్ కోహ్లి అంటే నాకిష్టం' అని మియాందాద్ చెప్పాడు. విరాట్ కోహ్లి క్లీన్ హిట్టర్. అతడి షాట్లను చూడండి, అతడు ఆడటం చూడటానికి బాగుంటుంది. విరాట్ కోహ్లి క్లాస్ ఆటగాడు అని మియాందాద్ చెప్పుకొచ్చాడు. రోహిత్ శర్మ కంటే కోహ్లి ఎందుకు ఇష్టమో విరాట్ గణాంకాలే చెబుతాయని జావెద్ వివరించాడు!.