Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-పరిశీలిస్తోన్న జపాన్, ఐఓసీ
-ఈ వారంలో ఒలింపిక్ కమిటీ కీలక భేటీ
నవతెలంగాణ క్రీడా విభాగం
కరోనా వైరస్ ఇప్పటికే క్రీడా రంగాన్ని గట్టిగా కాటేసింది. ప్రపంచ వ్యాప్తంగా అన్ని క్రీడా టోర్నీలు వాయిదా, రద్దు అయ్యాయి. వార్షిక టోర్నీలు, పాపులర్ లీగ్లు వాయిదా పడినా, రద్దుగా ముగిసినా పెద్దగా నష్టం ఉండదు. కానీ రూ. లక్షల కోట్లు వెచ్చించి 2020 టోక్యో ఒలింపిక్స్కు ఏర్పాట్లు చేసింది జపాన్. ఇప్పుడు ఒలింపిక్స్ రద్దుగా ముగిస్తే ఆర్థికంగా జపాన్పై అపార నష్టం వాటిల్లనుంది. అందుకే, 2020 టోక్యో ఒలింపిక్స్ను 2021లో నిర్వహించేందుకు నిర్వహణ కమిటీ ప్లాన్ బి సిద్ధం చేస్తున్నట్టు సమాచారం!
12 ఆతిథ్య నగరాలు, యూరోప్ అంతా కళ్లార్పకుండా చూసే యూరోకప్ 2020 వాయిదా పడింది. యూరోకప్ 2020 పేరుతోనే వచ్చే ఏడాది అదే సమయంలో నిర్వహించేందుకు నిర్వాహకులు షెడ్యూల్ ప్రకటించారు. యూరోకప్ దారిలోనే టోక్యో ఒలింపిక్స్ నడుస్తున్నట్టు తెలుస్తోంది. కరోనా వైరస్ వేగంగా ప్రబలుతున్న తరుణంలో ఈ ఏడాది అనుకున్న సమయానికి ఒలింపిక్స్ నిర్వహణ అసాధ్యంగా కనిపిస్తోంది. ఒలింపిక్స్ నిర్వహణపై జపాన్ పైకి గంభీర్యం ప్రదర్శిస్తున్నా, అంతర్గతంగా చెప్పలేనంత మథనపడుతోంది. అందుకే టోక్యో ఒలింపిక్స్ నిర్వహణ కమిటీ ప్లాన్ బి, సి, డిలను సిద్ధం చేసినట్టు విశ్వసనీయ సమాచారం!. కరోనా వైరస్ ప్రభావం తగ్గుముఖం పట్టేందుకు కనీసం 6-9 మాసాల సమమం పట్టే అవకాశం కనిపిస్తోంది. వైరస్ను కట్టడి చేసిన వెంటనే అథ్లెట్లు జపాన్కు రావటానికి సైతం మొగ్గుచూపే వీలు లేదు. ఈ నేపథ్యంలో 2021 ద్వితీయార్థంలో ఒలింపిక్స్ను నిర్వహించేందుకు జపాన్ ప్లాన్ బి సిద్ధం చేసిందని అక్కడి అధికారులు అంతర్గతంగా అనుకుంటున్నారు.
వాయిదాకు సిద్ధంగా లేదు..కానీ : 2020 ఒలింపిక్స్ వాయిదా వేసేందుకు జపాన్కు ఇసుమంతైనా ఇష్టం లేదు. ఒలింపిక్స్ నిర్వహణ కోసం జపాన్ ఇప్పటికే సుమరు రూ. 9 లక్షల కోట్ల మేరకు వెచ్చించింది. ఒలింపిక్స్ వాయిదా పడితే, దేశీయంగా స్పాన్సర్షిప్స్ల రూపంలో రావాల్సిన రూ. 3 లక్షల కోట్ల లావాదేవీలు ప్రమాదంలో పడతాయి. టోక్యో ఒలింపిక్స్తో జపాన్ పర్యాటకం, వినియోగ వ్యయం గణనీయంగా వృద్ది చెందుతుందని జపాన్ ప్రధాని షింజో అబె భారీ ఆశలు పెట్టుకున్నారు. ఒలింపిక్స్ వాయిదా పడినా, రద్దు అయినా జపాన్ ఆర్థిక వ్యవస్థ కోలుకోలేని స్థితికి దిగజారే ప్రమాదం కనిపిస్తోంది. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ సైతం టోక్యో ఒలింపిక్స్ వాయిదా పడే అవకాశం లేదని, షెడ్యూల్ ప్రకారమే జరుగుతుందని పలుమార్లు ప్రకటన చేసింది. అయినా, కరోనా వైరస్ రోజు రోజుకూ పంజా విసురుతున్న ప్రమాదకర పరిస్థితుల్లో టోక్యో ఒలింపిక్స్ షెడ్యూల్ ప్రకారం జరుగటం అసాధ్యమని నిపుణులు చెబుతున్నారు. పైకి షెడ్యూల్ ప్రకారం జరుపుతామని చెప్పినా, వాస్తవికంగా ఎన్నో ఆటంకాలు జపాన్ ముందున్నాయి. అందుకే నిర్వహణ కమిటీ పలు ప్రత్యామ్నాయ ప్రణాళికలు సిద్ధం చేసింది.
2021 స్పోర్ట్స్ క్యాలెండర్ బిజీగానే ఉంది. వార్షిక టోర్నీలు, ప్రపంచకప్లు, లీగ్లతో నిండి ఉంది. కానీ 2022లో ఫుట్బాల్ ఫిఫా ప్రపంచకప్, బీజింగ్ వింటర్ ఒలింపిక్స్ జరగాల్సి ఉన్నాయి. రెండేండ్ల వాయిదా మరీ ఎక్కువ. అందుకే 2021లో నిర్వహణ మెరుగైన విధానంగా ఉంటుందనే అభిప్రాయం వినిపిస్తోంది. 2021లో మూడు షెడ్యూల్స్ను ఒలింపిక్ నిర్వహణ కమిటీ రూపొందించింది. ఈ మూడు పూర్తిస్థాయి సన్నద్ధతతో రెగ్యులర్ ఒలింపిక్స్గా నిర్వహించేందుకు ఉద్దేశించినవే. ఇదే ఏడాదిలో నిర్వహించాల్సి వస్తే.. జులై వరకు వైరస్ను కట్టడి చేయగలిగినాన ప్రేక్షకులు లేకుండా ఖాళీ స్టేడియాల్లో ఒలింపిక్స్ను నిర్వహించాల్సి ఉంటుంది. దీని వల్ల నిర్వాహకులకు పెద్ద ప్రయోజనం ఉండదు. టోక్యో ఒలింపిక్స్కు సుమారు 60 బహుళ జాతి కంపెనీలు స్పాన్సర్ చేస్తున్నాయి. టోయోటా మోటర్ కార్ప్, పానాసోనిక్ కార్ప్లు ఇందులో ముఖ్యమైనవి. ప్రేక్షకులు లేని ఒలింపిక్స్ వల్ల పర్యాటకం, వినియోగ వ్యయంలో ఎటువంటి పురోగతి ఉండదు. దీని వల్ల జపాన్కు ఎటువంటి ఉపయోగం ఉండబోదు. అందువల్ల జపాన్ ఈ విధంగా ఒలింపిక్స్ను నిర్వహించాలని అనుకోవటం లేదు.
కరోనా వైరస్ ఈ ఏడాది ఆఖరు వరకు, లేదా రానున్న 2-3 మాసాల వ్యవధిలోనే నియంత్రణలోకి వచ్చినా.. వైరస్ తాలుకు భయాందోళనలు ప్రజల్లో తాజాగానే ఉంటాయి. అంతర్జాతీయ అథ్లెట్లు సైతం అప్పటికప్పుడు ఒలింపిక్స్ కోసం జపాన్కు వెళ్లేందుకు సిద్ధంగా ఉంటారని చెప్పలేం. దీంతో 2021లో మూడు షెడ్యూల్ను జపాన్ సిద్ధం చేసింది. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీతో తదుపరి చర్చలు, కరోనా వైరస్పై భవిష్యత్లో సాధించే పురోగతి ఆధారంగా ఏ షెడ్యూల్ ఒలింపిక్స్ నిర్వహణకు సరైనదిగా భావిస్తారో దానినే అంతిమం చేయనున్నారు. వాయిదా నిర్ణయాన్ని సైతం వీలైనంత త్వరగా ప్రకటించాలని నిర్వహణ కమిటీ సభ్యులు కొందరు కోరుతున్నారు. ఒలింపిక్స్ ఏర్పాట్లు జరుగుతున్నాయి, వాయిదా నిర్ణయం వెలువడితే వాటికి బ్రేక్ పడి ఆర్థిక ఉపశమనం లభించే వీలుంటుంది. లేదంటే, ఇప్పుడు పూర్తి ఏర్పాట్లు చేసినా, వచ్చే ఏడాది మళ్లీ ఆధునీకరణ, పునరుద్ధరణ అంటూ మళ్లీ ఖర్చు చేయాల్సి ఉంటుందని అధికారులు హెచ్చరిస్తున్నారు. దీనికి తోడు అథ్లెట్లు నివాసం ఉండే ఒలింపిక్ విలేజ్ను ఒలింపిక్స్ ముగిసిన అనంతరం నివాస గృహాలుగా మార్చి ప్రజలకు అందజేయాల్సి ఉంది. క్రీడలు వాయిదా పడితే, ఆ ప్రభావం దానిపైనా పడుతుంది.
40 ఏండ్ల ఫోబియో! : ఒలింపిక్స్ క్రీడలు ఇప్పటివరకూ ప్రపంచ యుద్ధాల కారణంగానే నిలిచిపోయాయి. 1916 బెర్లిన్ ఒలింపిక్ క్రీడలు మొదటి ప్రపంచ యుద్ధం కారణంగా జరుగలేదు. 1940 ఒలింపిక్ క్రీడలు రెండో ప్రపంచ యుద్ధం కారణంగా చోటుచేసుకోలేదు. ప్రస్తుతం టోక్యో 2020 ఒలింపిక్స్ ఎదుర్కొంటున్న విపత్తు ఒలింపిక్స్కు కొత్త కాదని, ప్రతి 40 ఏండ్లకు ఓసారి ఇటువంటి పరిస్థితి ఎదుర్కొంటుందని జపాన్ ఆర్థిక మంత్రి థారో అసో వ్యాఖ్యానించారు. 1940 ఒలింపిక్స్ యుద్ధం కారణంగా రద్దు కాగా, 1980 మాస్కో ఒలింపిక్స్ను అమెరికా సహా 64 దేశాలు బహిష్కరించాయి. ఇప్పుడు 40 ఏండ్ల తర్వాత 2020 టోక్యో ఒలింపిక్స్ వైరస్ రూపంలో మరో సవాల్ ఎదుర్కొంటుంది. ఈ సమస్య సమసిపోయి, సజావుగా ఒలింపిక్స్ జరుగుతాయనే విశ్వాసం అసో వ్యక్త పరిచారు. టోక్యో ఒలింపిక్స్ అధికారిక ఎయిర్లైన్ భాగస్వామి జపాన్ ఎయిర్లైన్స్ సైతం ఇటీవల తన అంతర్గత సమావేశంలో ఒలింపిక్స్ వాయిదా లాంఛనమేనని ఉన్నతాధికారులతో చెప్పిన విషయం ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది.
ఈ వారంలో ఐఓసీ కీలక భేటి : అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) అధ్యక్షుడు థామస్ బాచ్ ఇటీవల పదేపదే 2020 క్రీడలు వాయిదా వేయటం కుదరదు అనే అభిప్రాయం వ్యక్త పరుస్తున్నాడు. అయినా, ఒలింపిక్స్ నిర్వహణపై ఎవరికీ నమ్మకం లేకుండా పోతుంది. షెడ్యూల్ ప్రకారం జరిగినా, ఆలస్యంగా జరిగినా జపాన్కు అథ్లెట్ల బృందాన్ని పంపించేందుకు జాతీయ ఒలింపిక్ సంఘాలు సిద్ధంగా ఉన్నాయనే విశ్వాసమూ లేదు. ఈ పరిస్థితుల్లో ఈ వారంలో అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ కీలక సమావేశం జరుపనుంది. జాతీయ ఒలింపిక్ సంఘాలతో తాజా పరిస్థితిపై చర్చించనుంది. వాయిదా వేసే అంశాన్ని చర్చకు పెట్టనుంది. సభ్య దేశాల అభిప్రాయం, ఆతిథ్య దేశం అభ్యంతరాలను బేరీజు వేసుకుని టోక్యో ఒలింపిక్స్పై సంచలన నిర్ణయం వెలువరించే అవకాశం కనిపిస్తోంది.