Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-ఐఓసీ, జపాన్ ప్రధాని, నిర్వహణ కమిటీ సంకేతం
-2020లో ఆడలేమని జర్మనీ, ఆస్ట్రేలియా, కెనడా స్పష్టీకరణ
-2021 ఒలింపిక్స్ దిశగా సన్నద్ధం కానున్న టోక్యో
-నాలుగు వారాల్లో ఐఓసీ తుది నిర్ణయం
నవతెలంగాణ-హైదరాబాద్
ఒలింపిక్స్ చరిత్రలోనే ఈ స్థాయి ఆతిథ్య ఏర్పాట్లు చూడలేదు. విశ్వ క్రీడా సంగ్రామానికి టోక్యో అత్యుత్తమ ఆతిథ్యం ఇచ్చేందుకు సర్వ సన్నద్ధం అవుతోంది. ఇవీ టోక్యో ఒలింపిక్స్ ఏర్పాట్లపై తరచుగా ఐఓసీ అధికారుల వ్యాఖ్యలు.
2011 సునామి నుంచి జపాన్ అప్పుడే తేరుకుంటోంది. 2013 సెప్టెంబర్లో టోక్యో నగరం ఒలింపిక్స్ ఆతిథ్య హక్కులు దక్కించుకోగానే ప్రజలు, పాత్రికేయులు, ప్రభుత్వం, అథ్లెట్ల సంబరాలు అంబరాన్ని అంటాయి. వేలాది మంది ప్రజలు వీధుల్లోకి వచ్చి ఆతిథ్య హక్కుల సంబురాన్ని జరుపుకున్నారు.
అంచనాలకు తగినట్టుగానే జపాన్ రూ. 9 లక్షల కోట్లతో ఒలింపిక్స్కు మెగా ఏర్పాట్లు చేసింది. ఒలింపిక్స్కు ఘనంగా నిర్వహించేందుకు అన్ని విధాల సిద్ధమైన జపాన్.. మహమ్మారి కరోనా వైరస్ను తట్టుకోలేకపోతుంది. మహమ్మారి కోరల్లోకి వెళ్లిపోతుంది. కరోనా వైరస్ ప్రబలుతున్నా షెడ్యూల్ ప్రకారమే ఒలింపిక్స్ జరుగుతాయని జపాన్ చెబుతూ వచ్చింది. ఇక నుంచి ఆ మాట అనలేదు. 2020 టోక్యో ఒలింపిక్స్ వాయిదా ప్రకటన ఇక లాంఛనమే!.
అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ)పై ఆదివారం ఒత్తిడి పెరిగింది. కరోనా వైరస్ (కోవడ్-19) మహమ్మారి వేగంగా ప్రబలుతూ, ప్రజల ప్రాణాలను హరించి వేస్తున్న ప్రమాదకర పరిస్థితుల్లో ఒలింపిక్స్కు అథ్లెట్లను పంపేందుకు సిద్ధంగా లేమని పలు జాతీయ ఒలింపిక్ సంఘాలు ఆదివారం కుండబద్దలు కొట్టాయి. ఈ వారంలో ఒలింపిక్ కమిటీ ఎగ్జిక్యూటివ్ బోర్డు సమావేశం కానుంది. ఈ సమావేశంలో జాతీయ ఒలింపిక్ సంఘాల అభిప్రాయాలను, టోక్యో ఒలింపిక్స్ ఆతిథ్య దేశం అభిప్రాయం తీసుకుని తదుపరి కార్యాచరణకు నడుం బిగించేందుకు సిద్ధపడింది. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ఎగ్జిక్యూటివ్ బోర్డు సమావేశం అయ్యేందుకు సైతం కొన్ని ఒలింపిక్ సంఘాలు సంయమనం పాటించలేదు. ఖరాఖండిగా ఆదివారమే తమ నిర్ణయాన్ని వెల్లడించాయి. జర్మనీ, ఆస్ట్రేలియా, కెనడాలు తమ అథ్లెట్లను టోక్యో ఒలింపిక్స్కు పంపించలేమని తేల్చి చెప్పాయి. దీంతో టోక్యో ఒలింపిక్స్ నిర్వహణపై నీలి నీడలు కమ్ముకున్నాయి.
వ్యతిరేకత పెరుగుతోంది! : ఇప్పటివరకూ అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ), టోక్యో ఒలింపిక్ క్రీడల కమిటీ షెడ్యూల్ ప్రకారమే 2020 క్రీడలు జరుగుతాయని పదేపదే చెబుతూ వచ్చాయి. ఐఓసీ ప్రకటనలపై ఏ జాతీయ ఒలింపిక్ సంఘం అభ్యంతరం వ్యక్తం చేయలేదు. కానీ ఇప్పుడు పరిస్థితి చేజారింది. షెడ్యూల్ ప్రకారం జులై 24- 9 ఆగస్టు 2020 సమయంలో ఒలింపిక్స్కు హాజరు కాలేమని, తమ అథ్లెట్ల ఆరోగ్య భద్రతను పణంగా పెట్టలేమని పలు జాతీయ ఒలింపిక్ సంఘాలు స్పష్టం చేస్తున్నాయి. జర్మనీ ఒలింపిక్ కమిటీ (డిఓఎస్బి) ఆదివారం ఒలింపిక్ అథ్లెట్లలో టెలీ కాన్ఫరెన్స్లో అభిప్రాయాలు తీసుకుంది. షెడ్యూల్ ప్రకారం ఒలింపిక్స్కు వెళ్లాలని అనుకునేవారు ఎవరు? వాయిదా పడాలని కోరుకుంటున్న వారు ఎవరు? అనే అంశాలపై అభిప్రాయం తీసుకుంది. అథ్లెట్లతో మాట్లాడిన అనంతరం టోక్యో ఒలింపిక్స్ను బహిష్కరించే అవకాశం లేకపోలేదని డిఓఎస్బి అధ్యక్షుడు అన్నాడు. ' ఒలింపిక్స్ నిర్వహణపై మాకు పూర్తి వివరాలు కావాలి. నిర్వహణపై జపాన్ పరిస్థితి ఏమిటీ, ఎటువంటి వాతావరణంలో క్రీడలను నిర్వహించనున్నారు? అనేది ఆలోచన చేయాలి' అని డిఓఎస్బి అధ్యక్షుడు ఆల్ఫెన్సో అన్నాడు. జర్మనీకి తోడుగా సెర్బియా, క్రోయేషియాలు సైతం టోక్యో ఒలింపిక్స్కు తమ అథ్లెట్ల బృందాన్ని పంపబోమని ప్రకటించాయి. ' టోక్యో ఒలింపిక్స్ నిర్వహణకు జపాన్ ఎంతో ఖర్చు చేసింది. అందుబాటులో ఉన్న ఎన్నో వనరులను వాడింది. క్రీడల నిర్వహణపై జపాన్ పట్టుదలగా ఉండటాన్ని అర్ధం చేసుకోగలం. కానీ అథ్లెట్ల ఆరోగ్య భద్రతను పణంగా పెట్టలేం. ఇది కామన్సెన్స్తో ఆలోచించినా అర్థం అవుతుంది. కొన్ని నెలలు వాయిదా పడకుండా టోక్యో ఒలింపిక్స్ నిర్వహణ అసాధ్యం' అని క్రోయేషియా క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రి వంజా వుడోవిక్ అభిప్రాయపడ్డారు. ప్రపంచ వ్యాప్తంగానే కాకుండా దేశీయంగా సైతం ప్రయాణాలపై నిషేధాజ్ఞలు కొనసాగుతున్నాయి. అథ్లెట్ల తమ ప్రదేశాల్లో శిక్షణ పొందుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రయాణ ఏర్పాట్లే అసాధ్యమైన పని. ఇక క్రీడల్లో పాల్గొనటం సాధ్యపడదు. 2020 టోక్యో ఒలింపిక్స్లో ఆస్ట్రేలియా భాగస్వామ్యం కాదు. 2021 ఒలింపిక్స్ కోసం సన్నద్ధం కావాల్సిందిగా ఆస్ట్రేలియా ఒలింపిక్ సంఘం తమ అథెట్లకు సూచించింది.
భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) టోక్యో క్రీడలపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. ఇప్పటికే టోక్యో ఏర్పాట్ల పరిశీలనకు వెళ్లాల్సిన హైలెవల్ కమిటీ పర్యటనను క్రీడా మంత్రిత్వ శాఖ వాయిదా వేసింది. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) 2020 ఒలింపిక్స్పై ఓ నిర్ణయం తీసుకునే వరకూ వేచి చూడాలనే వైఖరితో భారత ఒలింపిక్ సంఘం కనిపిస్తోంది. ఇదే విషయాన్ని ఐఓఏ ప్రధాన కార్యదర్శి రాజీవ్ మెహతా ధ్రువీకరించారు. యుఎస్ఎ ట్రాక్ అండ్ ఫీల్డ్, యుఎస్ఏ స్విమ్మింగ్, బ్రెజిల్ ఒలింపిక్ కమిటీ, యుకె (బ్రిటన్) అథ్లెటిక్స్, ఫ్రెంచ్ స్విమ్మింగ్ ఫెడరేషన్లు టోక్యో ఒలింపిక్స్ను వాయిదా వేయాలని అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీని కోరాయి. కరోనా వైరస్ ప్రభావంతో ఒలింపిక్ అర్హత టోర్నీలు రద్దయ్యాయి. అర్హత టోర్నీల్లో ఆడే అవకాశం లభించని అథ్లెట్లు, స్టేడియాల మూసివేతతో ప్రాక్టీస్కు వీలుకాని క్రీడాకారులు సైతం టోక్యో ఒలింపిక్స్ను వాయిదా వేయాలని కోరుతున్నారు. జపాన్ ప్రభుత్వం, టోక్యో క్రీడల నిర్వహణ కమిటీ, జపాన్ ఒలింపిక్ సంఘం సహా ఇతర స్పాన్సర్లతో ఐఓసీ నేరుగా సంప్రదింపులు జరుపనుంది. తాజా పరిస్థితిని అంచనా వేసి, క్రీడల నిర్వహణకు జులై-ఆగస్టు షెడ్యూల్ సరికాదని భావిస్తే, టోక్యో ఒలింపిక్స్ను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. దీనికి అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ నాలుగు వారాల సమయం తీసుకోనుంది. ఏప్రిల్ మూడో వారం ఆఖర్లో టోక్యో ఒలింపిక్స్ భవితవ్యం తేలిపోనుంది.
' క్రీడాకారుల కోణంలో ఆలోచిస్తే రక్షిత వాతావరణం, భద్రత సాధించేందుకు ఓ దశకు చేరుకోవాలి. అది ఇప్పుడు మన చేతుల్లో లేదు. టోక్యో ఒలింపిక్స్ నిర్వహణకు వాయిదా అంశాన్ని సైతం కచ్చితంగా పరిశీలిస్తాం. ఇప్పుడున్న పరిస్థితుల్లో వాయిదా వాస్తవికంగా ఉంటుంది'
- యషురో యమషిట, జపాన్ ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు
' ఒలింపిక్ క్రీడలను ఫుట్బాల్ మ్యాచ్ మాదిరి వచ్చే వారానికి సులువుగా వాయిదా వేయలేం. ఇది ఎంతో క్లిష్టమైన సందర్భం. నిర్ణయాలు తీసుకునే ముందు ఎంతో బాధ్యతాయుంగా ఆలోచన చేయాలి. 2020 ఒలింపిక్స్ క్రీడల రద్దు అనేది చిట్టచివరి దారి. అదే జరిగితే 206 దేశాలకు చెందిన 11,000 మంది అథ్లెట్ల ఆశలు కల్లలు అవుతాయి'
- థామస్ బాచ్, ఐఓసీ అధ్యక్షుడు
'సాధారణ పరిస్థితుల్లో ఒలింపిక్స్ నిర్వహణ సాధ్యపడని పక్షంలో, 2020 ఒలింపిక్స్ను వాయిదా వేయాలనే ఆలోచనను విస్మరించలేం. అథ్లెట్ల భద్రత అన్నింటి కంటే ముఖ్యమైనది. రానున్న నాలుగు వారాల్లో ఏం చేయాలనే అంశంపై అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ యోచిస్తుంది. ఈ క్రమంలో వాయిదా నిర్ణయం ఉండే అవకాశం ఉంది'
- షింజో అబె, జపాన్ ప్రధాని
' షెడ్యూల్ ప్రకారమే 2020 ఒలింపిక్స్ జరుగుతాయని చెప్పటం మూర్ఖత్వమే అవుతుంది. ఒలింపిక్స్ వాయిదాపై ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. కానీ వాయిదా అంశాన్ని పరిశీలించకుండా ఉండలేం. టోక్యో ఒలింపిక్ క్రీడల రద్దు అనేది మా ఆలోచనల్లోనే లేదు'
- యషిరో మోరి, టోక్యో ఒలింపిక్ క్రీడల అధ్యక్షుడు