Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-2021లో నిర్వహిస్తామని జపాన్ ప్రధాని ప్రకటన
-ఐఓసీ అధ్యక్షుడు థామస్ బాచ్తో ఫోన్ సంభాషణ
-సంపూర్ణ అంగీకారం తెలిపిన ఐఓసీ బాస్ బాచ్
నవతెలంగాణ-టోక్యో
రెండు ప్రపంచ యుద్ధాలు. మూడు ఒలింపిక్స్ను మింగేశాయి. 1916, 1940, 1944 ఒలింపిక్ క్రీడలు ప్రపంచం యుద్ధంలో తలమునకలై ఉన్న తరుణంలో విశ్వ క్రీడలు రద్దు అయ్యాయి.
ప్రచ్ఛన్న యుద్ధాలు. అమెరికా, రష్యా కోల్డ్వార్ నడుస్తోన్న సమయంలో 1976, 1980, 1984 ఒలింపిక్స్ బహిష్కరిస్తామనే హెచ్చరికలు జోరుగా వినిపించాయి. ఈ మూడు ఒలింపిక్స్ను 50కి పైగా దేశాలు బహిష్కరించాయి. అయినా, ఒలింపిక్స్ సజావుగానే జరిగాయి.
ఇప్పుడు ప్రపంచంపై యుద్ధ మేఘాలు లేవు. వాణిజ్య వార్ నడుస్తున్నా, ప్రచ్ఛన్న యుద్ధ ప్రస్తావనే వినిపించటం లేదు!. అయినా, 2020 ఒలింపిక్స్ వాయిదాకి సిద్ధమైంది. కరోనా వైరస్ మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తోన్న వేళ టోక్యో ఒలింపిక్స్ను ఏడాది తర్వాత నిర్వహిస్తామని జపాన్ ప్రధాని మంగళవారం ప్రకటించాడు.
124 ఏండ్ల ఆధునిక ఒలింపిక్ క్రీడల చరిత్రలో ఒలింపిక్స్ రద్దు అయ్యాయి కానీ, ఏనాడూ ఒలింపిక్స్ వాయిదా పడలేదు. తొలిసారి ఆ సన్నివేశం ఆవిష్కతమైంది. జులై 24-9 ఆగస్టు 2020 టోక్యో ఒలింపిక్స్ ఏడాది పాటు వాయిదా పడింది. 2021 వేసవిలో టోక్యో ఒలింపిక్స్ నిర్వహించనున్నారు!.
వాయిదా అనివార్యమైంది. కరోనా వైరస్ వేగంగా ప్రబలుతూ, ప్రపంచాన్ని వణికిస్తోంది. ప్రపంచ క్రీడలపై కరోనా వైరస్ దారుణంగా పంజా విసిరింది. కరోనా మహమ్మారి ధాటికి అన్ని క్రీడా టోర్నీలు రద్దు, వాయిదా పడ్డాయి. ప్రతిష్టాత్మక విశ్వ క్రీడా సంగ్రామానికి సైతం కరోనా వైరస్ తాకిడి తగిలింది. కరోనా విజృంభిస్తున్నా, షెడ్యూల్ ప్రకారమే టోక్యో ఒలింపిక్స్ నిర్వహిస్తామని అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ), జపాన్లు పదేపదే పునారుద్ఘాటించాయి. మహమ్మారి పరిస్థితుల్లో షెడ్యూల్ ప్రకారం ఒలింపిక్ క్రీడల్లో పాల్గొనలేమని ఆదివారం కెనడా, ఆస్ట్రేలియా, జర్మనీ, క్రోయేషియా, సెర్బియాలు ప్రకటించిన రెండు రోజుల్లోనే జపాన్ నుంచి కీలక ప్రకటన వెలువడింది. కరోనా వైరస్ ప్రబలుతున్న ప్రమాదకర పరిస్థితుల్లో టోక్యో ఒలింపిక్స్ను నిర్వహించలేమని, ఏడాది పాటు వాయిదా వేస్తున్నామని ఆ దేశ ప్రధాని షింజో అబె మంగళవారం ప్రకటించారు.
ఐఓసీ బాస్, టోక్యో గవర్నర్తో ఫోన్ సంభాషణ : కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తోంది. జపాన్లో కరోనా వైరస్ బాధితులు దండిగానే ఉన్నారు. వైరస్ నివారణ చర్యల్లో భాగంగా ప్రపంచ వ్యాప్తంగా ప్రయాణాలపై నిషేధాజ్ఞలు విధించారు. దేశీయంగానూ కొన్ని దేశాల్లో లాక్డౌన్ వాతావరణం ఉంది. ఈ పరిస్థితుల్లో ఆడలేమని పలు దేశాలు ప్రకటించాయి. టోక్యో ఒలింపిక్స్పై నాలుగు వారాల్లో నిర్ణయం తీసుకుంటామని అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ఎగ్జిక్యూటివ్ బోర్డు సమావేశం అనంతరం వెల్లడించింది. కానీ, పరిస్థితులు మరింత దిగజారకుండా జపాన్ జాగ్రత్త వహించింది. ' ఐఓసీ అధ్యక్షుడు థామస్ బాచ్ను ఒలింపిక్స్ను ఏడాది పాటు వాయిదా వేయాలని అడిగాం. ఆరోగ్యకర పరిస్థితుల్లో పోటీపడే అవకాశం అథ్లెట్లకు ఇవ్వాలని కోరాం. ప్రేక్షకులకు సైతం ఒలింపిక్స్ ఈవెంట్ సురక్షితంగా ఉండేలా చూడాలని కోరాం. అధ్యక్షుడు బాచ్ 100 శాతం అంగీకారం తెలిపారు' అని జపాన్ ప్రధానమంత్రి షింజో అబె పేర్కొన్నారు. మంగళవారం అంతర్జాతీయ ఒలింపిక్ అధ్యక్షుడు థామస్ బాచ్, టోక్యో గవర్నర్ యురికో కోయికెలతో షింజో అబె ఫోన్లో మాట్లాడారు. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ నాలుగు వారాల్లో తుది నిర్ణయం తీసుకునేందుకు జపాన్ అధికారులతో చర్చలు జరపాల్సి ఉంది. ఈ బృందం చర్చలు కొనసాగనున్నాయి, కానీ ఏడాది తర్వాత ఏ సమయంలో ఈవెంట్ను షెడ్యూల్ చేయాలనే అంశంపై చర్చలు జరుగనున్నాయి.
2020 ఒలింపిక్సే! : టోక్యో ఒలింపిక్స్ అధికారికంగా ఏడాది పాటు వాయిదా పడ్డాయి. స్వయంగా జపాన్ ప్రధానే వాయిదా విషయాన్ని వెల్లడించాడు. వచ్చే ఏడాది వేసవిలో ఒలింపిక్స్ నిర్వహిస్తామని ప్రకటించాడు. జపాన్లో జూన్-ఆగస్టు సమయంలో వేసవి ఉంటుంది. అంటే, సరిగ్గా ఇంచుమించు ఇవే తేదిలతో 2021లో టోక్యో ఒలింపిక్స్ నిర్వహించే అవకాశం ఉంది. నాలుగు వారాల తర్వాత అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ 2021 షెడ్యూల్ను ప్రకటించే అవకాశం ఉంది. ఒలింపిక్స్ వాయిదా పడటంతో, రద్దుగా ముగిసిన అర్హత టోర్నీలు ఈ ఏడాది ద్వితీయార్థంలో జరిగే వీలుంది.
' అథ్లెట్లు ఆరోగ్యకర వాతావరణంలో పోటీపడాలి. ప్రేక్షకులు సురక్షిత వాతావరణంలో విశ్వ క్రీడలను వీక్షించగలగాలి. ప్రస్తుతం అటువంటి పరిస్థితి లేదు. అలాంటి వాతావరణంలో ఒలింపిక్స్ జరిగేలా చూసేందుకు టోక్యో ఒలింపిక్స్ను ఏడాది పాటు వాయిదా వేయాలని అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ అధ్యక్షుడు థామస్ బాచ్ను కోరాను. ఐఓసీ బాస్ వాయిదాపై 100 శాతం అంగీకారం తెలిపారు. 2021లో జరిగినా, అధికారికంగా 2020 ఒలింపిక్స్గా పిలుస్తాం'
- షింజో అబె, జపాన్ ప్రధానమంత్రి
' అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) నిర్ణయాన్ని భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) స్వాగతిస్తోంది. లాక్డౌన్ ముగిసిన వెంటనే అథ్లెట్లు, క్రీడా సమాఖ్యలు, స్పాన్సర్లతో సమావేశం అవుతాం. క్రీడా సౌకర్యాలు అందుబాటులో లేకుండా నాలుగు నెలల్లో ఏ విధంగా ఒలింపిక్స్కు సిద్ధం కావాలని కంగారు పడుతున్న మన అథ్లెట్ల ఒత్తిడి వాయిదా నిర్ణయంతో పూర్తిగా తొలగిపోయింది'
- రాజీవ్ మెహతా, ఐఓఏ జనరల్ సెక్రటరీ