Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-ఏడాది పాటు వాయిదా వేసే అవకాశం
-2021లో 2020, 2022లో 2021 వరల్డ్కప్
-త్రైమాసిక సమావేశంలో ఇదే కీలక ఎజెండా
నవతెలంగాణ-దుబారు
కరోనా వైరస్ (కోవిడ్-19) మహమ్మారి దెబ్బకు క్రీడా రంగం కుదేలైంది. పాఠశాల స్థాయి క్రీడల నుంచి 2020 టోక్యో ఒలింపిక్స్ వరకు వాయిదా పర్వం కొనసాగింది. వేగంగా ప్రబలుతున్న మహమ్మారితో క్రీడా టోర్నీలు వాయిదా, రద్దుగా ముగియక తప్పటం లేదు.
కరోనా ప్రభావం ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 13పై గట్టిగా పడింది. 2020 ఎప్పుడు జరుగుతుందో, అసలు జరుగుతుందో లేదో అనేది ఎవరికీ తెలియటం లేదు. ఇప్పుడీ జాబితాలోకి టీ20 వరల్డ్కప్ చేరిపోయింది. కరోనా ప్రభావంతో 2021 టీ20 వరల్డ్కప్ అర్హత టోర్నీలను వాయిదా వేస్తున్నట్టు ఐసీసీ ప్రకటించింది. దీంతో అక్టోబర్ 2020లో జరగాల్సిన టీ20 వరల్డ్కప్పై నీలినీడలు కమ్ముకున్నాయి.
కరోనా వైరస్ మహమ్మారి ప్రపంచం తలుపులు మూసివేస్తోంది. ఈ మహమ్మారి మరింత మారణహౌమం సృష్టించకుండా నివారణ చర్యల్లో భాగంగా ప్రపంచం లాక్డౌన్లోకి వెళ్తోంది. ఈ పరిస్థితుల్లో నలుగురు వ్యక్తులు ఒక చోటకు చేరటమే నిషేధం, ఆరోగ్యానికి ప్రమాదకరం. అలాంటిది, క్రికెట్ మ్యాచ్కు వేలాది మంది స్టేడియానికి రావటం ఎంత పెద్ద ప్రమాదమో చెప్పనవసరం లేదు. ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ను ఘనంగా నిర్వహించిన క్రికెట్ ఆస్ట్రేలియా.. అక్టోబర్లో పురుషుల టీ20 వరల్డ్కప్ మెగా ఈవెంట్కు రంగం సిద్ధం చేసుకుంది. రోజు రోజుకూ ప్రాణాంతకంగా మారుతున్న కరోనా వైరస్ ఈ నెలాఖరులో ఆరంభం కావాల్సిన ఐపీఎల్నే కాదు అక్టోబర్లో మొదలవ్వాల్సిన టీ20 వరల్డ్కప్పైనా ప్రభావం చూపిస్తోంది. కరోనా ప్రభావంతో 2021 టీ20 వరల్డ్కప్ (భారత్లో జరగాల్సి ఉంది) అర్హత టోర్నీలను ఐసీసీ వాయిదా వేసింది. ఐసీసీ తాజా నిర్ణయంతో అక్టోబర్లో జరగాల్సిన 2020 టీ20 వరల్డ్కప్పై నీలినీడలు కమ్ముకున్నాయి. జులై-ఆగస్టులో జరగాల్సిన ఒలింపిక్స్నే వాయిదా వేసిన గడ్డు పరిస్థితుల్లో అక్టోబర్లో వరల్డ్కప్ను నిర్వహించటం అసాధ్యమని చెప్పవచ్చు.
పూర్తిగా రద్దు చేస్తారా? : ఈ ఏడాది అక్టోబర్లో జరగాల్సిన టీ20 వరల్డ్కప్ అర్హత టోర్నీలు ఇప్పటికే ముగిశాయి. రెండు దశల్లో జరుగనున్న టీ20 మెగా వార్కు క్రికెట్ ఆస్ట్రేలియా కనీవినీ ఎరుగని ఏర్పాట్లు చేసుకుంది!. కరోనా వైరస్ బాధితుడు మహిళల టీ20 వరల్డ్కప్ ఫైనల్స్కు హాజరు కావటం, కంగారూ గడ్డపై కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ పరిస్థితుల్లో అక్టోబర్లో అభిమానులు పూర్తి స్థాయిలో స్టేడియాలకు వస్తారనే విశ్వాసం ఎవరిలోనూ లేదు. 2020 టీ20 వరల్డ్కప్ షెడ్యూల్ ప్రకారం నిర్వహించకుంటే, మరో షెడ్యూల్ సమయం ఆసీస్కు లేదు. అఫ్గనిస్థాన్తో ఏకైక టెస్టు, ఏడాది ఆఖర్లో భారత్తో బోర్డర్ గవాస్కర్ టెస్టు సిరీస్కు ఆసీస్ ఆతిథ్యం ఇవ్వాల్సి ఉంది. ఇక 2021లో భారత్ వేదికగా టీ20 వరల్డ్కప్ జరుగనుంది. ఈ నేపథ్యంలో 2020 టీ20 వరల్డ్కప్ వాయిదా పడితే, ఏ సమయంలో నిర్వహించాలనేది ప్రశ్నార్థకం. ఒకే ఏడాదిలో రెండు వరల్డ్కప్ల నిర్వహణ కష్టం కాబట్టి, 2020 టీ20 వరల్డ్కప్ పూర్తిగా రద్దు అయ్యే అవకాశం లేకపోలేదు.
ఐసీసీ క్యాలెండర్లో 2022 ఖాళీగా ఉంది. 2021లో టీ20 వరల్డ్కప్, 2023లో వన్డే వరల్డ్కప్లకు భారత్ ఆతిథ్యం ఇవ్వాల్సి ఉంది. ఒకవేళ ఆస్ట్రేలియా టీ20 వరల్డ్కప్ ఆతిథ్య హక్కులు నష్టపోకుండా చూడాలని భావిస్తే.. బీసీసీఐని ఐసీసీ ఒప్పించాల్సి ఉంటుంది. వరుసగా రెండు సంవత్సరాల్లో రెండు ప్రపంచకప్లు నిర్వహించేందుకు బీసీసీఐ అంగీకారం తెలిపితే మార్గం సుగమం కానుంది. 2021లో 2020 టీ20 వరల్డ్కప్, 2022లో 2021 టీ20 వరల్డ్కప్లను నిర్వహించే వెసులుబాటు ఐసీసీకి ఉంది. ఐతే, దీనికి భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అనుమతి తప్పనిసరి. భారత బోర్డు గ్రీన్ సిగల్ ఇస్తే, రెండు టీ20 ప్రపంచకప్లు ఏడాది పాటు వాయిదా పడనున్నాయి.
మిగతా టోర్నీల సంగతేంటీ? : ఐసీసీ 2019 వరల్డ్కప్ ముగిసిన తర్వాత వరుసగా ప్రతిష్టాత్మక, ప్రయోగాత్మక సిరీస్లు ముందు పెట్టుకుంది. 2019-2021 ఐసీసీ టెస్టు ప్రపంచ చాంపియన్షిప్ ప్రస్తుతం నడుస్తోంది. న్యూజిలాండ్తో సిరీస్కు ముందు 360 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచిన భారత్, 2021 జులై లార్డ్ ఫైనల్స్ బెర్త్ ఖాయం చేసుకుందని అనుకున్నారు. కానీ 0-2 వైట్వాష్ ఫలితం తుది పోరు రేసులో మిగతా జట్లకూ అవకాశాల ద్వారం తెరిచింది. టెస్టు చాంపియన్షిప్స్లో ప్రతి జట్టు మిగతా జట్లతో ఆరు సిరీస్లు ఆడాలి. చివరకు ప్రతి సిరీస్ను రెండు టెస్టులకు కుదించైనా, టెస్టు చాంపియన్షిప్ను షెడ్యూల్ ప్రకారం నిర్వహించాలని ఐసీసీ భావిస్తోంది.
2023 వన్డే వరల్డ్కప్ అర్హత టోర్నీగా ఈ ఏడాది మే 1 నుంచి, 2022 మార్చి 31 వన్డే సూపర్ లీగ్ జరగాల్సి ఉంది. ఇందులో 13 జట్లు పాల్గొంటున్నాయి. దీనికి మరింత సమయం ఉన్నప్పటికీ.. ఈ ఏడాది ఈ సమయంలో జరగాల్సిన మ్యాచులు వాయిదా పడటంతో.. పరిస్థితి చక్కబడిన తర్వాత ఆ మ్యాచులు కొనసాగనున్నాయి. దీంతో వన్డే సూపర్ లీగ్ ప్రాధాన్యత తగ్గనుంది. వన్డే ద్వైపాక్షిక సిరీస్లకు ఓ అర్థం తీసుకొచ్చేందుకు ఐసీసీ ఈ లీగ్ను ప్రవేశపెట్టింది. ప్రస్తుత పరిస్థితుల్లో అర్హత టోర్నీ ఆలోచన మానుకుని, ర్యాంకింగ్స్ ప్రకారం అర్హత ప్రక్రియను పూర్తి చేయటమే ఐసీసీ ముందున్న మేలైన మార్గం. 2021లో ఐసీసీ మహిళల వన్డే వరల్డ్కప్కు న్యూజిలాండ్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ మెగా టోర్నీకి అర్హత టోర్నీలు ఇంకా ముగియలేదు. ఈ ఏడాది జులైలో శ్రీలంకలో అర్హత టోర్నీ జరగాల్సి ఉంది. ఈ పరిస్థితుల్లో అర్హత టోర్నీ నిర్వహణ అసాధ్యంగా కనిపిస్తోంది. దీంతో 2021 మహిళల వన్డే వరల్డ్కప్ సైతం వాయిదా పడే ప్రమాదం కనిపిస్తోంది.
మే సమావేశంలో నిర్ణయం! : కరోనా వైరస్ విజృంభణతో ఐసీసీ సమావేశాలు సైతం రద్దుగా ముగిశాయి. కానీ మే 8-10న దుబారులోని ఐసీసీ కార్యాలయంలో త్రైమాసిక సమావేశాలు జరగాల్సి ఉంది. కరోనా వైరస్ కట్టడి చేయబడితే, తొలిసారి ఐసీసీ సభ్యులు ముఖాముఖి సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో టీ20 వరల్డ్కప్, టెస్టు చాంపియన్షిప్, వన్డే సూపర్ లీగ్ సహా మహిళల వరల్డ్కప్ అంశాలు ఎజెండాలో ఉన్నాయి. ఐసీసీ మే సమావేశం తర్వాత క్రికెట్లో మెగా టోర్నీల భవితవ్యం ఏమిటో తేలనుంది.