Authorization
Mon Jan 19, 2015 06:51 pm
* టీ20 వరల్డ్కప్పై చిన్ననాటి కోచ్
కోల్కత : కరోనా వైరస్ మహమ్మారి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)ను వాయిదాలో పడేసింది. 2019 వరల్డ్కప్ సెమీఫైనల్స్ తర్వాత మహేంద్రసింగ్ ధోని తొలిసారి మార్చి 29న మైదానంలో అడుగు పెట్టాల్సి ఉంది. కానీ కరోనా వైరస్ దెబ్బకు ఐపీఎల్ ఏప్రిల్ 15కు వాయిదా పడింది. భారత్లో ప్రస్తుతం 21 రోజుల లాక్డౌన్ కొనసాగుతుంది. ఈ పరిస్థితుల్లో ఐపీఎల్ 13 నిర్వహణపై ఎవరు విస్పష్ట ప్రకటన చేసే స్థితిలో లేరు. ఐపీఎల్ వాయిదాతో ఎం.ఎస్ ధోని పునరాగమన ఆశలపై నీలినీడలు కమ్ముకున్నాయి. సుదీర్ఘ కాలంగా ఆటకు దూరమైన దిగ్గజ క్రికెటర్ ఐపీఎల్తో సత్తా చాటితే 2020 వరల్డ్కప్ జట్టులో స్థానం సాధిస్తాడని జట్టు కోచ్ రవిశాస్త్రి పలుసార్లు చెప్పిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మహి కెరీర్పై చిన్ననాటి కోచ్ బెనర్జీ స్పందించాడు. ' ప్రస్తుత పరిస్థితుల్లో ఐపీఎల్ రద్దు అనివార్యంగా తెలుస్తుంది. దీనిపై బీసీసీఐ ప్రకటన కోసం ఎదురుచూడాల్సిందే. ఐపీఎల్ వాయిదా జాతీయ జట్టులో ఎం.ఎస్ ధోని స్థానాన్ని కఠినతరం చేసింది. ఐపీఎల్ ఆడకపోయినా, 2020 వరల్డ్కప్ జట్టులో ధోని ఉంటాడని నా సిక్స్త్ సెన్స్ చెబుతోంది. టీ20 వరల్డ్కప్ మహి కెరీర్కు ఆఖరు కానుంది' అని కేశవ్ మహరాజ్ బెనర్జీ అన్నారు. ధోనికి చాలా కాలంగా మ్యాచ్ ప్రాక్టీస్ లేదు. కానీ అపార అనుభవజ్ఞుడు ధోనికి ఇది పెద్ద సమస్య కాదు. త్వరగానే టచ్లోకి రాగలడు. ధోని పూర్తి ఫిట్నెస్తో ఉన్నాడు. చెన్నై నుంచి తిరిగొచ్చిన తర్వాత అతడితో మాట్లాడాను. ఇంటి ఆవరణలోనే జిమ్, బ్యాడ్మింటన్ కోర్టు, రన్నింగ్ కారిడార్ ఉన్యాయి. లాక్డౌన్లోనూ ధోని ఈ సౌకర్యాలతో ఫిట్నెస్ నిలుపుకుంటున్నాడు' అని బెనర్జీ పేర్కొన్నాడు.