Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: భారత మహిళల క్రికెట్లో సుదీర్ఘ కెరీర్. 21 ఏండ్ల క్రితం 16 ఏండ్ల అమ్మాయి భారత జట్టుకు తొలిసారి ప్రాతినిథ్యం వహించింది. తాజాగా 2021 వరల్డ్కప్లో మరోసారి జాతీయ జట్టుకు నాయకత్వం వహించబోతుంది!. పొట్టి ఫార్మాట్కు దూరమైన మిథాలీరాజ్ ఇటీవల 2020 మహిళల ఐసీసీ టీ20 వరల్డ్కప్లో ఆడలేదు. అయినా, సహచర క్రికెటర్ల ఆటను దగ్గరుండి ప్రోత్సహించింది. కరోనా వైరస్ దెబ్బకు అన్ని క్రీడలతో పాటు క్రికెట్కు సైతం విరామం వచ్చింది. మహిళల క్రికెట్ భవిష్యత్పై మిథాలీరాజ్ ఏం చెబుతుందో చదవండి!.
*మెల్బోర్న్ ఫైనల్కు రికార్డు స్థాయిలో అభిమానులు హాజరయ్యారు. ఈ స్పందన చూసి ఏమనిపించింది?
నాకు తెలిసి, మహిళల క్రికెట్లో ఇది తొలి అనుభవం. 2017 వన్డే వరల్డ్కప్ ఫైనల్లో స్టేడియం నిండిన సందర్భం నా కెరీర్లో తొలి సన్నివేశం. కానీ లార్డ్స్లో పోల్చితే మెల్బోర్న్ సామర్థ్యం చాలా ఎక్కువ. 90,000 మంది అభిమానులను చూడటం గొప్ప అనుభూతి. ఓ మహిళా క్రికెటర్గా ఇది మైమరిపించిన సందర్భం. పురుషుల క్రికెట్ వరల్డ్కప్ ఫైనల్స్ మాదిరి మహిళల వరల్డ్కప్ ఫైనల్స్కు రికార్డు స్థాయి అభిమానులు వస్తారని కలలో కూడా ఊహించలేదు. అభిమానుల ఆదరణలోనే కాదు ఎన్నో విధాలుగా మహిళల క్రికెట్ పురోగతి సాధించింది. సొంత కాళ్లపై నిలబడేందుకు సిద్ధంగా ఉంది.
*మహిళల టీ20 చాలెంజ్ నుంచి మహిళల ఐపీఎల్కు చేరుకునే లక్ష్యం నెరవేరుతుందని అనుకుంటున్నారా?
వాస్తవానికి, కరోనా వైరస్ ప్రభావంతో క్రికెట్ షెడ్యూల్ ప్రస్తుతం అనిశ్చితిలో పడింది. వచ్చే ఏడాదిలోగా మహిళల ఐపీఎల్ ఆరంభిస్తారని అనుకుంటున్నాను. చిన్న స్థాయిలో, తక్కువ జట్లతో, సవరించిన నిబంధనలతో మహిళల ఐపీఎల్ను మొదలు పెడతారని భావిస్తున్నాను. భారత దేశవాళీ క్రికెట్లో లోతు లేదు. మహిళా క్రికెటర్ల కొరత ఉంది. అందుకు, తొలి సీజన్లలో ఆరుగురు విదేశీ క్రికెటర్లను అనుమతిస్తే మహిళల ఐపీఎల్ మెరుగైన ఆరంభం అందుకుంటుంది. లీగ్ నడుస్తున్న కొద్దీ మెరుగవుతుంది. ఐపీఎల్లో కనీసం 5-6 ప్రాంఛైజీలు మహిళల జట్ల కోసం ప్రయత్నాలు మొదలు పెట్టాలి. ఎందుకంటే బీసీసీఐ ఎలాగూ నాలుగు జట్లతో లీగ్ను నడిపించేందుకు (మహిళల టీ20 చాలెంజ్) సిద్ధంగా ఉంది. మహిళల ఐపీఎల్పై ఎప్పటికీ ఎదురుచూసే ధోరణిలోనే ఉండకూడదు. మైదానం పూర్తిగా నిండేందుకు, అత్యుత్తమ ప్రమాణాలు సాధించేందుకు, టెలివిజన్, ఆన్లైన్లో వీక్షకులను ఆకర్షించేందుకు మహిళల ఐపీఎల్ ఇప్పుడు మొదలు పెట్టడమే ఉత్తమం.
*మహిళల ఐపీఎల్కు ముందు భారత జట్టు టీ20 వరల్డ్కప్ సాధించాలనే వాదనలో పస ఉందని భావిస్తున్నారా?
మహిళల ఐపీఎల్కు శ్రీకారం చుట్టేందుకు, భారత్ టీ20 వరల్డ్కప్ సాధించే వరకూ వేచి చూడాలనేది సరైన వ్యూహం కాదని అనుకుంటున్నాను. మహిళల ఐపీఎల్ను ఆరంభించకుంటే, భారత్ మరో ఏడాదిని వృథా చేసుకుంటుంది. షెఫాలి వర్మ వంటి యువ సంచలనాలను కోల్పోతుంది. దేశవాళీ క్రికెట్లో లోతు లేదు కాబట్టి, మనం ఇప్పుడు అది సృష్టించాల్సిన అవసరం ఉంది. పూర్తి స్థాయి మహిళల ఐపీఎల్కు మరో 4-5 ఏండ్లు పడుతుంది. ఐసీసీ వచ్చే ఏడాది మహిళల అండర్-19 ప్రపంచకప్ ప్రవేశపెడుతోంది. అందుకోసమైనా, చాలా దేశాలు మహిళల క్రికెట్పై దృష్టి పెడతాయి. షెఫాలి వర్మనే తీసుకోండి, మహిళల టీ20 చాలెంజన్లో నా జట్టు వెలాసిటికి ప్రాతినిథ్యం వహించింది. ఇప్పుడు అంతర్జాతీయ క్రికెట్లో ఎంత స్వేచ్ఛగా ఆడుతుందో చూడండి. మహిళల ఐపీఎల్లో అటువంటి ఆణిముత్యాలను దొరకబట్టుకోవచ్చు. అంతర్జాతీయ క్రికెట్లోకి వచ్చేముందు యువ క్రికెటర్లకు ఆ అనుభవం ఐపీఎల్తో అబ్బుతుంది. ఏదిఏమైనా, టీ20 వరల్డ్కప్లో మన అమ్మాయిలు గొప్ప ప్రదర్శన చేశారు. అదే స్ఫూర్తి కొనసాగించాలి. మహిళల ఐపీఎల్ మొదలైతే ప్రతిభాన్వేషణ ఆరంభం అవుతుంది. మెన్స్ ఐపీఎల్లో ఇదే జరిగింది.
*షెఫాలి వర్మ టీ20 వరల్డ్కప్లో భారత్కు అత్యధిక పరుగులు చేసింది. షెఫాలి ప్రదర్శనపై మీ అభిప్రాయం?
భారత టీ20 వరల్డ్కప్ వేటలో అతిపెద్ద విజయం షెఫాలి వర్మ!. మహిళల టీ20 చాలెంజ్లో షెఫాలి బ్యాటింగ్కు వచ్చి పరుగులు చేసిన విధానం, ఎంతో మంది 15 ఏండ్ల అమ్మాయిలకు సాధ్యపడదు. టీ20 వరల్డ్కప్లో ఆస్ట్రేలియా పిచ్లపై షెఫాలి తన సత్తా చాటింది. బ్యాటింగ్ విభాగంపై ఒత్తిడిని గణనీయంగా తొలగించింది. షెఫాలి వర్మ బౌలర్లను బౌండరీలకు బాదిన విధానం చూసిన తర్వాత.. భవిష్యత్లో జట్టు, అభిమానులు ఆమె నుంచి మరిన్ని మెరుపులు ఆశిస్తారు.
*టీ20 వరల్డ్కప్ ప్రదర్శనతో వన్డే జట్టు ఆరంగ్రేటానికి షెఫాలి అర్హత సాధించిందంటరా?
షెఫాలి వర్మ యువ క్రికెటర్. కానీ వన్డే జట్టులోకి చోటు నిరాకరణకు అది అడ్డు కాకూడదు. వన్డే జట్టులో షెఫాలి వర్మ చేరికతో మంచి బ్యాటింగ్ విభాగం తయరైతుంది. టీ20 ఫార్మాట్లో షెఫాలి సాధించిన ఆరంభాలకు తోడు మరికొంత సమయం క్రీజులో కొనసాగలిగితే వర్మ వన్డే జట్టుకు బలం కానుంది. 20 ఓవర్ల ఆట, 50 ఓవర్లతో పోల్చితే పూర్తిగా భిన్నం. వన్డే ఫార్మాట్లో ఆరంభంలోనే వికెట్ కోల్పోవటం అంత మంచిది కాదు. షెఫాలి వర్మ తన ఫిట్నెస్పై ధ్యాస పెట్టాలి. వన్డేల్లో ప్రతి బంతినీ బాదాల్సిన పని లేదు. వన్డే వరల్డ్కప్కు ముందు 3-4 టోర్నీలు సాధ్యపడితే షెఫాలి వర్మను పరీక్షించే అవకాశం లభిస్తుంది.
*2017, 2018, 2020 ప్రపంచకప్ నాకౌట్ మ్యాచుల్లో భారత వైఫల్యంలో ఒత్తిడి పాత్ర ఎంత ఉంది?
2020 మెల్బోర్న్ ఫైనల్లో యువ క్రికెటర్లు షెఫాలివర్మ, దీప్తి శర్మలు నిండైన స్టేడియాన్ని చూసి కొంత ఒత్తిడిలో పడి ఉంటారు. కొత్త బంతితో బౌలింగ్ చేసే దీప్తి శర్మ తొలి ఓవర్లోనే మూడు ఫుట్టాస్లు వేసి ఉండాల్సింది కాదు. ఆమె ఒత్తిడికి గురైందని చెప్పడానికి అది చాలు. ఆతిథ్య జట్టుగా ఆస్ట్రేలియాపైనా తీవ్ర ఒత్తిడి నెలకొంది. ఒత్తిడి సమయాల్లో మనం ఎలా స్పందిస్తామో అదే ఫలితాన్ని నిర్దేశిస్తుంది. మెల్బోర్న్ వంటి మెగా మ్యాచులకు స్పష్టమైన దృక్పథం కలిగి ఉండటం ఎంతో అవసరం.
*భారత మహిళల జట్టుకు స్పోర్ట్స్ సైకాలజిస్ట్ సేవలు అవసరం అని భావిస్తున్నారా?
మహిళల జట్టు సహాయక సిబ్బందిలోకి సైకాలజిస్ట్ రావటం కచ్చితంగా మేలు చేస్తుంది. గత 3-4 ఏండ్లతో పోల్చితే భారత మహిళా క్రికెటర్లు ఆడే మ్యాచులు సంఖ్య ఇప్పుడు బాగా పెరిగింది. విదేశాల్లో దేశవాళీ లీగ్లు జరుగుతుండటంతో, షెడ్యూల్ బిజీగా మారింది. ఇటువంటి సమయంలో స్పోర్ట్స్ సైకాలజిస్ట్ సేవలు క్రికెటర్లకు ఎంతో ఉపయోగకరం. ఏడాది పొడవునా నిపుణులు జట్టుతో ఉండాల్సిన పనిలేదు, అలాగని ఐసీసీ టోర్నీల్లో వెంట ఉంటే చాలు అనలేం. ఎందుకంటే జట్టు నిర్మాణం ఐసీసీ టోర్నీలు లేని సమయంలోనే జరుగుతుంది.
మహిళల క్రికెట్లో ఎన్నో మార్పులు జరుగుతున్నాయి. 16 ఏండ్ల వయసులో మ్యాచుల కోసం రైళ్లలో ప్రయాణం చేశాను. ఇప్పుడు 16 ఏండ్ల అమ్మాయిలు విమానాల్లో తిరుగుతున్నారు. మహిళల క్రికెట్లో వచ్చిన మార్పు పట్ల ఓ క్రికెటర్గా ఎంతో సంతోషిస్తున్నాను. మహిళల క్రికెట్ను పురుషుల క్రికెట్తో సమానం చూసే రోజు చూసేందుకు నేను బతికే ఉంటానని ఆశిస్తున్నాను.
*మహిళల టీ20 చాలెంజ్, మహిళల ఐపీఎల్లో ఆడటం మీ ప్రణాళికల్లో ఉన్నాయా?
అవును. మహిళల టీ20 చాలెంజ్ లేదా మహిళల ఐపీఎల్లు నా సన్నద్ధతకు ఉపయోగపడతాయి. మ్యాచ్ ప్రాక్టీస్కు ఏదీ సాటిరాదు. నేను ఇప్పుడు వన్డేల్లోనే ఆడుతున్నాను. ఫార్మాట్ ఏదైనా.. గేమ్ టచ్లో ఉండేందుకు ఇది ఎంతగానో ఉపకరిస్తుంది. కరోనా వైరస్ మహమ్మారి గడ్డు పరిస్థితులు ముగిసిన తర్వాత, వన్డే ద్వైపాక్షిక సిరీస్ల్లో ఆడేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను.