Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ముంబయి
క్రీడా ప్రపంచం నిలిచిపోయింది. ప్రపంచ క్రికెట్కు ఒక్కసారిగా బ్రేక్ పడింది. కరోనా వైరస్ (కోవిడ్-19) దెబ్బకు భారత్లో సహా ఇతర క్రికెట్ దేశాల్లో ఆటకు అంతరాయం తప్పలేదు. భారత్లో 21 రోజుల లాక్డౌన్తో క్రికెటర్లు అందరూ ఇండ్లకే పరిమితం అయ్యారు. తీరిక లేని క్రికెట్తో అలసిపోయిన క్రికెటర్లకు మహమ్మారి మూలంగా లభించిన విరామం నిజానికి ఆహ్వానించదగినదే అని భారత క్రికెట్ జట్టు చీఫ్ కోచ్ రవిశాస్త్రి అంటున్నాడు.
2019 వరల్డ్కప్ కోసం మే 24న ముంబయి నుంచి బయల్దేరిన టీమ్ ఇండియా.. తాజాగా న్యూజిలాండ్ పర్యటన వరకూ బిజీగా గడిపింది. ఐర్లాండ్, ఇంగ్లాండ్లతో వన్డే, టీ20 సిరీస్లు ఆ తర్వాత వరల్డ్కప్ మెగా ఈవెంట్. ఇంగ్లాండ్ నుంచి వచ్చీ రాగానే కరీబియన్ పర్యటన. ఆ తర్వాత స్వదేశంలో రెండు నెలల పాటు దక్షిణాఫ్రికా, శ్రీలంక, బంగ్లాదేశ్లతో సిరీస్లు. ఊపిరీ పీల్చుకునే విరామం సైతం లేకుండానే ఆ వెంటనే న్యూజిలాండ్ పర్యటన. ఐపీఎల్కు ఉన్న కాసింత విరామ సమయంలో దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ (వాయిదా పడింది)లతో కోహ్లిసేన బిజీగా గడిపింది. గత పది మాసాలుగా తీరిక లేకుండా క్రికెట్ ఆడుతున్న కోహ్లిసేనకు ఇప్పుడు కోవిడ్-19 మహమ్మారి కారణంగా లభించిన విరామం ఎంతో ఆహ్వానించదగిన విశ్రాంతి అని భారత క్రికెట్ జట్టు చీఫ్ కోచ్ రవిశాస్త్రి అన్నాడు. మైకెల్ ఆర్థరన్, నాసిర్ హుస్సేన్, రాబ్ కేలతో స్కై స్పోర్ట్స్ పోడ్కాస్ట్లో రవిశాస్త్రి ఈ వ్యాఖ్యలు చేశాడు.
10 రోజులైనా ఉండలేదు! : కోవిడ్-19 వల్ల వచ్చిన ఈ విరామం బాధపడాల్సినది కాదు. న్యూజిలాండ్ పర్యటన ముగిసిన తర్వాత కొంత మంది ఆటగాళ్లు మానసికంగా అలసిపోయారు. ఫిజికల్గా ఫిట్నెస్ కోల్పోయారు. గాయాల పాలయ్యారు. గత పది నెలలుగా టీమ్ ఇండియా ఆడిన క్రికెట్ ఆటగాళ్లపై ఈ భారం మోపింది. నేను, సహాయక సిబ్బందిలో మరికొంత మే 23న వరల్డ్కప్ కోసం ఇంగ్లాండ్కు బయల్దేరాం. అప్పటి నుంచి ఇంటి దగ్గర మేం గడిపింది కేవలం 10-11 రోజులే. జట్టులో కొంత మంది క్రికెటర్లు మూడు ఫార్మాట్లలో ఆడారు.వారిపై ఇంక ఎంత ప్రభావం పడిందో ఆలోచించండి. మైదానంలో ఉంటూ టీ20 నుంచి టెస్టు ఫార్మాట్కు పరకాయం ప్రవేశం చేస్తూ..విపరీతంగా ప్రయాణాలు ఎంతో ప్రభావం చూపాయి. ఇంగ్లాండ్ నుంచి వెస్టిండీస్కు వెళ్లాం. దక్షిణాఫ్రికాతో మొదలైన సిరీస్తో రెండు నెలలు స్వదేశంలో ఆడాం. ఆ తర్వాత 45 రోజుల న్యూజిలాండ్ పర్యటన. గత పది మాసాలు భారత జట్టుకు ఎంతో కఠినం. ఆటగాళ్లకు ఈ విరామం ఆహ్వానించదగిన విశ్రాంతి.
ఈ పరిస్థితి ఊహించాం : నిజానికి చెప్పాలంటే 21 రోజుల దేశవ్యాప్త లాక్డౌన్ షాక్కు గురిచేసింది. దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ నిమిత్తం రోడ్లపైకి వచ్చినప్పుడే.. ఏదో జరుగబోతుందని ముందుగానే అంచనా వేశాం. వ్యాధి అప్పుడప్పుడే వ్యాప్తి చెందుతోంది. రెండో వన్డేను రద్దు చేయగానే, ఏదో జరుగుతుందని అర్థమైంది. ఆ తర్వాత లాక్డౌన్ సంభవించింది. ఇలాంటి పరిస్థితి వస్తుందనే ఆటగాళ్లు న్యూజిలాండ్లోనే పసిగట్టారు. సింగపూర్ నుంచి వచ్చేపోయే విమానాలతో ఒకింత భయం అక్కడ నెలకొంది. న్యూజిలాండ్ నుంచి భారత్కు సరైన సమయంలో వచ్చాం. అప్పటికి న్యూజిలాండ్లో రెండు కేసులే నమోదయ్యాయి. ఇప్పుడు ఆ సంఖ్య 300కు చేరుకుంది. స్వదేశానికి మేం వచ్చిన రోజు నుంచే విమానాశ్రయాల్లో స్క్రీనింగ్ మొదలు పెట్టారు.
క్రికెట్ చిట్టచివరి అంశం! : కరోనా వైరస్ మరింత వ్యాప్తి చెందకుండా, ముందస్తు నివారణ జాగ్రత్తలు తీసుకునేందుకు ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు క్రీడాకారులు మంచి పాత్ర పోషించారు. క్రీడాకారులుగా క్రికెటర్లపై ఎంతో బాధ్యత ఉంది. అందుకు ఇప్పుడు మా అందరి మదిలో క్రికెట్ది చిట్టచివరి స్థానం. అందరం సురక్షితంగా ఉండటమే కాదు మిగతా వారినీ సురక్షితంగా ఉంచటం చాలా ముఖ్యం. ప్రజలకు ఆ అవగాహన కల్పించాలి. విరాట్ కోహ్లి సహా ఇతర క్రికెటర్లు ఆ పని చేశారు. సోషల్ మీడియా వేదికగా పోస్ట్లు పెట్టారు. ఇది ఎంతో సీరియస్ వాతావరణం అని, కొంత కాలం క్రికెట్కు విరామం తప్పదనే సంగతి క్రికెటర్లకు తెలుసు.
జట్టుకు నాయకుడే బాస్ : జట్టుకు కెప్టెనే బాస్. ఈ విషయాన్ని నేను ఎల్లప్పుడూ విశ్వసిస్తాను. నాకు తెలిసి సహాయక సిబ్బంది పాత్ర, ఆటగాళ్లను అత్యుత్తమ మార్గంలో భయం లేని పరిస్థితుల్లో మెరుగైన ప్రదర్శన చేసేవిధంగా తయారు చేయటం. జట్టును నాయకుడు ముందుండి నడిపిస్తాడు. సహాయక సిబ్బంది పాత్ర, కెప్టెన్ భారాన్ని తగ్గించటం. మైదానంలో కథానాయకుడు పూర్తిగా కెప్టెనే. ఫిట్నెస్ విషయానికొస్తే, నాయకత్వం నుంచే మార్పు మొదలైంది. ఆ పని విరాట్ కోహ్లి చేశాడు. ఓ ఉదయం లేవగానే కోహ్లితో నా వద్దకు వచ్చి ఓ మాట అన్నాడు. క్రికెట్లో నేను కొనసాగాలంటే, ప్రపంచంలోనే ఫిట్గా ఉన్న ప్లేయర్గా ఉండాలి. అత్యుత్తమ జట్లతో, అన్ని పరిస్థితుల్లో ఆడగలగాలి. అందుకు అనుగుణంగా అతడు తన శరీరాన్ని మలచుకున్నాడు. అది కేవలం ట్రైనింగ్కు పరిమితమైనది కాదు. కచ్చితమైన ఆహార నియమాలు పాటించాడు. అతడిలో మార్పు ఎప్పటికప్పుడు చూస్తూనే ఉన్నాను. ఓ రోజు వచ్చి నేను శాకాహారిగా మారిపోయాను అన్నాడు. కెప్టెనే ముందుండి మార్పును తీసుకొస్తే, సహచరుల్లో స్ఫూర్తి రగులుతుంది. భారత జట్టుకు ప్రధానమైన ఫార్మాట్ టెస్టు క్రికెట్. టెస్టుల్లో అత్యున్నత ప్రమాణాలను నెలకొల్పాలని అనుకుంటున్నాం అని రవిశాస్త్రి అన్నాడు.