Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-టోక్యో ఒలింపిక్స్ నయా షెడ్యూల్ విడుదల
-జులై 23- 8 ఆగస్టు, 2021లో నిర్వహణ
-ఆతిధ్య దేశంపై రూ. 3 లక్షల కోట్ల భారం
నవతెలంగాణ-టోక్యో
కరోనా వైరస్ (కోవిడ్-19) మహమ్మారి వేగంగా వ్యాపిస్తూ, ప్రపంచాన్ని వణికిస్తోంది. కరోనా వైరస్ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా క్రీడా టోర్నీలు వాయిదా పడ్డాయి. ప్రతిష్టాత్మక ఎన్బీఏ, యూరోకప్, ఐపీఎల్లు సైతం వాయిదా పడ్డాయి. అయినా, టోక్యో ఒలింపిక్స్ షెడ్యూల్ ప్రకారం జరుగుతాయని అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ పదే పదే ప్రకటించింది. సభ్య దేశాలు ఒలింపిక్స్ను బహిష్కరించే సాహాసం చేస్తే గానీ ఐఓసీలో కదలిక రాలేదు.
2020 ఒలింపిక్స్ను వాయిదా వేయటంలో చేసిన తాత్సారం, నూతన షెడ్యూల్ విడుదల విషయంలో అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) చేయలేదు. అంతర్జాతీయ క్రీడా సమాఖ్యలు వార్షిక క్యాలెండర్లు పున రూపొందించుకోవాల్సిన తరుణంలో వాయిదా నిర్ణయం వెలువడిన వారంలోపే నూతన షెడ్యూల్ను ప్రకటించింది. 2020లో జులై 24-9 ఆగస్టున విశ్వ క్రీడలు జరగాల్సి ఉండగా.. 2021లో ఓ రోజు ముందుగా 23 జులై-8 ఆగస్టున జరుగనున్నాయి.
2020 టోక్యో ఒలింపిక్స్ నూతన షెడ్యూల్ విడుదలైంది. కరోనా వైరస్ మహమ్మారితో ఏడాది పాటు వాయిదా పడిన టోక్యో ఒలింపిక్స్ వచ్చే ఏడాదిలో ఓ రోజు ముందుగానే ఆరంభం కానుంది. ఈ ఏడాది వాస్తవ షెడ్యూల్ ప్రకారం జులై 24న ఆరంభమై, ఆగస్టు 9న ముగియాల్సి ఉంది. కోవిడ్-19 మహమ్మారి ఒలింపిక్స్ చరిత్రలోనే తొలి వాయిదాను సృష్టించింది. దీంతో టోక్యో ఒలింపిక్స్ను 2021లో టోక్యో 2020 పేరుతోనే నిర్వహించనున్నారు. నూతన షెడ్యూల్ సైతం వేసవి సీజన్లోనే జరుగనుంది. అయితే, వాస్తవ షెడ్యూల్కు కేవలం ఒక్క రోజు ముందుగా 2021లో క్రీడలు షురూ కానున్నాయి. జులై 23న ఆరంభ వేడుకలతో టోక్యో ఒలింపిక్స్ మొదలు కానుంది. ఓ రోజు ముందుగా ఆగస్టు 8నే ముగింపు వేడుకలతో ముగియనుంది. 2020 షెడ్యూల్, 2021 షెడ్యూల్లో వారాల విషయంలో ఎటువంటి మార్పు లేదు. ఈ ఏడాది సైతం ఒలింపిక్స్ శుక్రవారం మొదలై, ఆదివారం ముగియాలి. వచ్చే ఏడాది సైతం శుక్రవారంతో మొదలై, ఆదివారంతో ముగియనుంది. ఈ మేరకు టోక్యో ఒలింపిక్స్ అధ్యక్షుడు యషిరో మోరె ప్రకటించారు. అంతర్జాతీయ ఒలింపిక్స్ కమిటీ (ఐఓసీ) అధ్యక్షుడు థామస్ బాచ్ ఆమోదంతో నిర్వహణ కమిటీ నూతన షెడ్యూల్ను అధికారికంగా ప్రకటించింది. ఆరంభ వేడుకల రోజు (జులై 23) మినహాయిస్తే 16 రోజుల పాటు ప్రపంచ క్రీడా పండుగ జరుగనుంది. 2020 షెడ్యూల్ సైతం ఆరంభ వేడుకలను మినహాయించి 16 రోజుల పాటు క్రీడలు జరిగేలా రూపొందించారు. పారాలింపిక్స్ ఆగస్టు 24-సెప్టెంబర్ 5, 2021న నిర్వహించనున్నారు.
ముందుగానే అనుకున్నా..! : కరోనా వైరస్ మహమ్మారి ప్రభావం ఏడాది పాటు ఉంటుందని ఎవరూ అనుకోవటం లేదు. దీంతో జపాన్ కాస్త ముందుగానే ఒలింపిక్స్ నిర్వహణకు పూనుకుంది. దీంతో అదనంగా పడనున్న వ్యయ భారాన్ని తగ్గించుకోవాలనేది జపాన్ ఆలోచన. అందుకోసం 2021 వసంత రుతువులో ఒలింపిక్స్ నిర్వహణ సరైన సమయం అనుకుంది. జపాన్లో ఈ సీజన్లో చెర్రీ బాస్లమ్స్ పాపులర్. రెండు వారాల పాటు ఉంటే చెర్రీ బ్లాసమ్స్లో పర్యాటకం ప్రధాన ఆకర్షణ. పర్యాటక రంగాన్ని ఊపు తీసుకురావటంతో పాటు, నిర్వహణ ఖర్చును తగ్గించుకోవటం ఒకేసారి వీలుపడుతుందని భావించింది. కానీ మెగా క్రీడలకు అథ్లెట్ల సన్నద్ధకు పూర్తి సమయం ఇచ్చేందుకు ఐఓసీ మొగ్గుచూపినట్టు సమాచారం. లేదంటే తొలిసారి సమ్మర్ ఒలింపిక్స్, స్ప్రింగ్ సీజన్లో జరిగేవి!. ' ముందుగా అనుకున్నట్టు నూతన షెడ్యూల్ సమయం వేసవిలోనే ఉండాలని మేం అంగీకరించాం. కరోనా వైరస్ కారణంగా సన్నాహాలకు సైతం కొంత సమయం అవసరం. అథ్లెట్ల అర్హత టోర్నీలు, ఎంపికకు సైతం సమయం అవసరం. అంతర్జాతీయ క్రీడా క్యాలెండర్కు పెద్ద అంతరాయం కలిగించకుండా ఉండేలా నూతన షెడ్యూల్ను రూపొందించాం' అని టోక్యో ఒలింపిక్ క్రీడల అధ్యక్షుడు యషిరో మోరె తెలిపారు.
రూ. 3 లక్షల కోట్ల భారం : కరోనా వైరస్ మహమ్మారి కారణంగా టోక్యో ఒలింపిక్స్ను వాయిదా వేయాలని అందరూ కోరుకున్నారు. ఏడాది పాటు వాయిదా వేస్తున్నట్టు ప్రకటన వెలువడగానే హర్షం వ్యక్తం చేశారు. కానీ భారీ బడ్జెట్తో కూడిన ఒలింపిక్స్ వాయిదాతో ఎదురయ్యే వ్యయ భారాన్ని ఎవరు భరించాలనే విషయంలో స్పష్టత రావాల్సి ఉంది. 2021లో క్రీడల నిర్వహణకు హౌటల్స్, టికెట్లు, ఆతిథ్య వేదికలు, రవాణా నిర్వహణ కమిటీకి అతి పెద్ద సవాల్ విసరనున్నాయి. ఇప్పటికే ఒలింపిక్ క్రీడల టికెట్లు కొనుగోలు చేసిన వారికి డబ్బులు తిరిగి చెల్లించటంపై ఎటువంటి సమాచారం లేదు. కొత్తగా 2021 షెడ్యూల్ బుకింగ్స్కు నిర్వహణ కమిటీ నుంచి గ్యారెంటీలు అడిగే అవకాశం తలెత్తనుంది.
2020 ఒలింపిక్స్ కోసం జపాన్ రూ. 9-10 లక్షల కోట్లు (12.6 బిలియన్ అమెరికన్ డాలర్లు) వెచ్చించింది. ఇందులో 60 శాతం ప్రభుత్వాలు భరిస్తున్నాయి. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ, ఇతర 100 మంది స్పాన్సర్లు కొంత కొత్తంలో భరిస్తున్నారు. అత్యుత్తమ సన్నద్ధత, అధునాతన స్టేడియాలు, ప్రపంచస్థాయి సౌకర్యాలు, సాంకేతికత హంగులతో టోక్యో ఒలింపిక్స్ చరిత్రలో అత్యుత్తమ విశ్వ క్రీడలుగా నిలువనుందని ఐఓసీ పలుమార్లు అభిప్రాయపడింది. ఒలింపిక్స్ ఏడాది పాటు వాయిదా పడటంతో స్టేడియాలు ఖాళీగా ఉండనున్నాయి. మళ్లీ ఏడాది తర్వాత క్రీడల కోసం నవీకరణ పనులు చేయాల్సి ఉంటుంది. దీంతో నిర్వహణ కమిటీపై మరో రూ. 3 లక్షల కోట్ల వరకు అదనపు వ్యయ భారం పడుతుంది. ఇంత పెద్ద మొత్తాన్ని ఏ విధంగా భరించాలి, ఎవరు భరించాలనే అంశంపై స్పష్టత లేదు. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ నుంచి ఎటువంటి భరోసా లభించలేదు. జపాన్ ప్రభుత్వం ప్రస్తుత మాంద్యం పరిస్థితుల్లో ముందుకొచ్చే అవకాశాలు స్వల్పం. దీంతో నిర్వహణ కమిటీ తీవ్ర ఒత్తిడిలో పడింది. అదనపు వ్యయ భారంపై త్వరలోనే స్పష్టత వస్తుందని టోక్యో ఒలింపిక్స్ అధ్యక్షుడు మోరె ఆశిస్తున్నా, జపాన్కు ఇది పెద్ద తలనొప్పిగా మారే ప్రమాదం లేకపోలేదు.