Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-ఆడితేనే డబ్బులంటున్న ప్రాంఛైజీలు
ముంబయి : నో ప్లే, నో మనీ. ఐపీఎల్ ప్రాంఛైజీలు ప్రస్తుతం ఇదే మాట చెబుతున్నాయి. బీసీసీఐ నిబంధనలు సైతం ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయని ప్రాంఛైజీలు అంటున్నాయి. ఐపీఎల్ 13 వాయిదాతో ఆటగాళ్ల కాంట్రాక్టు సొమ్ముపై ప్రాంఛైజీలు స్పష్టతతోనే ఉన్నాయి. ' బీసీసీఐ నిబంధనల ప్రకారం టోర్నీ ఆరంభానికి ముందు 15 శాతం, లీగ్ మధ్యలో 65 శాతం చెల్లించాలి. మిగతా 20 శాతం డబ్బులను లీగ్ ముగిసిన అనంతరం నిర్దేశిత సమయంలో చెల్లించాలి. ఇప్పుడు లీగ్ ఆరంభం కాలేదు కాబట్టి, ఏ ఆటగాడికి కాంట్రాక్టు డబ్బులను ప్రాంఛైజీలు చెల్లించలేదు. ఐపీఎల్ ఆగిపోతే బీసీసీఐకి వార్షికంగా రూ. 3000 కోట్ల నష్టం వాటిల్లనుంది. క్రికెట్ ఆడితేనే బోర్డుకు ఆదాయం. క్రికెట్ లేకుంటే ఆదాయం పూర్తిగా నిలిచిపోతుంది. అంతర్జాతీయ క్రికెటర్లతో పాటు దేశవాళీ ప్లేయర్లపై ఈ ప్రభావం ఉంటుంది. ఈ సీజన్లో ఐపీఎల్ కాంట్రాక్టులు దక్కించుకుని, జీవితం మలుపు తిరిగిందని అనుకుంటున్న వర్థమాన క్రికెటర్లపై మానసికంగా ఈ ప్రభావం ఎక్కువగా పడుతుంది. ఒక్కో ప్రాంఛైజీ ఆటగాళ్లకు రూ. 75-85 కోట్లు చెల్లించాల్సి ఉంది. లీగ్ జరుగకుండా, ఇంత మొత్తం ప్రాంఛైజీలు ఎందుకు భరిస్తాయి?' అని బీసీసీఐ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. ఫుట్బాల్ లీగ్లలో ఇప్పటికే వేతన కోత విధించటంతో ఐపీఎల్ ప్రాంఛైజీలు సైతం అదే బాటలో నడువనున్నాయని తెలుస్తోంది.