Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-అర్హత టోర్నీలకు మరింత సమయం
-సైనా నెహ్వాల్, శ్రీకాంత్లకు భలే చాన్స్
నవతెలంగాణ క్రీడా విభాగం
ఒలింపిక్స్లో భారత పతక అవకాశాలు అనగానే ముందు వరుసలో బ్యాడ్మింటన్ క్రీడాకారులు నిలుస్తారు. 2012 లండన్ ఒలింపిక్స్లో సైనా నెహ్వాల్ కాంస్యం తీసుకురాగా, రియో ఒలింపిక్స్ నుంచి సింధు రజతంతో తిరిగొచ్చింది. బ్యాడ్మింటన్ దిగ్గజ దేశాలు చైనా, జపాన్, కొరియా, మలేషియాలకు దీటుగా భారత్ సూపర్ పవర్గా ఎదిగింది. టోక్యో ఒలింపిక్స్లో భారత షట్లర్లు కనీసం రెండు పతకాలు సాధిస్తారనే అంచనాలు నెలకొన్నాయి. ఒలింపిక్స్ సమీపించిన తరుణంలో భారత రాకెట్లు ఒక్కసారిగా డీలా పడ్డారు. పతక ఆశలపై అపనమ్మకం కలిగేలా చేశారు. ఇప్పుడు టోక్యో ఒలింపిక్స్ ఏడాది వాయిదా పడటంతో అత్యుత్తమ ఫామ్ అందుకునేందుకు భారత బ్యాడ్మింటన్ షట్లర్లకు మంచి అవకాశం లభించింది.
సైనా నెహ్వాల్, కిదాంబి శ్రీకాంత్.. భారత స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారులు. ప్రపంచ బ్యాడ్మింటన్ ర్యాంకింగ్స్లో అగ్రస్థానం అందుకున్న ఘనత ఈ ఇద్దరి సొంతం. రియో ఒలింపిక్స్లో పతక ఆశలు రేపిన శ్రీకాంత్, మెన్స్ సింగిల్స్లో క్వార్టర్ఫైనల్స్ వరకూ చేరుకున్నాడు. సైనా నెహ్వాల్ రెండో ప్రయత్నంలోనే కాంస్య పతకం కొట్టేసింది. భారత బ్యాడ్మింటన్ దిగ్గజంగా పిలుపించుకునే అర్హత సాధించిన సైనా నెహ్వాల్, వీడ్కోలు ముంగిట నిలిచింది. రియో ఒలింపిక్స్లోనే గాయంతో ఇబ్బంది పడిన సైనా నెహ్వాల్ తర్వాత శస్త్రచిక్సితలు, రిహాబిలేషన్కే ఎక్కువ సమయం కేటాయించింది. కొన్ని టోర్నీల్లో మెరుపు ప్రదర్శనతో విజయాలు సాధించినా.. గతేడాది సైనా నెహ్వాల్ ఫామ్ పేలవం. ఒకే ఏడాదిలో నాలుగు సూపర్ సిరీస్ టోర్నీలు నెగ్గిన కిదాంబి శ్రీకాంత్ దూకుడుకు బ్రేక్ పడింది. టోక్యో ఒలింపిక్స్ మెడల్స్ పక్కనపెడితే, టోక్యో ఒలింపిక్స్కు నేరుగా అర్హత సాధించటం కష్టతరంగా మారింది. కరోనా వైరస్ (కోవిడ్-19) కారణంగా టోక్యో ఒలింపిక్స్ ఏడాది పాటు వాయిదా పడ్డాయి. 2020 జులై 24-9 ఆగస్టున జరగాల్సిన విశ్వ క్రీడలు వచ్చే ఏడాది జులై 23-8 ఆగస్టున జరుగనున్నాయి. మన రాకెట్లు ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడుతున్న సమయంలో ఒలింపిక్స్ వాయిదా బ్యాడ్మింటన్కు వరంగా మారిందని చెప్పవచ్చు!.
పి.వి. సింధు మాత్రమే నేరుగా.. : 2020 టోక్యో ఒలింపిక్స్కు పి.వి సింధు మాత్రమే నేరుగా అర్హత సాధించేందుకు రంగం సిద్ధం చేసుకుంది. ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య నిబంధనల ప్రకారం ర్యాంకింగ్స్లో తొలి 16 స్థానాల్లో నిలిచిన షట్లర్లు నేరుగా ఒలింపిక్స్కు అర్హత సాధించనున్నారు. మరో 16 స్థానాలను అర్హత టోర్నీలు, ఇతర సమీకరణాలు (ప్రతి ఖండం నుంచి ప్రాతినిథ్యం ఉండే నిబంధనలు) ఆధారంగా భర్తీ చేస్తారు. ప్రస్తుతం ర్యాంకింగ్స్లో పి.వి సింధు మాత్రమే టాప్-16లో కొనసాగుతోంది. పి.వి సింధు వరల్డ్ నం.6గా ఒలింపిక్స్లో కనీసం ఆరో సీడ్ ఖాయం చేసుకుంది. కానీ సైనా నెహ్వాల్ పేలవ ఫామ్తో 20వ స్థానానికి పడిపోయింది. ఓ విభాగంలో ఓ జాతీయ ఒలింపిక్ సంఘం నుంచి గరిష్టంగా ముగ్గురు షట్లర్లు ప్రాతినిథ్యం వహించే అవకాశం ఉంది. టాప్-16లో నిలిస్తే ఇద్దరు, ర్యాంక్ 17 నుంచి ఒకరు మాత్రమే ఒలింపిక్స్లో పాల్గొనేందుకు అర్హత సాధిస్తారు. మహిళల సింగిల్స్లో రేసులో ఉన్నదే ఇద్దరు. సింధు బెర్త్ ఖాయం కాగా, సైనా నెహ్వాల్ అర్హత సాధించేందుకు ఆరాటపడుతోంది. 2019లో తొలి టైటిల్ సైనా నెహ్వాలే సాధించినా, ఆ తర్వాత ఏ టోర్నీలోనూ మెరువలేదు. పి.వి సింధు ఆగస్టులో జరిగిన వరల్డ్ చాంపియన్షిప్స్లో విజయం సాధించినా.. తర్వాతి టోర్నీల్లో దారుణ వైఫల్యం చెందింది. మెగా టోర్నీల్లో సత్తా చాటే రికార్డు, ఒలింపిక్ బెర్త్ ఖాయమైన నేపథ్యంలో సింధుపై పెద్ద ఆందోళన లేదు. కానీ కెరీర్కు ఘనంగా వీడ్కోలు పలకాలని ఎదురుచూస్తున్న సైనా నెహ్వాల్ టోక్యో ఒలింపిక్స్పై భారీ ఆశలు పెట్టుకుంది. 2008 బీజింగ్ ఒలింపిక్స్లో క్వార్టర్ఫైనల్స్కు చేరిన సైనా, 2016లో గ్రూప్ దశలోనే నిష్క్రమించింది. సుదీర్ఘ కెరీర్కు టోక్యో మెడల్తో వీడ్కోలు పలకాలని సైనా కలలు కంటోంది. ప్రస్తుతం సైనా నెహ్వాల్ పూర్తి ఫిట్నెస్ సాధించలేదు. అదే సమయంలో మంచి ఫామ్లో లేదు. ఈ విరామం సైనా నెహ్వాల్ మానసికంగా, శారీరకంగా ధృడంగా తయారయ్యేందుకు ఉపయోగపడనుంది.
శ్రీకాంత్, సాయిప్రణీత్, కశ్యప్ ఆశలు : ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య ర్యాంకింగ్స్ను స్తంభింపజేసింది. దీంతో మార్చి 17 నాటికి ఉన్న ర్యాంకులే తదుపరి టోర్నీలు జరిగే వరకూ కొనసాగుతాయి. దీంతో టాప్-16లోకి ఇద్దరు షట్లర్లు దూసుకొచ్చారు. బి. సాయిప్రణీత్ 13 స్థానంలో నిలువగా, కిదాంబి శ్రీకాంత్ 14వ స్థానంలో కొనసాగుతున్నాడు. సీనియర్ షట్లర్ పారుపల్లి కశ్యప్ 24వ స్థానంలో నిలిచాడు. మెన్స్ సింగిల్స్లో ఎవరూ మెరుగ్గా రాణించటం లేదు. హెచ్.ఎస్ ప్రణరు సైతం రేసులో వెనుకంజలో నిలిచాడు. టాప్-16లో నిలిచిన ఇద్దరు అర్హత సాధించనున్నారు. దీంతో తొలి రెండు స్థానాల కోసం సాయిప్రణీత్, శ్రీకాంత్ ముందంజలో నిలువగా ప్రణరు, కశ్యప్లు ఆశలు పెట్టుకున్నారు. నిబంధనల ప్రకారం ఏప్రిల్ 30, 2020 వరకు ర్యాంకింగ్స్ను ఒలింపిక్ అర్హతకు కటాఫ్ తేదిగా నిర్దేశించారు. ఇప్పుడు ర్యాంకింగ్స్ నిలిపివేయటం, టోర్నీలు ఆగిపోవటంతో తదుపరి టోర్నీలు ఆరంభమయ్యాక అర్హత ప్రక్రియ మొదలు కానుంది. ఏప్రిల్ 30 వరకు జరగాల్సిన టోర్నీలను మళ్లీ నిర్వహిస్తే ఆ ప్రదర్శనను పరిగణనలోకి తీసుకుని నూతన ర్యాంకింగ్స్లు రూపొందిస్తారు. ఒలింపిక్స్ ఏడాది పాటు వాయిదా పడినినంత మాత్రనా, అర్హత ప్రక్రియను ఏప్రిల్ 30, 2021కు పొడగించరు. దీంతో 45 రోజుల్లో వాయిదా పడిన టోర్నీల్లో మెరుగైన ప్రదర్శన చేయటమే భారత షట్లర్ల ముందున్న తక్షణ కర్తవ్యం.
డబుల్స్ విభాగంలో భారత్కు పెద్దగా అవకాశాలు లేవు. పురుషుల డబుల్స్లో సాత్విక్సాయిరాజ్ రాంకిరెడ్డి, చిరాగ్ శెట్టి జోడీ పదో స్థానంలో కొనసాగుతుంది. కనీసం రెండు టోర్నీల్లో మెప్పించినా ఈ జోడీ టాప్-8లో నిలువనుంది (డబుల్స్ విభాగంలో టాప్-8 జోడీలు అర్హత సాధిస్తాయి). మిక్స్డ్ డబుల్స్, మహిళల డబుల్స్లో భారత షట్లర్లు రెండో అవకాశంపై ఆధారపడక తప్పదు.