Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-వరల్డ్కప్ ఘనత ధోనికి దక్కటంపై అసహనం
-బహిరంగంగానే పలుమార్లు విమర్శలు
-మరోసారి సహనం కోల్పోయిన బీజేపీ ఎంపీ
నవతెలంగాణ క్రీడా విభాగం
'నా సుదీర్ఘ క్రికెట్ కెరీర్లో ఎంతో మంది కెప్టెన్లను చూశాను. నా అత్యుత్తమ కెప్టెన్ ఎం.ఎస్ ధోని' ఇదీ 2011 వరల్డ్కప్ విజయానంతరం క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ చెప్పిన మాట.
భారత క్రికెట్ చూసిన అత్యుత్తమ కెప్టెన్గా సౌరవ్ గంగూలీ ఘనత వహించాడు. విదేశీ గడ్డపై విజయాల రుచి చూపించిన నాయకుడిగా దాదాకు ఎదురులేని రికార్డుంది. అటువంటి గంగూలీ స్వయంగా.. భారత్ క్రికెట్కు నాయకత్వం వహించిన ఉత్తమ కెప్టెన్ ఎం.ఎస్ ధోని అని కితాబు ఇవ్వకుండా ఉండలేకపోయాడు.
సహచర ఆటగాళ్ల నుంచి, సహాయక సిబ్బంది వరకూ ధోని ఔన్నత్యాన్ని పొగడకుండా ఉండలేరు. ధోని 2007 టీ20 వరల్డ్కప్ అందించిన నాటి నుంచి ఇది చూస్తూనే ఉన్నాం. ప్రతి దానికీ ఓ మినహాయింపు ఉంటుంది. ధోని విషయంలో ఆ మినహాయింపు గౌతం గంభీర్ అని చెప్పవచ్చు!
ఏప్రిల్ 2, 2011. క్రీడా భారత్ ఈ రోజు ఎన్నటికీ మరులేదు. 1983లో కపిల్దేవ్ బృందం క్రికెట్ మక్కా లార్డ్స్లో తొలి ప్రపంచకప్ అందించటం చారిత్రాత్మకం. ఆధునిక క్రికెట్లో, భారత్ సూపర్ పవర్గా ఎదిగిన రోజుల్లో సొంతగడ్డపై, ఆర్థిక రాజధాని ముంబయిలోని వాంఖడే స్టేడియంలో అశేష అభిమానుల నడుమ టీమ్ ఇండియా ప్రపంచకప్ అందుకోవటం భారత క్రికెట్ చరిత్రలోనే చిరస్మరణీయ సందర్భం. ఢిల్లీ నుంచి గల్లీ వరకు ప్రజలు వీధుల్లోకి వచ్చి క్రికెట్ ప్రపంచకప్ విజయాన్ని ఆస్వాదించారు. అప్పటి కేంద్ర ప్రభుత్వ పెద్దలు సైతం ప్రజలతో కలిసి ఢిల్లీ ఇండియా గేట్ వద్ద ఆనందాన్ని పంచుకున్న దృశ్యాలు ఇప్పటికీ తాజాగానే ఉన్నాయి. అంత గొప్ప విజయానికి గురువారంతో 9 వసంతాలు నిండాయి. దేశమంతా లాక్డౌన్లో ఉన్న వేళ, భారతావని మరోసారి తన అద్వితీయ విజయాన్ని నెమరు వేసుకుంటోంది. 2011 వరల్డ్కప్ అనగానే సహజంగానే ఎం.ఎస్ ధోని సూపర్ సిక్సర్, ఎనర్జిటిక్ రవిశాస్త్రి కామెంట్రీ గుర్తుకొస్తాయి. వరల్డ్కప్ అనంతరం సచిన్ టెండూల్కర్ను భుజాలపై ఎత్తుకున్న సహచరుల ఫోటో గత రెండు దశాబ్దాల్లోనూ ఉత్తమ స్పోర్ట్స్ మూమెంట్గా నిలిచింది. అదే విధంగా ఎం.ఎస్ ధోని సిక్సర్ బాదుతున్న సన్నివేశానికి సైతం అంతటి ప్రత్యేకత ఉంది. అందుకే 2011 వరల్డ్కప్ విజయం అనగానే అందరిలోనూ మహేంద్రుడి సిక్సర్ షాటే మెదులుతుంది. 9 ఏండ్ల వరల్డ్కప్ విజయాన్ని గుర్తు చేస్తూ ప్రముఖ క్రికెట్ వెబ్సైట్ క్రిక్ఇన్ఫో ట్విటర్లో ఓ పోస్ట్ పెట్టింది. ఎం.ఎస్ ధోని సిక్సర్ సంధిస్తున్న ఫోటోకు.. ' 2011లో ఈ రోజు (ఏప్రిల్ 2)న, కోట్లాది మంది భారతీయులను సంబరాలు చేసుకునేలా చేసింది' అని రాసింది. అనూహ్యంగా ఈ ట్వీట్కు ఓ కౌంటర్ ఎదురైంది. 2011 వరల్డ్కప్ జట్టు సభ్యుడు గౌతం గంభీర్ ఆ కౌంటర్ పోస్ట్ చేశాడు. ' కేవలం గుర్తు చేస్తున్నాను. 2011 వరల్డ్కప్ యావత్ భారత్, భారత జట్టు, సహాయక బృందం గెలిచింది. ఓ సిక్సర్ పట్ల మీకున్న వ్యామోహం అదుపు చేసుకోండి' అని గంభీర్ అసహనంగా స్పందించాడు. భారత్ క్రికెట్ అభిమానులు, భారత క్రికెటర్లు, వీరాభిమానులు అందరూ విజయాన్ని గుర్తు చేసుకుంటున్న ఆనంద సమయంలో గంభీర్ ఎందుకిలా స్పందించాడు?.
ఆ ఘనత తనకు దక్కలేదని.. : 2011 వరల్డ్కప్ విజయంలో ముఖ్య భూమిక పోషించింది ఆల్రౌండర్ యువరాజ్ సింగ్. దిగ్గజం సచిన్ టెండూల్కర్ 9 మ్యాచుల్లో 53.55 సగటుతో 482 పరుగులు చేశాడు. శ్రీలంక బ్యాట్స్మన్ తిలకరత్నె దిల్షాన్ (550) సచిన్ కంటే రెండు పరుగులు ఎక్కువ చేశాడు. భారత్ నుంచి సచిన్ తర్వాతి స్థానం గౌతం గంభీర్దే. 43.66 సగటుతో గంభీర్ 393 పరుగులు చేశాడు. నాలుగు అర్ధ సెంచరీలతో మెప్పించాడు. గ్రూప్ దశలో బంగ్లాదేశ్పై 39, ఇంగ్లాండ్పై 51, ఐర్లాండ్పై 10, నెదర్లాండ్స్పై 28, దక్షిణాఫ్రికాపై 69, వెస్టిండీస్పై 22 పరుగులు చేశాడు. క్వార్టర్ఫైనల్లో ఆస్ట్రేలియాపై 50 పరుగుల అర్ధ సెంచరీ బాదాడు. సెమీఫైనల్లో పాకిస్థాన్పై 27 పరుగులు చేశాడు. శ్రీలంకతో అంతిమ సమరంలో 97 పరుగులు చేసిన గంభీర్ శతకానికి మూడు పరుగులో నిలిచిపోయాడు. కెప్టెన్ ఎం.ఎస్ ధోనితో 109 పరుగుల భాగస్వామ్యంతో ప్రపంచకప్ భారత్ గూటికి చేరిందనే నమ్మకం కలిగే వరకు క్రీజులో కొనసాగాడు.
ఇదే సమయంలో ఎం.ఎస్ ధోని వరల్డ్కప్లో పూర్తిగా నిరాశపరిచాడు. 9 మ్యాచుల్లో మహి కేవలం 241 పరుగులే చేశాడు. గ్రూప్ దశలో బంగ్లాదేశ్పై బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. ఇంగ్లాండ్పై 31, ఐర్లాండ్పై 34, నెదర్లాండ్పై 19, దక్షిణాఫ్రికాపై 12, వెస్టిండీస్పై 22 పరుగులు చేశాడు. క్వార్టర్స్లో ఆసీస్పై ఛేదనలో 7 పరుగులే చేశాడు. సెమీఫైనల్లో పాక్పై 25 పరుగులు చేసి నిరాశపరిచాడు. వరల్డ్కప్లో పూర్తిగా తేలిపోయిన ధోని ఫైనల్లో తనను తాను ప్రమోట్ చేసుకున్నాడు. సెహ్వాగ్ (0), సచిన్ (18), విరాట్ కోహ్లి (35) పెవిలియన్కు చేరిన సమయంలో స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ను ఎదుర్కొనేందుకు ఫామ్లో ఉన్న యువరాజ్ సింగ్ (21 నాటౌట్)ను కాదని ధోని బ్యాటింగ్కు వెళ్లాడు. గంభీర్తో గొప్ప భాగస్వామ్యం నిర్మించిన ధోని.. యువరాజ్ సింగ్తో కలిసి లాంఛనం ముగించాడు. అజేయంగా 91 పరుగులతో కెప్టెన్సీ ఇన్నింగ్స్ నమోదు చేసిన ధోని, నాయకుడిగా భారత్కు వరల్డ్కప్ను అందించాడు. మరో 10 బంతులు మిగిలి ఉండగానే భారత్ 6 వికెట్ల తేడాతో ఫైనల్లో గెలుపొందింది. 28 ఏండ్ల నిరీక్షణకు తెరదించుతూ రెండోసారి వన్డే వరల్డ్కప్ అందుకుంది. ఫైనల్లో శ్రీలంక 274/6 పరుగులు చేయగా, భారత్ 277/4తో చరిత్ర సృష్టించింది. 60 ఓవర్లు, 50 ఓవర్ల ఫార్మాట్లో ప్రపంచకప్లు సాధించిన ఏకైక జట్టుగా నిలిచింది.
భారత జట్టు కెప్టెన్గా ఎం.ఎస్ ధోనికి బలమైన పునాది వేసింది టీ20 వరల్డ్కప్ విజయం. దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్, సౌరవ్ గంగూలీ, లక్ష్మణ్లు 20 ఓవర్ల ఆటలో యువకుల అవకాశం ఇవ్వటంతో ధోనికి పగ్గాలు దక్కాయి. దక్షిణాఫ్రికాలో జరిగిన ఆ టోర్నీలో భారత్ విజేతగా నిలిచింది. టీ20 వరల్డ్కప్ ఘనత సైతం ధోనికే దక్కింది. ఆ టోర్నీలోనూ యువరాజ్ సింగ్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా నిలిచాడు. 2011 వన్డే వరల్డ్కప్ విజయంలోనూ యువరాజ్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా నిలిచాడు. టీ20 వరల్డ్కప్లో స్కాట్లాండ్తో తొలి మ్యాచ్ రద్దు అయ్యింది. పాకిస్థాన్తో మ్యాచ్లో గంభీర్ డకౌట్ అయ్యాడు. న్యూజిలాండ్పై 51, ఇంగ్లాండ్పై 58, దక్షిణాఫ్రికాపై 19, సెమీఫైనల్లో ఆస్ట్రేలియాపై 24 పరుగులు చేశాడు. ఫైనల్లో పాకిస్థాన్పై 75 పరుగుల మెరుపు ఇన్నింగ్స్తో అదరగొట్టాడు. ఇదే సమయంలో ధోని గ్రూప్ దశలో పాక్పై 33, న్యూజిలాండ్పై 24, ఇంగ్లాండ్పై 10, దక్షిణాఫ్రికాపై 45, ఆస్ట్రేలియాపై 36, ఫైనల్లో 6 పరుగులు చేశాడు.
క్రీడాస్ఫూర్తి మరిచిన గౌతీ : గౌతం గంభీర్ మానసిక స్థితిపై గతంలోనే భారత జట్టుకు పనిచేసిన వ్యక్తులు స్పష్టమైన అభిప్రాయాలు వెల్లడించారు. ఆత్మనూన్యత భావంలో ఉండే గంభీర్, ఎప్పుడూ మనసులో మధన పడుతుండేవాడని సహాయక సిబ్బందిలో ఒకరు వ్యాఖ్యానించారు. బ్యాట్స్మన్గా రెండు వరల్డ్కప్లలోనూ ధోని తనకంటే తక్కువ పరుగులు చేశాడని, అయినా రెండు ప్రపంచకప్ల విజయాల ఘనత అతడికి దక్కిందని గంభీర్ బాధ అని చెప్పనక్కర్లేదు. వరల్డ్కప్ విజయం ఘనత నాకు దక్కాలని చెప్పలేక, జట్టు విజయమని గౌతీ పలుమార్లు బహిరంగంగా వెల్లడించాడు. ఎం.ఎస్ ధోనికి వరల్డ్కప్ ఘనత దక్కటం పట్ల బాహాటంగానే అసంతృప్తి వెళ్లగక్కాడు.
'2011 వరల్డ్కప్ సమయంలో జట్టు ఆందోళనలో పడింది. టోర్నీ మొత్తం డ్రెస్సింగ్రూమ్లో ఒత్తిడి కనిపించింది. కానీ ఆ పరిస్థితుల కోసం జట్టు 18 నెలలుగా సిద్ధమైంది. అందుకే వరల్డ్కప్ విజయాన్ని జట్టులోని ప్రతి ఒక్కరు సహచరులకు ఘనత ఆపాదిస్తున్నారు. ఇది అందరి విజయం' అని కెప్టెన్గా ఎం.ఎస్ ధోని గెలుపు ఘనతను పంచాడు. కెప్టెన్గా ఎం.ఎస్ ధోని లేనిదే 2011 వరల్డ్కప్ లక్ష్యం నెరవేరేది కాదని దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ స్వయంగా అభిప్రాయపడ్డాడు. జట్టు విజయాల ఘనతను సహచరులకు పంచటం, అపజయం బాధ్యతను తాను స్వీకరించటం ఎం.ఎస్ ధోని నాయకత్వ లక్షణం. బ్యాట్స్మన్గా ధోని వరల్డ్కప్లో వైఫల్యం చెందిఉండవచ్చు. కానీ అంతిమ సమరంలో అపార ఒత్తిడిని ఎదుర్కొని అజేయంగా 91 పరుగులు చేశాడు. కఠిన పరిస్థితుల్లో నాయకుడే బాధ్యత తీసుకుని ముందుకు రావటం ఎంతోమందిలో చూడలేం. నాయకత్వంలో ధోని అధ్యాయం పూర్తి భిన్నం. క్రికెట్ అంటేనే జట్టు ఆట. సమిష్టి కృషి, సమిష్టితత్వం లేనిదే విజయం సాధించలేం. గెలుపు ఘనత ఏ ఒక్కరికో ఆపాదించలేం. సర్వ సమానుల్లో కచ్చితంగా నాయకుడు అందరి కంటే ముందుంటాడు. ఈ విషయం గౌతం గంభీర్ ఎప్పటికి తెలుసుకుంటాడో?!.