Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-బ్యాంకులను సంప్రదించిన క్రికెట్ ఆస్ట్రేలియా
మెల్బోర్న్ : కరోనా వైరస్తో క్రికెట్ నిలిచిపోయింది. సమీప 2-3 నెలల్లో ఎటువంటి క్రికెట్ మ్యాచులు, టోర్నీలు జరిగే అవకాశం కనిపించటం లేదు. ఆట నిలిచిపోవటంతో క్రికెట్ బోర్డుల ఆదాయానికి భారీగా గండి పడుతోంది. రానున్న ఆర్థిక సంక్షోభాన్ని ముందే పసిగట్టిన క్రికెట్ ఆస్ట్రేలియా, బ్యాంకర్లను సంప్రదించింది. రూ. 1500 కోట్లు (200 మిలియన్ డాలర్లు) అప్పు కావాలని బ్యాంకులను కోరుతుంది. ఈ మేరకు సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్ పత్రిక వార్త ప్రచురించింది. 2020 వేసవి సీజన్ను పూర్తిగా నష్టపోనున్న ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు.. అక్టోబర్లో జరగాల్సిన టీ20 ఐసీసీ వరల్డ్కప్ను సైతం నష్టపోయే ప్రమాదం కనిపిస్తోంది. ఆస్ట్రేలియా ఆరు నెలలు తన అంతర్జాతీయ సరిహద్దులను మూసివేసిన నేపథ్యంలో వరల్డ్కప్ నిర్వహణ, సన్నాహాక ఏర్పాట్లకు ఆటంకం ఏర్పడుతోంది. ప్రపంచకప్ నిర్వహణతో ఐసీసీ నుంచి సీఏకు భారీ మొత్తంలో నగదు సమకూరేది. ఇప్పుడు వరల్డ్కప్ నిర్వహణ సందిగ్ధంలో పడగా, సీఏ ఆర్థిక వనరులను సమకూర్చుకునే పనిలో పడింది. క్రికెట్ ఆస్ట్రేలియా కాంట్రాక్టుల రూపంలో ఆటగాళ్లకు భారీ పారితోషికాలు అందిస్తోంది. క్రికెట్ బోర్డులో ఎగ్జిక్యూటివ్స్, సీఈవోలు 20 శాతం వేతన కోతకు అంగీకరించారు. అయినా, రానున్న రోజుల్లో బోర్డు కార్యక్రమాలు సజావుగా సాగేందుకు రూ. 1500 కోట్లు ముందుగా సమకూర్చుకోవటం మేలని సీఏ భావిస్తున్నట్టు తెలుస్తోంది