Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి : ప్రపంచం కరోనా వైరస్ మహమ్మారిపై పోరాటం చేస్తుంది. కరోనా వైరస్ బాధితులు, మృతుల సంఖ్య రోజురోజుకూ గణనీయంగా పెరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా పరిస్థితి భయానకంగా ఉన్నప్పటికీ.. భారత్లో ఏప్రిల్ ఆఖరు వరకు పరిస్థితులు అదుపులోకి వస్తాయనే అంచనాలు వినిపిస్తున్నాయి. లాక్డౌన్ ఎత్తివేయటం, కొనసాగించటం ప్రస్తుతానికి ఊహాగానమే అయినా, ఎటువంటి పరిస్థితుల్లోనైనా ఐపీఎల్ కోసం ప్లాన్ సిద్ధంగా ఉంచుకోవాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భావిస్తోంది. అందుకే ఐపీఎల్ నిర్వహణపై ఇతర దేశాల క్రికెట్ బోర్డులతో నిత్యం సంప్రదింపులు జరుపుతోంది. ఈ మేరకు బీసీసీఐ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డులతో పరిస్థితులపై బీసీసీఐ టచ్లో ఉందని ఆ అధికారి తెలిపారు. ' ఖాళీ స్టేడియాల్లో ఐపీఎల్ నిర్వహణ, కుదించిన లీగ్పై చర్చ జరిగింది. ఏ రూపంలో జరిగినా ఐపీఎల్లో భాగస్వామ్యం అయ్యేందుకు ప్రపంచవ్యాప్తంగా అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అందుకే, ఇక్కడ నెలకొన్న పరిస్థితులు, పురోగతి, ప్రభుత్వ మార్గదర్శకాలు, కరోనాపై చేస్తున్న పోరాటం అంశాలను ఇతర బోర్డులతో పంచుకుంటున్నాం' అని బీసీసీఐ అధికారి అన్నారు. భారత స్టార్ క్రికెటర్లతో పాటు విదేశీ స్టార్స్ ఆడుతుండటం ఐపీఎల్ను ప్రత్యేకంగా నిలుపుతోంది. విదేశీ క్రికెటర్లు లేకుండా ఐపీఎల్ నిర్వహణ అనుమానమే. ' అంతర్జాతీయ సరిహద్దులు మూసివేసిన విషయాలను సైతం అందరు గమనంలో ఉంచుకోవాలి. ఎందుకంటే ఐపీఎల్ 2020 ఎప్పుడు జరిగినా విదేశీ క్రికెటర్లు భారత్కు రావాల్సి ఉంటుంది. విదేశాల్లో లాక్డౌన్, సరిహద్దుల మూసివేతతో అది కుదరదు. ఒక్క భారత్లోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా కోవిడ్-19 అదుపులోకి వచ్చినప్పుడే ఐపీఎల్ నిర్వహణ కార్యరూపం దాల్చనుంది' అని సదరు అధికారి అభిప్రాయపడ్డారు.