Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-పార్ట్నర్ వేటలో శ్రీలంక, వెస్టిండీస్
-రానున్న ఆర్థిక సంక్షోభంపై భయాలు
ముంబయి : కరోనా వైరస్ కారణంగా క్రికెట్ స్తంభించింది. ఆస్ట్రేలియా లాభదాయకమైన తన వేసవి సీజన్ను పూర్తిగా కోల్పోయింది. రానున్న ఆర్థిక కష్టాలను పసిగట్టి రూ. 1500 కోట్ల అప్పు కోసం క్రికెట్ ఆస్ట్రేలియా బ్యాంకుల తలుపు తట్టినట్టు మెల్బోర్న్ నుంచి వార్తలు వస్తున్నాయి. క్రికెట్ అగ్ర దేశం ఆస్ట్రేలియా పరిస్థితి ఇలా ఉంటే, పేలవ ప్రదర్శనతో స్వదేశంలో క్రికెట్ ఆదరణ కోల్పోతున్న వెస్టిండీస్, శ్రీలంక పరిస్థితి ఊహించటం పెద్ద కష్టం కాదు. సుమారు ఆరు నెలలుగా వెస్టిండీస్ ప్రసార భాగస్వామి వేట కొనసాగిస్తోంది. అయినా, వెస్టిండీస్ క్రికెట్ బోర్డు కష్టాల నుంచి గట్టెక్కటం లేదు. ఈ ఏడాది జనవరి ఆరంభంలోనే టెన్ స్పోర్ట్స్తో వెస్టిండీస్ క్రికెట్ బోర్డు ప్రసార భాగస్వామ్య ఒప్పందం ముగిసింది. గతేడాది డిసెంబర్ నుంచి వెస్టిండీస్ నూతన భాగస్వామి కోసం అన్వేషిస్తోంది. కోవిడ్-19 కారణంగా స్పోర్ట్స్ బ్రాడ్కాస్టింగ్ మార్కెట్ నిస్తేజంగా మారింది. ఈ పరిస్థితుల్లో వెస్టిండీస్ క్రికెట్ బోర్డుకు న్యాయబద్దమైన విలువతో కూడిన కాంట్రాక్టు లభించే అవకాశాలు చాలా స్వల్పం. వెస్టిండీస్ స్వదేశీ సీజన్ జూన్లో న్యూజిలాండ్ సిరీస్, ఆ తర్వాత దక్షిణాఫ్రికా సిరీస్తో ఆరంభం కానుంది. ఆలోగా ప్రసార భాగస్వామి దొరక్కపోతారా అనే సానుకూల దృక్పథంతో బోర్డు కనిపిస్తోన్నా.. ఇప్పటికే ఆర్థిక నష్టాల్లో ఉన్న బోర్డును కోవిడ్-19 దెబ్బ సంక్షోభంలోకి నెట్టే ప్రమాదం లేకపోలేదు.
పొరుగు దేశం శ్రీలంక పరిస్థితి సైతం ఇలాగే తయారైంది. భారత్లో కొనసాగుతున్న లాక్డౌన్ పరోక్షంగా శ్రీలంక క్రికెట్ బోర్డుకు ఎదురుదెబ్బ అయ్యింది. గత మూడు నెలలుగా శ్రీలంక క్రికెట్ బోర్డు పలు టెండర్లకు బిడ్లు ఆహ్వానించింది. జాతీయ జట్టు స్పాన్సర్షిప్, ప్రసార హక్కులు, డిజిటల్ హక్కులు, మైదాన హక్కులు, ప్రోడక్షన్ హక్కులు, శ్రీలంకన్ ప్రీమియర్ లీగ్ హక్కుల(ఎస్ఎల్పీఎల్)కు టెండర్లు ఆహ్వానించింది. ప్రతి టెండరు గడువు పొడగించటం మినహా మరో పురోగతి సాధించలేదు. శ్రీలంక క్రికెట్ బోర్డుకు ఇటువంటి టెండర్లకు బిడ్లు భారత్ నుంచే వస్తాయి. భారత్లో లాక్డౌన్ కొనసాగుతుండటం, క్రీడా రంగం స్తంభించిపోవటంతో ఈ సమయంలో శ్రీలంక క్రికెట్ బోర్డుకు భాగస్వాములు దొరకటం లేదు. దీంతో అన్ని టెండర్ల గడువును ఏప్రిల్ 15కు పెంచుతూ శ్రీలంక క్రికెట్ బోర్డు నిర్ణయం తీసుకుంది.